విలనీతో భయపెట్టి, కరుణరసంతో కరిగించి, హాస్యంతో అలరించిన నవరస నటనాసార్వభౌముడు కైకాల సత్యనారాయణ (87) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. బంజారా హిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కైకాల పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, నటశిఖరానికి నివాళులర్పించారు. సీఎంతో పాటు మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ నేత ఎస్ వేణుగోపాలాచారి తదితరులు కైకాలకు నివాళులర్పించారు.
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): పాత్ర ఏదైనా ఒదిగే నైజం.. నటనలో వైవిధ్యం.. విలక్షణ పాత్రలతో సుమారు ఆరు దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నవరస నటనా సార్వభౌముడు, మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ (87) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడువడంతో తెలుగు చిత్రపరిశ్రమ ఒక నటశిఖరాన్ని కోల్పోయింది. విలన్గా, తండ్రిగా, పౌరాణిక పాత్రల్లో ఒదిగి అత్యంత ఎత్తుకు ఎదిగిన కైకాల యముడి పాత్రల్లో తెలుగునాట చిరస్మరణీయుడిగా మిగిలిపోయారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్లతో పోటీపడి వందల చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అగ్ర దర్శకులు మొదలు నేటితరం డైరెక్టర్ల వద్ద పనిచేసిన ఆయన అహంభావం ప్రదర్శించే వారు కాదని చిత్రసీమలో ఇప్పటికీ చెప్తుతుంటారు.
తెలుగుజాతి గర్వించదగ్గ నటుడు: కేసీఆర్
విలక్షణ నటుడు, తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తి కైకాల సత్యనారాయణ మృతి తీరనిలోటు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. విలక్షణ పాత్రలు, వైవిధ్య నటనతో మూడుతరాల తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. బంజారాహిల్స్లోని కైకాల నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. సత్యనారాయణ పార్థివదేహానికి నివాళులర్పించి పుష్పాంజలి ఘటించారు. వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘అగ్రశేణి నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు. నవరస నటనా సార్వభౌమునిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొని అనేక అవార్డులు, సత్కారాలు అందుకొన్నారు.
కైకాలతో నాకు గొప్ప అనుబంధం ఉన్నది. నాటితరం హీరోలతో పోటీపడుతూ చాలా అద్భుతంగా నటించేవారు. ఏ పాత్ర ఇచ్చినా అందులో రాణించి మెప్పించేవారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కైకాలను కోల్పోవడం అత్యంత బాధాకరం. చివరివరకు కళామ్మతల్లిని నమ్ముకొని విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తి’ అని కొనియాడారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ను సీఎం ఆదేశించారు. నివాళులర్పించిన వారిలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, మహమూద్ అలీ, తలసాని, శ్రీనివాస్గౌడ్, సత్యవతి, సబిత, మల్లారెడ్డి, ఎర్రబెల్లి, ప్రశాంత్రెడ్డి, కొప్పుల, గంగుల, మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, మధుసూదనాచారి, పల్లా, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, బాల సుమన్, పార్టీ నేతలు ఎస్ వేణుగోపాలాచారి, దాసోజు, ఆంజనేయులు గౌడ్, ప్రతాని రామకృష్ణగౌడ్ తదితరులు ఉన్నారు. శనివారం మహాప్రస్థానంంలో కైకాల అంత్యక్రియలు జరుగనున్నాయి.