హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మహారాష్ట్రలోని కొల్హాపూర్లోగల అంబాబాయి మహాలక్ష్మి అమ్మవారిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దంపతులు దర్శించుకొన్నారు. గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి కొల్హాపూర్కు చేరుకొన్న సీఎం కేసీఆర్ను స్థానిక ఎయిర్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ కమల్ కటారియా సత్కరించారు. అక్కడి నుంచి ఆలయానికి చేరుకొన్న ముఖ్యమంత్రి దంపతులకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కరవీర నివాసిని అంబాబాయి మహాలక్ష్మి అలంకార పూజలో కేసీఆర్ కుటుంబం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించింది.
అనంతం మీడియాతో మాట్లాడిన సీఎం, దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని కోరుకొన్నానని తెలిపారు. పూజల అనంతరం మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ గవర్నర్ డీవై పాటిల్, ఆయన మనుమడు రుతురాజ్ పాటిల్తో సీఎం కేసీఆర్ సమావేశమై దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. దేశ రాజకీయాలపై కేసీఆర్ స్పందిస్తున్న తీరును డీవై పాటిల్ అభినందించి, ఇదే ఒరవడితో ముందుకు సాగాలని కోరినట్టు తెలిసింది. పర్యటన అనంతరం సీఎం తిరిగి హైదరాబాద్ చేరుకొన్నారు. సీఎం వెంట ఎంపీ సంతోష్కుమార్, నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్రావు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్కుమార్ ఉన్నారు.