మొక్కులు తీర్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
సిద్దిపేట, ఫిబ్రవరి 23 : మల్లన్నసాగర్ నిర్మించి, గోదారి జలాలతో కొమురెల్లి మల్లన్నకు పాదాభిషేకం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తన మొక్కు తీర్చుకున్నారు. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామిని ఆయన పుట్టిన రోజైన బుధవారం సీఎం కేసీఆర్ దర్శించుకొన్నారు. మల్లన్నసాగర్ నుంచి రోడ్డు మార్గాన కొమురవెల్లి దేవస్థానానికి సాయంత్రం 4.05 గంటలకు సీఎం చేరుకొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఆలయ ఈవో బాలాజీ, ప్రధాన అర్చకులు మల్లికార్జునస్వామి, ఇతర అర్చకులు పూర్ణకుంభంతో కేసీఆర్కు స్వాగతం పలికారు. మల్లన్న సన్నిధిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి 5 కలశాల్లో తీసుకువచ్చిన గోదావరి జలాలను అర్చకులకు అందించారు. నీటికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, మల్లన్నస్వామి పాదాలకు అభిషేకంచేశారు. అర్చకులు కేసీఆర్కు తీర్ధప్రసాదాలు, జ్ఞాపికను అందించారు. అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు.