CM KCR | నాగర్కర్నూల్ : గతంలో వలసలు, కరువులకు నిలయంగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతం బ్రహ్మాండమైన అద్భుతాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.
నాగర్కర్నూల్ జిల్లాలో ఎస్పీ, కలెక్టరేట్ను పూర్తి చేసి తన చేత ప్రారంభించుకున్నందుకు జిల్లా యంత్రాంగానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. 19వ కలెక్టరేట్ను ఇవాళ ప్రారంభించుకున్నాం. గద్వాల, మంచిర్యాల కలెక్టరేట్ను కూడా త్వరలో ప్రారంభించుకోబోతున్నాం. ఇవాళ తెలంగాణ అనేక రంగాల్లో అగ్రభాగానా ఉంది. ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న ఇక్కడ ఉన్నారు. ఉద్వేగంతో చాలా గొప్పగా పాటలు రాస్తారు. సహజమైన కవి. వాగు ఎండిపాయేరా, పెద్ద వాగు ఎండిపాయేరా అని వెంకన్న పాటలు రాసారు. దుందుభి నది ఎలా కొట్టుకుపోయిందో వారు చెప్పారు. హెలికాప్టర్లో వస్తున్నప్పుడు ఆ వాగు మీద కట్టిన చెక్ డ్యామ్లు, నీటిని చూసి ఆనందించిపోయాం. నేను, జయశంకర్ సార్ కలిసి తిరుగుతుంటే.. పాలమూరు కరువు గురించి అనేకసార్లు మాట్లాడుకున్నాం. సూర్యాపేట నుంచి కల్వకుర్తి ప్రాంతమంతా ఎడారిలా ఉండేది. అలాంటి కల్వకుర్తిలో లక్ష ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మంచినీటి పథకంలో విజయం సాధించాం. అనేక అవార్డులు, రివార్డులు సాధించాం అని కేసీఆర్ తెలిపారు.
భారతదేశంలో ఐటీ ఉద్యోగాలకు హైదరాబాద్ నెలవుగా మారిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విధంగా ఈ 9 ఏండ్లలో అనేక విజయాలు సాధించాం. కరోనా, నోట్ల రద్దు బాగా దెబ్బతీసింది. మొత్తంగా ఏడేండ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించినందుకు ప్రభుత్వ ఉద్యోగులను అభినందిస్తున్నాను. అన్ని రంగాలు సమన్వయంతో కలిసి పని చేయడం వల్లే ఈ ప్రగతి సాధ్యమైంది. వలసలకు, కరువుకు నెలవైన జిల్లాలో అద్భుతమైన, బ్రహ్మాండమైన అద్భుతాలు జరుగుతున్నాయి. కన్నుల పండువగా పంటలు ఉన్నాయి. ప్రభుత్వం ఏ పిలుపునిచ్చినా యజ్ఞంలా, ఒక ధర్మకార్యంలా మీ స్థాయిల్లో పని చేశారు. దేశంలోని ఏ పల్లెలు కూడా మన పల్లెలకు సాటిరావు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి కావాలి. ధర్మం తప్పకుండా జయిస్తది అని కేసీఆర్ పేర్కొన్నారు.