రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకాన్నిఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారులకు మరింత వేగంగా చేరేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే రోజుకు 400 వందల మంది చొప్పున ఇప్పటి వరకు 25,000 మంది అర్హులైన లబ్ధిదారులకు దళితబంధును అందించామని సీఎం కార్యదర్శి రాహుల్ బొజ్జా.. ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్ర సర్కారు ముందస్తుగానే దళితబంధు కోసం నిధులను విడుదల చేసిందని, ఈ నేపథ్యంలో గుర్తించిన అర్హులకు నిధులను అందించడంలో జాప్యం జరుగొద్దన్నారు. దళితబంధు పథకాన్ని మరింత ప్రభావవంతంగా, వేగవంతంగా అమలు చేసేందుకుగానూ త్వరలో జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. దళితబంధు పథకం అమలవుతున్న విధానంపై దేశం నలుమూలలనుంచి ప్రశంసలు అందుకుంటున్నామని చెప్పారు.
ఈ పథకం అమలు ద్వారా మనం అనుకున్నదానికంటే ఎక్కువగా ఫలితాలు అందుతాయని సీఎం వివరించారు. దళితబంధు కోసం చేస్తున్న ప్రతి రూపాయి పెట్టుబడిగా మారి, తిరిగి లాభాలను ఆర్జించి పెడుతుందన్నారు. అది సామాజిక పెట్టుబడిగా మారి, వ్యవసాయ రంగానికంటే గొప్పగా స్పిల్ ఎకానమీకి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. దళితబంధు పెట్టుబడి ద్వారా జరిగే వ్యాపార, వాణిజ్యాలు.. తద్వారా తిరిగి వచ్చే లాభాలు రాష్ట్ర జీఎస్టీపీని పెంచడంలో దోహదపడుతాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే దళితబంధు ద్వారా అందిన ఆర్థిక సాయం ద్వారా వ్యాపార, వృత్తి రంగాల్లో దళితులు సాధిస్తున్న విజయాలే అందుకు తార్కాణం అని వెల్లడించారు.
ఏడాదికి రెండు లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని సీఎం కేసీఆర్ సూచించారు.. తద్వారా దళిత యువతలో వున్న నిరాశ, నిస్పృహలు తొలగిపోయి ఉత్సాహం పెరుగుతుందన్నారు. వారు వివిధ వృత్తులు, వ్యాపారాల్లో భాగస్వాములు కావడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. దవాఖానలు ఫెర్టిలైజర్ షాపుల లాంటి ప్రభుత్వం లైసెన్స్ అమలు పరుస్తున్న ప్రతి విభాగంలో దళితులకు రిజర్వేషన్లు ఏర్పాటు చేసి, వారికి అవకాశాలు కల్పించాలని సీఎం పునరుద్ఘాటించారు.