కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనం అని ఖరాఖండిగా చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వరి సాగు చేసే వాళ్లకు రైతుబంధు రాదని ప్రతిపక్షాలు విష ప్రచారాన్ని చేశాయి. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ గతంలో మాదిరిగానే ప్రతి ఒక్కరికి రైతు బంధుని అందజేశారని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రైతులకు ఇచ్చిన మాట తప్పని గొప్ప నేత సీఎం కేసీఆర్. రైతుల బాగు కోసం పరితపించే ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని అన్నారు. నిన్నటి నుంచి ఎకరాకు 10వేలు అందజేసే రైతుబందు పథకం ఎనిమిదో విడత కార్యక్రమం ప్రారంభమైందన్నారు.
బుధవారం కరీంనగర్ నియోజకవర్గం గోపాలపూర్లో సీఎం చిత్ర పటానికి మంత్రి కమలాకర్ పాలాభిషేకం చేశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ రాబడులు తగ్గి ఇబ్బంది నెలకొన్నా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదన్నారు. కల్యాణలక్ష్మి, ఆసరా ఫించన్లు, ఉచిత కరెంటు, రైతుబంధు వంటివి నిరంతరాయంగా అందిస్తున్నామన్నారు.
ఈ యాసంగిలో రైతులు ఇష్టమైన పంట వేసుకోవడానికి అనుమతి ఉందని, ఐతే యాసంగిలో కేంద్రం వరి వేయొద్దని, కొనమని చెప్పడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. మిల్లర్లతో, ఇతరత్రా ఒప్పందాలు ఉన్నవాళ్లు సొంత ఏర్పాట్లతో వేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో జెడ్పిటిసి పురమల్ల లలిత, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, పాక్స్ చైర్మన్లు శ్యామ్ సుందర్ రెడ్డి, బల్మూరి ఆనందరావు, సర్పంచ్ మంజుల, నాయకులు మంద రాజమల్లు దుర్షెడ్ ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్ రావు, జువ్వాడి రాజేశ్వర్ రావు, కో అప్షన్ సభ్యులు సర్వర్, తదితరులు పాల్గొన్నారు.