హైదరాబాద్ : టీ హబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. టీ హబ్-2 ప్రాంగణమంతా కేసీఆర్ కలియ తిరుగుతున్నారు. టీ హబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రత్యేకతలను అధికారులు సీఎం కేసీఆర్కు వివరిస్తున్నారు. కేసీఆర్ వెంట ఐటీ మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్తో పాటు పలువురు ఉన్నారు. దేశ, విదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు టీహబ్-2 ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
పనితీరులోనే కాదు.. భౌతికంగానూ హైదరాబాద్ ఐటీ కారిడార్లోనే ఎంతో ప్రత్యేకత కలిగిన భవనంగా టీ హబ్ 2.0 నిలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిర్మాణ శైలితో పాటు అత్యంత విశాలమైన 5 రోడ్ల కూడలిలో కొత్తగా రూపుదిద్దుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారు రూ.276 కోట్లతో అత్యాధునిక డిజైన్తో సాండ్ విచ్ ఆకారంలో దీన్ని నిర్మించారు. టీ హబ్ నుంచి 5 మార్గాల్లో వెళ్లేందుకు 100 అడుగుల నుంచి 120 అడుగుల రహదారులను నిర్మించారు.