హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ):గవర్నర్ బాకా ఊదడానికే అసెంబ్లీకి వచ్చారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఒకవైపు కేంద్రం ఇచ్చిన డబ్బులతోనే డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టినట్టు చెప్తూనే.. మరోవైపు తెలంగాణ పల్లెల్లో ఎక్కడా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టలేదంటూ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నదని చెప్పారు. అయితే బుధవారం రోజునే పార్లమెంటులో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని కేంద్రప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ):‘పాపం.. ఆ తమిళ అమ్మాయికేమీ తెలియదు. మొత్తం అబద్ధాల ప్రసంగం చేసింది’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి గవర్నర్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. జాయింట్ సెషన్లో గవర్నర్ ప్రసంగం లేకుంటే బాగుండేదని పేర్కొన్నారు. అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగం సత్యదూరమని చెప్పారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ):‘గవర్నర్ బయట శానా నరికింది. బయట పులి లెక్కన గాండ్రించింది కానీ, అసెంబ్లీ లోపల పిల్లి తీరున ప్రసంగించింది’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగం తర్వాత మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ‘అసలు ఆమెకు మాట్లాడ శాతగాదు. ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడింది. ఆమె భయం ఆమెది. అసెంబ్లీల కనబడాలని కనబడ్డది అంతే. పెద్దపెద్ద మాటలు నరికి.. లాస్ట్కొచ్చి తుస్సుమనిపించింది’ అని పేర్కొన్నారు.