హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం శాస్ర్తోక్తంగా కొనసాగుతున్నది. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రమంతా రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాలతో మార్మోగుతున్నది. గురువారం రెండోరోజు యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శికామసుందరీ దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి అవతారానికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు ప్రత్యేక హారతులు ఇచ్చారు.
సీఎం కేసీఆర్ దంపతులు రాజశ్యామల యంత్రాని కి, సుబ్రహ్మణ్య షడావరణ యంత్రానికి పూజ లు చేశారు. పండితులు 11సార్లు శూలినీ దుర్గ కవచ పారాయణం చేశారు. సర్వలోక సంరక్షణార్థం ఇంద్ర సూక్త హోమం, నవగ్రహ సూక్తహోమం కూడా నిర్వహించారు. షడావరణ సహిత మూల మంత్రాలతో సుబ్రహ్మణ్య కవచ యాగం చేపట్టారు. ఉదయాన్నే యాగశాలకు చేరుకున్న కేసీఆర్ దంపతులు.. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలతో కలిసి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. స్వరూపానందేంద్ర స్వామి స్వహస్తాలతో సాగిన రాజశ్యామల చంద్రమౌళీశ్వరుల నిత్య పీఠార్చనకు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రాష్ట్ర శ్రేయస్సును కాంక్షిస్తూ యజుర్వేద పండితులు ఘనస్వస్తి పలికారు. యాగం ఏర్పాట్లను ఎంపీ సంతోష్కుమార్ పర్యవేక్షిస్తుండగా, కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. యాగం శుక్రవారంతో ముగుస్తుంది. ఉదయం 11.10 గంటలకు పూర్ణాహుతికి ముహూర్తం నిర్ణయించారు. యాగం లో 3 లక్షలకుపైగా రాజశ్యామల అమ్మవారి మూలమంత్రాలను హవనం చేస్తున్నారు. యాగంలో తెలంగాణతో పాటు తమిళనాడు, ఏపీ, కర్ణాటకకు చెందిన 170 మంది పండితులు పాల్గొంటున్నారు.
అటు.. శతచండీ యాగంలో భాగంగా రెండోరోజు గణపతి పూజ, గోపూజ, యాగశాల పరిక్రమణం, చండికాపరమేశ్వరీ నవావరణ పూజ, శత సప్తశతి పారాయణములు, లక్ష నవాక్షరీ మంత్రజపము, లక్ష్మీనారాయణ హృదయ యాగం, త్రైలోక్యమోహనగౌరీ మూల మంత్రానుస్ఠానము చతుర్వేద పారాయణములు మహా మంగళ హారతీ, సువాసినీ కన్యకాపూజ మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు.