హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్టులతో తనది ఉద్యమ సంబంధం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తెలంగాణ జర్నలిస్టుల కృషిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జర్నలిస్టులకోసం వంద కోట్ల నిధిని ఏర్పాటు చేసిందని సీఎం తెలిపారు. మీడియా అకాడమీ ద్వారా జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటూ వస్తుందన్నారు. అక్రిడేషన్లు సహా జర్నలిస్టులకు అందాల్సిన అన్ని ప్రత్యేక సౌకర్యాలను అందిస్తున్నదని, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా జర్నలిస్టు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందనీ సీఎం కేసీఆర్ తెలిపారు.
భారత రాష్ట్ర సమితి ఏర్పాటు సందర్భంగా అభినందనలు, తమకు సంఘీభావం తెలిపేందుకు ఢిల్లీకి వచ్చిన మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఇతర జర్నలిస్టు నేతలతో సీఎం కేసీఆర్ శుక్రవారం మరోసారి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జర్నలిస్టు నేతలు పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పలు జర్నలిస్టు సమస్యలపై చర్చించారు. సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్, ఇంకా ఏవైనా సమస్యలుంటే పరిస్థితులను బట్టి చర్చించి పరిష్కరించుకుందామని చెప్పారు.
తెలంగాణ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయు) జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ను ఆహ్వానించగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
జర్నలిస్టు విషయాలపై సమన్వయం చేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్, అవ్వారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.