కానిస్టేబుల్ కిష్టయ్య.. స్వరాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమరుడు. తెలంగాణ కంటే కుటుంబం, ఉద్యోగం ముఖ్యం కాదని జై తెలంగాణ అంటూ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొన్న త్యాగధనుడు. ఆ త్యాగం విలువ తెలిసిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు. చావు నోట్లో తల పెట్టొచ్చిన ఆయనకే తెలుసు.. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష, అమరుల కుటుంబాల ఆవేదన. అందుకే.. కిష్టయ్య కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
కిష్టయ్య భార్య పద్మావతికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించారు. ఆయన కొడుకు రాహుల్కు ఇంటర్ చదువుతుండగానే ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. కూతురు ప్రియాంకను మెడిసిన్ చదివించారు. రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. కరీంనగర్లో ఇల్లు కట్టించారు. అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ ఏ విధంగా ఆదుకున్నారో కిష్టయ్య కుటుంబాన్ని చూస్తే తెలిసిపోతుంది. అందుకే ప్రతి అమరుల కుటుంబంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ఆయనే మాకు దేవుడని ప్రతి ఇల్లూ కొనియాడుతున్నది.
కరీంనగర్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): కానిస్టేబుల్ పుట్టకొక్కుల కిష్టయ్య అప్పటి నిజామాబాద్ జిల్లా, ప్రస్తుత కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో పనిచేస్తుండగా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నది. తెలంగాణపై అప్పటి కేంద్ర ప్రభుత్వం మాట మార్చడంతో 2009 డిసెంబర్ 1న కామారెడ్డిలో టవర్ ఎక్కిన కిష్టయ్య జై తెలంగాణ నినాదం చేస్తూ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేశాడు. ఉద్యమ నేతగా కేసీఆర్ అప్పుడే ఆ కుటుంబానికి అండగా నిలిచారు. కారుణ్య నియామకం కింద కిష్టయ్య భార్య పద్మావతికి ఉద్యోగం ఇవ్వలేమని అప్పటి ప్రభుత్వం అనేక అభ్యంతరాలు చెప్పినా, పట్టుబట్టి 2010 నవంబర్లో పద్మావతికి ఇంటర్మీడియట్ బోర్డులో ఉద్యోగం ఇప్పించారు. అంతేకాదు.. 2014లో ముఖ్యమంత్రి అయ్యాక కరీంనగర్కు వచ్చినపుడు పద్మావతి, ఆమె పిల్లలను కలెక్టరేట్కు పిలిపించుకొని కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇల్లు లేదని చెప్తే ఒకే రోజులో కరీంనగర్లోని సప్తగిరికాలనీలో 2 గుంటల స్థలాన్ని మంజూరు చేయించారు. డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారంగా 2016లో అప్పటి ఎంపీ బీ వినోద్కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పద్మావతి ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. పద్మావతి ఇల్లు నిర్మాణం పూర్తి కావస్తున్నది.
నా భర్త (కిష్టయ్య) ప్రాణత్యాగం చేశాక కుటుంబం ఛిన్నాభిన్నం అవుతుందని భయపడ్డా. కానీ సీఎం కేసీఆర్ మాకు అండగా నిలబడ్డారు. నా తండ్రి స్థానంలో నిలిచి నా కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకొచ్చారు. సీఎం మా ఇంటికి వచ్చినపుడే గృహప్రవేశం చేస్తాం. నా బిడ్డ ప్రియాంక ఎంబీబీఎస్ పూర్తి చేసింది. సీఎం ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నది. అమరుల కుటుంబాలకు వచ్చినట్టే మాకు రూ.10 లక్షలు వస్తే బిడ్డ పెండ్లి కోసం ఫిక్స్ చేస్తానని అంటే.. నీ కూతురు పెండ్లి నేనే చేస్తా. డబ్బుని ఫిక్స్ చేసుకో అని సీఎం అన్నారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజే మా ఇంట్లో అసలైన పండుగ.
– పుట్టకొక్కుల పద్మావతి (కిష్టయ్య భార్య)