హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. మాజీ స్పీకర్ మధుసూదనచారి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత దళిత బంధుపై ప్రస్తావించగా, కేసీఆర్ స్పందించారు. దళిత బంధు కేవలం రూ. 10 లక్షలిచ్చి మమ అనే కార్యక్రమం కాదు అని సీఎం అన్నారు. దళితుల గురించి అనేక ప్రయత్నాలు జరిగాయి. మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.. సర్పంచ్గా పని చేసిన కాలంలో సొంత గ్రామంలో 10 ఎకరాల భూమి(ఇప్పుడు రూ. 50 లక్షల విలువ) ఆరుగురు దళితులకు పంచి పెట్టారు.
అలా అనేక మంది ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వాలు కూడా కొన్ని కార్యక్రమాలు అమలు చేశాయి. కానీ అనుకున్న ఫలితాలు రాలేదు. ఆశలు నెరవేరలేదు. అందువల్ల వారు సఫర్ అవుతున్నాయి. అవన్నీ ఓవర్ కమ్ కావడానికి 10 లక్షలు ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే విషయంలో.. మెడికల్, వైన్, ఫర్టిలైజర్స్ షాపులతో పాటు మొదలైన వాటిలో ఎస్సీలకు రిజర్వేషన్లు పెడుతున్నాం. రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నాం. జబ్బు చేసినా, రోడ్డుప్రమాదం జరిగినా కూడా దళిత బంధు రక్షణ నిధి నుంచి ఖర్చు పెడుతాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.