CM KCR Public Meeting | బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం పూరించింది. తనకు అచ్చొచ్చిన హుస్నాబాద్ నుంచే సీఎం కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. హుస్నాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలో ఈశాన్య ప్రాంతంలో ఉంటుంది. ఇది కలిసొచ్చే అంశం కావడంతో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను కేసీఆర్ ఇక్కడే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేసిన అనంతరం.. హెలికాప్టర్లో హుస్నాబాద్ చేరుకుని ప్రసంగిస్తున్నారు.
మిషన్ భగీరథ ద్వారా నేరుగా గ్రామం ట్యాంకులో నీళ్లు పడుతున్నాయని సీఎం పేర్కొన్నారు. ఇలాంటి స్కీం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఐదు సంవత్సరాల నుంచి నీళ్ల సరఫరా బ్రహ్మాండంగా కొనసాగుతోంది. అలా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. చిగురుమామిడి మండలం ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉండే. తోటపల్లి బ్యారేజీ నుంచి నీళ్లు రావడంతో గ్రీన్ ఏరియాగా మారిపోయింది. ఇవన్నీ కూడా మీ కండ్ల ముందున్న నిజాలు అని కేసీఆర్ చెప్పారు.
హుస్నాబాద్కు కావాల్సిన పనులు రెండు మూడు ఉన్నాయి.. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరారు. ఎన్నికల తర్వాత ఐదారు నెలల్లో యుద్ధప్రతిపాదన పూర్తి చేసి ఇదే హాదాలో వచ్చి నీళ్లు వదులుతాం. శనిగరం ప్రాజెక్టు ప్రధాన కాల్వ పూర్తి కావాలని కోరుతున్నారు. ఆ ప్రాజెక్టు కట్ట లీకేజీలకు మరమ్మతులు చేస్తాం. ఈ ప్రాజెక్టును కాళేశ్వరంతో కలిపాం కాబట్టి గోదావరి నీటితో పంటలు పండుతాయి. వీరభద్ర స్వామి ఆలయం బాగా ఉంది. కొత్తకొండ జాతరకు చిన్నతంలో నేను కూడా వచ్చి మిఠాయి తిన్నాను. మన జానపదులు వచ్చి కొలిచే ఆలయం అది. దాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తాం. సిద్దిపేట – ఎల్కతుర్తి రహదారిని విస్తరించాలని కోరారు. దాన్ని కూడా పరిశీలిన చేస్తాం. ముల్కనూరులో కొత్త బస్టాండ్, ఎల్కతుర్తిలో ప్రభుత్వ కాలేజీ మంజూరు చేయిస్తాను అని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఒకప్పుడు హుస్నాబాద్కు హెలికాప్టర్లో వస్తే కండ్లల్లా నీళ్లొచ్చేవి. ఎక్కడ చూసినా బొగ్గునాళ్ల బొగడ. పంటలు ఉండేవి కాదు.. వేసిన మామిడి తోటలు.. బత్తాయి చెట్లు ఎండిపోతే కుండల్లో నీళ్లు తీసుకెళ్లి కాపాడుకున్న దుస్థితి ఉండేది. 600, 700 , 800 ఫీట్లు వేస్తే బోర్లు పడకపోయేది. హుస్నాబాద్ వాగుమీద ఎక్కడ ఒక్క చెక్డ్యామ్ ఉండేది కాదు. ఎక్కడ నీళ్ల చుక్క కనిపించేది కాదు.. ఇవాళ హెలికాప్టర్లో నుంచి రెండు, మూడు చెక్డ్యామ్లు కనిపిస్తున్నాయి. రెండు ఓడ్లు పట్టుకుని నీళ్లు కనిపిస్తున్నాయి. ఈ పద్ధతుల్లో మిషన్ కాకతీయ చేసుకున్నాం. చెక్డ్యామ్లు చేసుకున్నాం. కరెంటు పరిస్థితులు మంచిగ చేసుకున్నాం.
రైతుబంధు పెట్టమని నన్ను ఎవరు అడగలేదు. ఎవరు డిమాండ్ చేయలేదు. అసలు రైతుబంధు ఇవ్వాలనేది ఎన్నడూ లేకుండే. గతంలో రైతులు కట్టకపోతే వచ్చి దర్వాజాలు పీక్కపోయేది.. రైతులు ఊర్ల నుంచి పారిపోయేది. దానికి రివర్స్ చేసి.. రైతును కచ్చితంగా నిలబెట్టాలి. ప్రభుత్వ సపోర్టు లేకుండా వ్యవసాయం నిలవజాలదని.. దీనిపై స్టడీ చేసి రైతుబంధు తీసుకొచ్చినం. ఇప్పుడు 10వేలు ఇస్తున్నాం.
గతంలో పెన్షన్లు ఇచ్చిండ్రు.. ఎన్ని ఇచ్చిండ్రు.. మనం రూ.40 పింఛన్లు చూసినం.. రూ.70 పింఛన్లు చూసినం. అట్లనే 200 పెన్షన్లు చూసినం. నేను ముఖ్యమంత్రి అయినంక ఒక్కటే అడిగిన..' పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి? దానికి పర్పస్ ఉందా? గాలికిస్తామా? లేదా ఓట్లు ఎందుకిస్తాం? అసలు పెన్షన్లు ఎందుకివ్వాలి?'. దానికి మహాత్ములంతా లెక్కలు తీసి.. ఇప్పుడు 200 ఉంది కదా.. 400 చేద్దాం అన్నారు. 400, 600 కాదయ్యా.. అసలు పెన్షన్లు ఎందుకివ్వాలని అడిగినా? ఏం కారణం చేత ఇస్తమని అడిగిన? అసలు కారణమేంటంటే.. దురదృష్టవశాత్తూ మానవ సమాజంలో కొందరు విధివంచితులు ఉంటారు. కొందరు ఇబ్బందులు ఉండేవాళ్లు ఉంటారు.. మంచిగ ఉండే మనిషి కూడా యాక్సిడెంట్లో కాళ్లు, చేతులు పోగొట్టుకోవచ్చు. కొందరు పుట్టుకతో అంధులుగా ఉంటారు.. భర్తలు చనిపోయి ఆలనాపాలన లేని స్త్రీలు ఉండొచ్చు. పిల్లలు సరిగ్గా చూడని వృద్దులు ఉండొచ్చు.. ఒంటరి మహిళలు ఉండొచ్చు. వాళ్లందర్నీ ఆదుకోవాల్సిన బాధ్యత సమాజానిదే అని ఆలోచించి.. ఆ ఆఫీసర్ల మాట వినకుండా.. మొదట వెయ్యి రూపాయలు చేసిన. వెయ్యి చేసిన పింఛన్లను టర్మ్ తిరగకుండా 2వేలకు తీసుకెళ్లినం. పెన్షన్లు 5వేలు చేయబోతున్నమని ఇవాళ హైదరాబాద్లో ప్రకటించిన. అది కూడా కేవలం ఓట్ల కోసమో.. ఒక్కటే రోజులో.. రేపే ఇస్తమని చెప్పట్లేదు. ప్రభుత్వం రాగానే మార్చి నెలలో రూ.3వేలకు తీసుకెళ్తాం. ప్రతి ఏడాది 500 పెంచుతూ.. ఐదేండ్లు ముగిసేనాటికి 5వేల పెన్షన్ చేసుకుంటాం.
కొన్ని పార్టీలు వచ్చి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు.. కానీ 10 ఛాన్స్లు ఇచ్చిండ్రు కదా.. 60 ఏండ్లు మీరే రాజ్యం ఎలగబెట్టిండ్రు కదా! దళిత బిడ్డలు ఆలోచన చేయాలి. దళితులు పేదరికంలో మగ్గుతున్నరంటే.. 75 సంవత్సరాల స్వతంత్య్రం తర్వాత ఇంకా పేదరికం కమ్ముకుని ఉన్నదంటే దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాలి. మనందరం కూడా బాధపడాలి. 60, 70 ఏండ్ల కింద దళితబంధులాంటి పథకం ప్రారంభించి ఉంటే.. ఇవాళ దళితుల్లో ఎందుకు పేదరికం ఉండేదనేది ఆలోచించుకోవాలి. ఈ విధానలోపం ఎవరిది? ఇవాళ ఎవరైతే ఒక్క ఛాన్స్ అడుగుతున్నరో.. వాళ్లకు 10, 12 ఛాన్స్లు ఇచ్చిండ్రు.. వాళ్లేం చేయలేదు.
తొమ్మిదిన్నర సంవత్సరాల కింద తెలంగాణ పరిస్థితి ఏంది? ఏవిధంగా ఉండే? ఎక్కడ చూసిన భయమయ్యే పరిస్థితి.. వలసలు, కరువు, సాగునీరు లేదు.. మంచినీళ్లు లేవు.. కరెంటు లేదు.. ఆర్థిక పరిస్థితి ఎట్ల ఉంటదో తెలియదు.. కొత్త కుండలో ఈగ సొచ్చినట్టు.. కొత్త సంసారం.. ఎక్కడ మొదలుపెట్టాలి.. ఎక్కడికి తీసుకెళ్లాలి.. ఏవిధంగా పైకి తీసుకెళ్లాలి. రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజానీకాన్ని ఎలా ఆదుకోవాలనే పెద్ద జటిలమైన సమస్య ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మీదనే బాధ్యత పెట్టిండ్రు కాబట్టి చాలా బాధ్యతగా.. ఆర్థిక నిపుణులను అందర్నీ రప్పించి.. రెండు మూడు నెలల పాటు మేదోమదనం చేసినం. మెదడు కరగదీసినం
సభలో చెప్పే మాటలు ఇక్కడే విడిచిపెట్టి పోవద్దు.. మీ బస్తీకో.. పట్టణానికో తండాకో వెళ్లిన తర్వాత కేసీఆర్ చెప్పినదాంట్లో నిజమెంత అబద్ధమెంత అనేది ఆలోచించాలి. ఎన్నికలు చాలా వస్తాయి... పోతాయి. కానీ ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దు.. రవుతు ఏదో.. రత్నమేదో ఆలోచించాలి. మనకు పనికొచ్చేది ఏదో గుర్తుపట్టాలి. ఎవరో చెప్పిండ్రు అని అలవోకగా ఓటేయొద్దు.. ఓటు మన తలరాతను మారుస్తది.. మన తాలూకా.. జిల్లా.. రాష్ట్ర భవిష్యత్తును మారుస్తది. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి.. మా బామ్మర్ది.. మా మేనమామ చెప్పిండు అనే పద్దతిలో ఓట్లు వేయొద్దు.. అది బంద్ కావాలి.. ఆలోచించి.. స్పష్టమైన విధానంతో ఓటింగ్ జరిగినప్పుడే ప్రజలు గెలుస్తరు.
హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి దయతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సెంచరీ కొట్టి తీరుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విశ్వాసం వ్యక్తం చేశారు. మీ ఫోన్లలో బీఆర్ఎస్ మేనిఫెస్టోలను ఇప్పటికే చూసి ఉంటారని హరీశ్రావు తెలిపారు. మేనిఫెస్టో చూసి ప్రజలందరి హృదయాలు ఉప్పొంగిపోతున్నాయి. ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ దురదృస్టవశాత్తు ప్రతిపక్షాల గుండెలు వణికిపోతున్నాయి. మా పని అయిపోయిందని అనుకుంటున్నారు. కేసీఆర్ మాట ఇస్తే తప్పడనే నమ్మకం తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ వెళ్తున్న.. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని తిరిగి వస్తా అని చెప్పారు. అది సాధ్యం చేశారు కేసీఆర్ అని హరీశ్రావు పేర్కొన్నారు.