మల్లన్నసాగర్ జలాశయం జాతికి అంకితం
ప్రాజెక్టులోకి నీటిని విడుదలచేసిన కేసీఆర్
తెలంగాణలో నవ జలశకం ప్రారంభం
మల్లన్న పాదాలకు సీఎం జలాభిషేకం
నీరు రావడంతో ఆనందంలో రైతులు
సిద్దిపేట, ఫిబ్రవరి 23 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన తెలంగాణలోనే రెండో అతిపెద్ద రిజర్వాయర్ కొమురవెల్లి మల్లన్నసాగర్ను బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించారు. దీంతో రాష్ట్ర జల చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సీఎం కేసీఆర్ పూజాదికాలు నిర్వహించి, పంప్హౌస్లో మోటర్లను ఆన్చేయగానే జలాశయంలోకి గోదారమ్మ ఎగిసిపడింది. ఈ పవిత్ర జలాలతో కొమురవెల్లి మల్లన్న పాదాలను సీఎం కేసీఆర్ అభిషేకించారు. తమ ప్రాంతానికి గోదావరి జలాలు రావడంతో రైతులు హర్షం వ్యక్తంచేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కాపూర్ పంప్హౌస్ వద్ద 50 టీఎంసీల సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవం బుధవారం కన్నుల పండువగా జరిగింది. మల్లన్నసాగర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద సీఎం కేసీఆర్ హెలికాప్టర్ 1.10 గంటలకు ల్యాండ్ అయింది. కేసీఆర్కు మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా కలెక్టర్, ఇతర నీటిపారుదల శాఖ అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అక్కడినుంచి కాన్వాయ్లో తుక్కాపూర్ పంపుహౌస్కు కేసీఆర్ బయలుదేరివెళ్లారు. అక్కడ టన్నెల్లో వేదపండితులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. టన్నెల్లో శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తర్వాత మోటర్లను ప్రారంభించారు. అక్కడి నుంచి డెలివరీ సిస్టర్న్ వద్దకు వెళ్లారు. అక్కడ మంత్రి హరీశ్రావు చేత గుమ్మడికాయ కొట్టించారు.
అనంతరం కేసీఆర్ గంగమ్మతల్లికి పసుపు, కుంకుమ వేసి చీరె సారెను సమర్పించారు. అక్కడే ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులతో కొద్దిసేపు సీఎం ముచ్చటించారు. అనంతరం బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకొన్నారు. సీఎం కేసీఆర్ తన కాకా.. బాలకిషన్రావును ఆత్మీయ ఆలింగనం చేసుకొన్నారు. సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించినప్పుడు ప్రజలనుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సభలో మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డితోపాటు ఎంపీలు సంతోష్కుమార్, కొత్త ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యేలు సతీశ్కుమార్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రసమయి బాలకిషన్, పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, రఘునందన్రావు, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, ఫారూఖ్హుస్సేన్, వంటేరు యాదవరెడ్డి, రఘోత్తంరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, వంటేరు ప్రతాప్రెడ్డి, ఉప్పల శ్రీనివాస్గుప్తా, నీటి పారుదల శాఖ సెక్రటరీ రజత్కుమార్, ఈఎన్సీ హరిరామ్, నీటి పారుదల నిపుణులు వీ ప్రకాశ్, సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ, మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్గౌడ్, అడిషనల్ కలెక్టర్లు ముజామ్మిల్ ఖాన్, శ్రీనివాస్రెడ్డితో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.