హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్వాడీలను ఎలాంటి షరతులు లేకుండా ప్రధాన అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేయడానికి సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారని, ఈ దశలో సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలంగాణ మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ (బీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి స్పష్టం చేశారు. ఆమె హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ మినీ అంగన్వాడీ టీచర్లు ఎలాంటి సమ్మెలో పాల్గొనడం లేదని తేల్చిచెప్పారు. ఎవరూ ధర్నాలకు, సమ్మెకు వెళ్లొద్దని ఆమె పిలుపునిచ్చారు. కొన్ని యూనియన్లు అసత్యపు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. త్వరలో అప్గ్రేడ్ జీవోను విడుదల చేస్తామన్న అధికారుల హామీని తాము పూర్తిగా నమ్ముతామని స్పష్టం చేశారు. ఉత్తర్వులు జారీచేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని తెలిపారు.
చర్చలతోనే పరిష్కారం: భిక్షపమ్మ
అంగన్వాడీల సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకుందామని, సమ్మె అవసరమే లేద ని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్ప ర్స్ అసోసియేషన్ (టీఎన్జీ) నాయకురాలు భిక్షపమ్మ తెలిపారు. తమను పిలిచి అన్నం పెట్టి, పీఆర్సీ ఇచ్చి, ఇబ్బంది లేకుండా చూస్తున్న సీఎం కేసీఆర్ను తాము సంపూర్ణంగా నమ్ముతామని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని యూనియన్లు ఉనికి కోసం అంగన్వాడీలకు మాయమాటలు చెప్తున్నాయని, ఆ నేతలు తమ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ముందుగా అంగన్వాడీలను పర్మినెంట్ చేయించాలని హితవు పలికారు. అంగన్వాడీలంతా నిజాలను గ్రహించాలని ఆమె కోరారు.