CM KCR | వరంగల్ : ఎన్నికల్లో గెలవడానికి కొంతమంది దుర్మార్గులు పచ్చి అబద్దాలు చెబుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. వర్ధన్నపేట రింగ్ రోడ్డు కోసం ల్యాండ్ ఫూలింగ్ చేస్తారని పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఆరూరి రమేశ్పై నేరుగా గెలిచే దమ్ము లేనోళ్లు ఈ ప్రచారాలు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను హామీ ఇస్తున్నా. ఆ రింగ్ రోడ్డుకు పూలింగ్ బీలింగ్ లేదు. ఏమీ ఉండదు. ఎవరి జాగల నష్టం జరగదు. ఇది నామాట అని మనవి చేస్తున్నా. ఓటు వేసే ముందు ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటేయాలి అని వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రంసగించారు.
ఈ రోజు మళ్లీ ఎన్నికలు వచ్చాయి.. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయని కేసీఆర్ తెలిపారు. 24 ఏండ్ల క్రితం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన రోజు ఎవరికీ కూడా నమ్మకం లేదు. చాలా అవమానాలు, అవహేళన చేశారు. మనతో పొత్తు పెట్టుకుని గెలిచి 14 ఏండ్లు ఏడిపించి, యువకుల చావులు చూసి, నేను చావు నోట్లో తలకాయపెట్టి ఆమరణ దీక్ష చేస్తే, అప్పుదు దిగి వచ్చి రాష్ట్రం ఇచ్చారని కేసీఆర్ గుర్తు చేశారు.
సంసారాన్ని చక్కదిద్దకుకున్నట్టు ఒక్కో పనిని పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నాం అని కేసీఆర్ తెలిపారు. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాలను కాపాడుకుంటున్నాం. ఏ కులాన్ని, వర్గాన్ని వదిలిపెట్టకుండా.. అందరికీ న్యాయం చేసే దిశగా ముందుకు పోయాం. కరెంట్, సాగు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేసుకున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇవాళ కొంత మంది నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు అని కేసీఆర్ ధ్వజమెత్తారు. వాళ్లకు తెలంగాణ మీద అధికారం, పెత్తనం కావాలి. ప్రజల సంక్షేమం, బాధలు పట్టలేదు. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ హయాంలో కరెంట్, ఎరువుల పరిస్థితి ఎలా ఉండేనో మీకు తెలుసు. ఆరూరి రమేశ్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట అన్ని రంగాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించింది. ఎస్సారెస్పీ కాలువల్లో చెట్లు మొలిచి ఉండే. ఆరూరి రమేశ్ నాయకత్వంలో ఆ కాలువలన్నింటినీ బాగు చేసుకున్నాం. నీళ్లు తెచ్చుకుని పంటలు పండించుకుంటున్నాం. ఐనవోలు, హసన్పర్తి మండలాలకు దేవాదుల నుంచి నీళ్లు తెచ్చుకుని పండటలు పండించుకుటున్నాం. రూ. 160 కోట్లతో వర్ధన్నపేట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు.