Gaddar | పాటలపొద్దు గూకింది. ‘అమ్మా తెలంగాణమా’ అంటూ చేసిన ‘ఆకలి కేకల గానం’ అర్ధంతరంగా మూగబోయింది. దగాపడిన బతుకుల పక్షాన ‘మర్లవడ్డ రాగం’.. మరలిరాని లోకాలకేగింది! కష్టజీవుల కన్నీళ్ల విలువ తెలిసి, శ్రామికుల స్వేదం లెక్కగట్టలేమని పసిగట్టి, గోచీగొంగడి కట్టి, కర్రచేతబట్టి, కాలి గజ్జెకట్టి, కైగట్టి పోరుదారిలో నడిచిన పొద్దు అస్తమించింది! ‘బండెనక బండిగట్టి’ పాటమ్మను పల్లె పల్లెనా ఊరేగించిన ప్రజాయుద్ధనౌక అంతర్ధానమైంది. గుండెల్లో తూటాను దాచుకున్న పాట.. స్వతంత్ర పాలనకై, కుతంత్ర పాలనపై తూటాయై పేలిన పాట.. తెలంగాణ తల్లి ‘పాదం మీద పుట్టమచ్చయ్యి’, పొడుస్తున్న పొద్దుమీద కాలమై నడిచిన పాట.. మధ్యలోనే ఆగిపోయింది. ఆ పాట పేరు గద్దర్!! ముందు వెనకా ఏ విశేషణాలూ అక్కర్లేని మూడు అక్షరాల ‘చేతన’ గద్దర్. అసలు పేరు గుమ్మడి విఠల్రావు. ఆశువుగా పదాలల్లి, పాటల ఈటెలెత్తి కోట్లమంది గొంతుకై ఊరూరా ఉద్యమాన్ని ఉరకలెత్తించిన తొలితరం ప్రజా గాయకుడు ఇక లేరన్న వార్త అభిమాన లోకాన్ని దుఃఖ సాగరంలోకి నెట్టివేసింది. అనారోగ్యంతో అపోలో దవాఖానలో చికిత్సపొందుతూ ఆదివారం గద్దర్ కన్నుమూశారు.
గద్దర్ మరణవార్తతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గద్దర్ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియానికి తరలించారు. మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, వేముల, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తిస్తూ అధికారిక లాంఛనాలతో రాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించనున్నది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. అల్వాల్లో గద్దర్ స్థాపించిన మహాబోధి పాఠశాల ప్రాంగణంలో కడసారి వీడ్కోలు పలుకనున్నారు.
హైదరాబాద్/ సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ)/కంటోన్మెంట్/అమీర్పేట: ప్రజా గాయకుడు గద్దర్ (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని అమీర్పేటలో ఉన్న అపోలో స్పెక్ట్రా దవాఖానలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గద్దర్ కొద్ది రోజుల కిందట గుండెపోటుతో దవాఖానలో చేరి చికిత్స పొందుతున్న ఆయనకు ఈ నెల 3న బైపాస్ సర్జరీ జరిగిందని, కోలుకుంటున్నారని వైద్యులు ప్రకటించారు. ఊపిరితిత్తులు, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న గద్దర్ ఆరోగ్యం ఆదివారం మరింత క్షీణించింది. మధ్యాహ్నం 3 గంటలకు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. గద్దర్ మరణ వార్త తెలిసిన సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి చెందారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు. పలువురు ప్రజాగాయకులు, అనుచరులు, అభిమానులు, వామపక్ష నేతలు గద్దర్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన సతీమణి విమలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గద్దర్ భౌతికకాయాన్ని దవాఖాన నుంచి ప్రజలు, అభిమానులు, ఉద్యమకారుల సందర్శనార్థం ఎల్బీ స్టేడియానికి తరలించారు. సోమవారం మధ్యాహ్నం 11.30 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి అంతిమయాత్ర ప్రారంభమై వెంకటాపురంలో ఉన్న మహాబోధి పాఠశాలకు చేరుకుంటుంది. గద్దర్ కోరిక మేరకు స్కూల్ మైదానంలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు సూర్యం తెలిపారు. గద్దర్ మరణ వార్త తెలుకొని హైదరాబాద్ అల్వాల్ వెంకటాపురంలోని నివాసం వద్దకు బంధువులు, అభిమానులు, ఉద్యమకారులు, ప్రజా కళాకారులు, పలువురు ప్రముఖులు తరలిరావడంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన స్వగ్రామం మెదక్ జిల్లా తూప్రాన్లోని పాత హైవే రోడ్డు వెంట ఉన్న గద్దర్ ఇంటి వద్దకు గ్రామస్థులు, అభిమానులు వచ్చి చూసిపోతున్నారు.
తన జీవితకాలం ప్రజల కోసమే బతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్.. తెలంగాణ గర్వించే బిడ్డ అని సీఎం కేసీఆర్ తెలిపారు. జీవితాంతం ఆయన చేసిన త్యాగాలు, ప్రజాసేవకు గౌరవ సూచకంగా దివంగత గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు గద్దర్ కుటుంబసభ్యులతో మాట్లాడి తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం ఆదేశించారు.
గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్రావు. మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలో ఓ నిరుపేద దళిత కుంటుంబంలో 1949 జూన్ 5న శేషయ్య, లచ్చమ్మ దంపతులకు జన్మించారు. విద్యాభ్యాసం నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్య పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచి పోరాట భావాలు కలిగిన గద్దర్.. తెలంగాణ వెనుకబాటుతనాన్ని, వలస పాలకుల ఆధిపత్యంలో శిథిలమవుతున్న తెలంగాణ జీవనచిత్రాన్ని కళ్లారా చూశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే సమస్యలన్నింటికీ పరిష్కారమని గద్దర్ భావిస్తూ వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
ఉద్యమ భావవ్యాప్తికి బుర్రకథను గద్దర్ మాధ్యమంగా ఎంచుకున్నారు. ఓ రోజు ఆయన ప్రదర్శనను చూసిన సినీ దర్శకుడు బీ నరసింగరావు.. భగత్సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శన ఇవ్వాలని కోరారు. అంగీకరించిన గద్దర్ ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత నరసింగరావు ప్రోత్సాహంతో ప్రతి ఆదివారం బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పంజాబ్లో జరిగిన గదర్ పోరును స్ఫూర్తిగా తీసుకొని పేరు గద్దర్గా మార్చుకున్నారు. 1971లో సినీ దర్శకుడు ప్రోత్సాహంలో ‘ఆపర రిక్షా’ అనే మొదటి పాట రాశారు. అలా మొదటి ఆల్బంకు గద్దర్ అనే పేరు పెట్టారు. ఆ పేరే స్థిరపడిపోయింది. ఆ తర్వాత మద్యపాన నిషేధం, తునికాకు, రైతు కూలి రెట్ల పెంపు, అక్షరాస్యత, కుటుంబ నియంత్రణ, పారిశుద్ధ్యం వంటి సామాజిక అంశాలపై గద్దర్ బుర్రకథలు ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. బుర్రకథలతోపాటు పాటలు కూడా రాసి, సొంతంగా పాడారు.
1975లో గద్దర్కు కెనరా బ్యాంకులో క్లర్క్గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రాగానే విమలను వివాహమాడారు. వారికి ముగ్గురు పిల్లలు. 1978లో జగిత్యాల జైత్రయాత్రతో ప్రభావితుడై గద్దర్ విప్లవ ఉద్యమంతో మమేకమయ్యారు. అదే భావజాలంతో తన పిల్లలకు సూర్యం, చంద్రం, వెన్నెల అని పేర్లు పెట్టారు. చంద్రం 2003లో అనారోగ్యంతో మరణించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా వచ్చిన మా భూమి సినిమాలో గద్దర్ సాయుధ పోరాట యోధుడు యాదగిరిపాత్రలో నటించారు. ‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లే పోతవు కొడుకో నైజాము సర్కరోడా’ అనే పాటను గద్దర్ స్వయంగా పాడి గజ్జె కట్టి ఆడారు. ఈ పాట తెలుగు జాతిని కదిలించడంతోపాటు గద్దర్కు విశేష గుర్తింపు తెచ్చింది. 1984లో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి 1985లో కారంచేడులో దళితులపై జరిగిన హత్యాకాండకు వ్యతిరేకంగా పోరాటం జరిపారు. జన నాట్యమండలిలో క్రియాశీల సభ్యుడిగా చేరారు. గ్రామాల్లో జరుగుతున్న అన్యాయాలను, అకృత్యాలను ఎదురించడంతోపాటు ప్రజలను, ప్రత్యేకించి దళితులను మేల్కొలిపేందుకు వారిని చైతన్య పరచేందుకు 1972లో జననాట్య మండలి ఏర్పటైంది.
ప్రజాగాయకుడు గద్దర్ మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. ఆయన మృతి అణగారిన, అట్టడుగువర్గాలకు తీరని లోటని అన్నారు. తన ఆట, పాటలతో లక్షలాది మంది అభిమానాన్ని చూరగొన్నారని డిప్యూటీ స్పీకర్ పద్మారావు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడమేకాకుండా.. తనదైన పాటలతో అందరిని కదిలించిన గొప్ప ప్రజా గాయకుడు గద్దర్ అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. గద్దర్ మృతి బాధాకరం అని, అణగారిన, అట్టడుగు వర్గాలకు తీరని లోటని, 1978లో వరంగల్ ఆర్ఈసీలో తొలిసారి తాను ఇంటర్ విద్యార్థిగా గద్దర్ను చూశానని, విద్యార్థులను ఉద్దేశించి ఉర్రూతలూగించే గద్దర్ ప్రసంగాలు తననూ ఎంతగానో అకట్టుకున్నాయని, స్ఫూర్తిని నింపాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. తన పాటతో ప్రజలను చైతన్యం చేసిన గద్దర్ జనం గుండెల్లో చిరకాలం జీవించే ఉంటారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. గద్దర్ ప్రసంగాలు, పాటలు ప్రజలలో స్ఫూర్తి నింపాయని, అట్టడుగు వర్గాలకు గొంతుకై నిలిచారని మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, పువ్వాడ అజయ్, శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమలాకర్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రాష్ట్ర సాంస్కృతిసారథి, ఎ మ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు గోర టి వెంకన్న, తాతా మధుసూదన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ, కత్తి పద్మారావు, తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా, మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్, సినీ డైరెక్టర్ ఎన్ శంకర్ తదితరులు సంతాపాన్ని తెలిపారు.
1997 ఏప్రిల్ 6న ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గద్దర్పై కాల్పులు జరిపారు. ఆయన శరీరంలోకి ఆరు బుల్లెట్లు దిగాయి. వైద్యులు ఆపరేషన్ చేసి తూటాలు తొలగించినా.. వెన్నుపూస భాగంలో ఒక్క బుల్లెట్ మాత్రం అలాగే ఉన్నది. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. తుదిశ్వాస విడిచే వరకు ఆయన దేహంలోనే ఆ బుల్లెట్ ఉండిపోయింది. తనపై జరిగిన హత్యాయత్నాన్ని వర్ణిస్తూ..మీ పాటనై వస్తున్నానమ్మో..’ అంటూ పాటకు మరణం లేదని, పోరాటమే పాట లక్ష్యమని గద్దర్ వర్ణించారు.
‘గుమ్మడి విఠల్ నా పేరు. గద్దర్ నా పాట పేరు. నా బతుకు సుదీర్ఘ పోరాటం. నా వయస్సు 76 సంవత్సరాలు. నా వెన్నుపూసలో ఇరుకున్న తూటా వయస్సు 25 సంవత్సరాలు. ఇటీవల నేను పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతుగా ‘మా భూములు మాకే’ నినాదంతో పాదయాత్రలో పాల్గొన్నాను. నా పేరు జనం గుండెల చప్పుడు. నా గుండె చప్పుడు ఆగిపోలేదు. కానీ ఎందుకో గుండెకు గాయం అయ్యింది. ఈ గాయానికి చికిత్స కోసం అమీర్పేటలో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్లో ఇటీవల చేరాను. జూలై 20 నుంచి నేటి వరకు అన్నిరకాల పరీక్షలు, చికిత్సలు తీసుకుంటూ కుదుట పడుతున్నాను. వైద్య నిపుణుల నిరంతర పర్యవేక్షణలో వైద్యం అందుతున్నది. పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి మీ మధ్యకు వచ్చి సాంస్కృతిక ఉద్యమం తిరిగి ప్రారంభించి, ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నాను. ఇట్లు ప్రజా గాయకుడు మీ గద్దర్’ అని జూలై 31న మీడియాకు చివరిసారిగా బహిరంగ లేఖ పంపారు.
‘సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో.. లచ్చుమమ్మో..’ అని దళితుల దైన్యాన్ని పాటలో వివరించారు గద్దర్. తన పాటలను తన బృందంతో కలిసి క్యాసెట్లు, ఆల్బమ్స్, సీడీలుగా చేసి ప్రజలను చైతన్యం చేశారు. గద్దర్ గళం వినిపించిందంటే.. వేలాదిగా క్యాసెట్లు, సీడీలు అమ్ముడు పోయేవి. 1980 దశకంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా గద్దర్ పాటలే వినిపించేవంటే అతిశయోక్తి కాదు.
ప్రజలపై జరుగుతున్న అకృత్యాలను, అణచివేతలను ఎదుర్కొనేందుకు నక్సలైట్ ఉద్యమం పుట్టిందని భావించేవారు గద్దర్. నక్సలైట్ల ఉద్యమానికి సానుకూలంగా పాటలు పాడే వారు. ‘మల్లె తీగకు పందిరి వోలె..’ అంటూ సాగే ఒరేయ్ రిక్షా సినిమాలోని పాటకు గద్దర్కు రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు ప్రకటించగా గద్దర్ తిరస్కరించారు. గద్దర్ రాసిన అనేక పాటలు సినిమాల ద్వారా ప్రజలను చైతన్యం చేశాయి. ప్రత్యేకించి ఆర్ నారాయణ మూర్తి నిర్మించే విప్లవ నేపథ్యంలో సాగే అనేక సినిమాలకు గద్దర్ పాటలు రాశారు. 2011లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కిన జై బోలో తెలంగాణ చిత్రంలో గద్దర్ రాసిన.. ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగానమా’ అనే పాట ఉద్యమంలో మరింత ఊపునిచ్చింది. అదేసినిమాలో వెండితెరపై తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. 2019లో ఓ సినిమాకు పాట రాయడంతోపాటు చివరగా ఉక్కు సత్యాగ్రహం చిత్రంలో నటించారు.