CM KCR | నకిరేకల్ : బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యకు కమ్యూనిస్టు సోదరులంతా మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా ప్రసంగించారు.
ఇందిరమ్మ రాజ్యం అంటేనే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. ఎవ్వళ్లు ఏం చేసిండ్రు. ఎవరి చేతిలో అధికారం ఉంటే ఏం చేస్తరు. ఎవ్వళ్లు ప్రజల కోసం పాటు పడుతారు అనేది ఆలోచించి మీరు ఓటేసినట్టే అయితే మీకు లాభం జరుగుతది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నర్రా రాఘవరెడ్డి ఎండిపోయిన వరి కంకులు చూపిస్తుండే. కరెంట్ కోసం రోజు కొట్లాడుతుండే. విజయవాడ రోడ్డు అప్పుడప్పుడు బంద్ చేపిస్తుండే. అప్పుడుప్పుడు అసెంబ్లీలో కంకులు తెచ్చి చూపిస్తుండే. అటువంటి మహానాయకుడు ఈ గడ్డ మీద పుట్టారు. కమ్యూనిస్టు సోదరులకు మనవి చేస్తున్నా. ఇక్కడ మీరు పోటీలో లేరు. మీ ఓట్లు ఎవరికో వేసి మోరిలో పడేయకండి. ఒక ప్రగతికాముకమైన బీఆర్ఎస్ పార్టీకి దయచేసి వేయండి. లింగయ్యకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నా అని కేసీఆర్ కోరారు.
లింగయ్య ప్రజల్లో ఉండే మనిషి. ఆయన వ్యక్తిగత పనులు ఏ రోజు అడగలేదు. కాల్వలు, అయిటిపాముల ఎత్తిపోతల, బ్రాహ్మణ వెల్లెంల, హాస్పిటళ్ల గురించి అడిగిండు. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, బ్రహ్మాండంగా గెలిపించండి. లింగయ్య గెలుపును ఎవడు ఆపలేడు. ప్రజా శక్తి ముందు వ్యక్తులు ఎవరేం చేయలేరు. కాయలు ఉన్న చెట్టు మీదనే రాళ్లు పడుతాయి. రందీ పడాల్సిన అవసరం లేదు. ఇంత ప్రజా శక్తి నీ వెంట ఉన్నది.. తప్పకుండా విజయం నీదే.. అందులో అనుమానమే లేదు. లింగయ్యను గెలిపించండి.. ఇది వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి, ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని కేసీఆర్ హామీ ఇచ్చారు.