హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): క్లిష్ట సమయంలో పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన ఘనత తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంసరణల ఫలాలు నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని తెలిపారు. పీవీ 102వ జయంతి (జూన్ 28) సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన సేవలను స్మరించుకున్నారు. స్థితప్రజ్ఞతతో భారతదేశాన్ని ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిపేందుకు పునాది వేసిన దార్శనికుడు, తనదైన శైలిలో రాజనీతిని, పాలనా దక్షతను ప్రదర్శిస్తూ దేశానికి మౌనంగా మేలు చేసిన ప్రధాని పీవీ అని కొనియాడారు. వారి సేవలను సమున్నతంగా గౌరవించుకునే బాధ్యత మన మీద ఉన్నదని, పీవీ గొప్పదనాన్ని గుర్తుంచుకునేందుకు జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. తెలంగాణ ఠీవి-మన పీవీ అని పునరుద్ఘాటించారు. పీవీ స్ఫూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని స్పష్టంచేశారు.
దేశంలో ఆర్థిక సంస్కరణల ఆద్యుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావేనని పలువురు నేతలు కొనియాడారు. పీవీ102వ జయంతిని పురస్కరించుకుని అసెంబ్లీహాల్లోని పీవీ నిలువెత్తు చిత్రపటానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండాప్రకాశ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, విప్ ఎంఎస్ ప్రభాకర్రావు, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, గంగాధర్గౌడ్, సురభి వాణీదేవి, దయానంద్, ఎల్ రమణ, అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు, బీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానిగా ఈ దేశానికి పీవీ చేసిన సేవలను స్మరించుకున్నారు. తన ఆలోచనలతో ఈ దేశానికి పీవీ సరికొత్త మార్గం చూపారని బండా ప్రకాశ్ ప్రశంసించారు. పీవీ గొప్ప దార్శనికుడని, పీవీ శతజయంతి వేడుకలను కేసీఆర్ దేశం గర్వపడేలా నిర్వహించారని దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. పనే దైవంగా విశ్వసించిన పీవీ ఆదర్శాలను సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి తెలిపారు. పీవీ తన జీవితం మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ కోసమే ధారపోసినా ఆ పార్టీ మాత్రం ఆయనకు సరైన గౌరవం ఇవ్వలేదని ఎమ్మెల్సీ ఎల్ రమణ విమర్శించారు.