కేంద్ర ప్రభుత్వం ఏ పాలసీలైనా చేయవచ్చు. చెయ్యాలి. కేంద్రమే పాలసీలు రూపొందించి రాష్ర్టాల మీదకు వదలడం సరికాదు. భారత్ రాష్ర్టాల సమాహారం అని రాజ్యాంగం చెప్పిన విషయాన్ని బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. అందరినీ కలుపుకొని కేంద్రం పాలసీలు రూపొందిస్తే అవి విజయవంతమవుతాయి. ఏకపక్షంగా నిర్ణయిస్తే ఇబ్బందులొస్తాయి. రాష్ర్టాలను ఇబ్బంది పెట్టాలన్నదే ప్రస్తుత కేంద్ర విధానంగా మారింది.
-సీఎం కేసీఆర్
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): దేశంలో రాజకీయపరంగా కొన్ని సంచలనాలు జరగాల్సి ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ‘వ్యాపారస్థులు కలిస్తే వ్యాపారం గురించే మాట్లాడుకుంటరు..అట్లనే రాజకీయ నాయకులు కలిస్తే రాజకీయాలే చర్చించుకొంటారు. ఇందులో పెద్ద విషయమేమున్నది. దేశంలో కొన్ని సంచలనాలు జరగాల్సిఉన్నది.. ఏమేమి జరుగుతాయో భవిష్యత్తులో మీరే చూస్తారు’ అని పేర్కొన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల పట్ల అనుసరిస్తున్న తీరు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదని తెలిపారు. జాతీయ రాజకీయాలపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక, ఆర్థిక రంగాల నిపుణులతో సమాలోచనలు జరిపేందుకు ఆయన తన పది రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం సాయంత్రం దక్షిణ మోతీబాగ్లోని సర్వోదయ పాఠశాలను సందర్శించేందుకు వెళ్లారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సీఎం కేసీఆర్కు సాదర స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల సమావేశ మందిరంలో విద్యాభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను సీఎం కేసీఆర్ తిలకించారు. విద్యాభివృద్ధి దిశగా కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను, పాఠశాల విద్యాబోధన తదితర అంశాలపై ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సహా ఉన్నతాధికారుల బృందం సీఎం కేసీఆర్కు వివరించింది. ప్లే-వే విధానం ద్వారా విద్యార్థులకు అందుతున్న బోధన, ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలు, తరగతి గదుల నిర్వహణ, విద్యాబోధనలో ఉపాధ్యాయులు, విద్యార్థుల భాగస్వామ్యం, తరగతి గదులు, పాఠశాల ప్రాంగణాన్ని పర్యవేక్షిస్తున్న సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, హెడ్మాస్టర్ చాంబర్లో ఉన్న కమాండ్ కంట్రోల్ వ్యవస్థను సీఎం కేసీఆర్ పరిశీలించారు. పాఠశాల ప్రాంగణం, తరగతి గదులను ఆయన కలియ తిరిగి చూశారు. పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. సర్వోదయ పాఠశాలలో ఆయన గంటకుపైగా గడిపారు. అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో కలిసి మీడియాతో చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..
ఢిల్లీలో విద్యాబోధన భేష్
ఢిల్లీ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న బోధనను తెలుసుకొన్నాం. స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య.. వారికి అందుతున్న విద్య.. వారికి వస్తున్న మార్కులు.. భవిష్యత్లో వారు ఉపాధి అవకాశాలను సొంతం చేసుకొని తమ జీవితాలను తాము వెలిగించుకొనగలిగే యాక్టివ్ విద్యావిధానం ఢిల్లీలో ఉన్నది. పిల్లలతో మాట్లాడాను. వారు చాలా చురుకుగా ఉన్నారు. కొందరు పిల్లలైతే తాము ఎలాన్ మస్క్ (టెస్లా సీఈవో) లా అవుతామన్నారు. వారి ఆలోచన విధానమే పూర్తిగా మారిపోయింది. విద్యార్థుల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్వీకరించాలి. ఢిల్లీ ప్రభుత్వం విద్యాబోధనలో నూతన ఆవిష్కరణలు చేసింది. ఈ ఫలాలు భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగపడతాయి. ఢిల్లీలో ఎంతో గొప్పగా విద్యావ్యవస్థ ఉన్నది. నేను మనస్ఫూర్తిగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఢిల్లీ ప్రజలు ఎంతో అదృష్టవంతులు. వారికి ఎంతో మంచి సేవలు అందుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు అన్ని చోట్లా జరిగితే మన దేశంలో మంచి జరుగుతుంది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో ప్రాక్టికల్ విధానంలో విద్య నేర్పుతున్నారు. వాటి ఫలితాలు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి.
కేంద్రం ఏకపక్ష విధానం
కేంద్ర ప్రభుత్వం ఏ పాలసీలైనా చేయవచ్చు. చెయ్యాలి. కేంద్రమే పాలసీలు రూపొందించి రాష్ర్టాల మీదకు వదలడం సరికాదు. రాజ్యాంగం భారత్ రాష్ర్టాల సమాహారం అని చెప్పిన విషయాన్ని కేంద్రం విస్మరించింది. అందరినీ కలుపుకొని కేంద్రం పాలసీలు రూపొందిస్తే అవి విజయవంతమవుతాయి. ఏకపక్షంగా నిర్ణయిస్తే ఇబ్బందులొస్తాయి. రాష్ర్టాలను ఇబ్బంది పెట్టాలన్నదే ప్రస్తుత కేంద్ర విధానంగా మారింది.
త్వరలో ఢిల్లీకి రాష్ట్ర బృందం
కరికులం, పిల్లలకు వ్యాపార మెళకువలు, యాక్టివిటీలు ఇలా ఎన్నో రకాల విధానాలను అధ్యయనం చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఎంతో ప్రయత్నించింది. విదేశాలకు వెళ్లి నూతన విధానాలు తెలుసుకొని ఇక్కడ అమలు చేస్తున్నారు. మేం కూడా మా రాష్ట్రం నుంచి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలను ఇక్కడికి పంపిస్తాం. ఇక్కడి విధానాలు అధ్యయనం చేయిస్తాం. సీఎం అరవింద్ కేజ్రీవాల్కు నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. చాలా మంచి పనులు జరుగుతున్నాయి. దేశమంతటా ఇలాంటి పనులు జరగాల్సి ఉంది.
దేశంలో సంచలనం జరగాలి
వ్యాపారస్థులు కలిస్తే వ్యాపారం గురించే మాట్లాడుకుంటరు. అట్లనే రాజకీయ నాయకులు కలిస్తే రాజకీయాలు చర్చించుకుంటారు. ఇందులో పెద్ద విషయమేముంది, దేశంలో కొన్ని సంచలనాలు జరగాల్సి ఉన్నది. ఏమేమి జరుగుతాయో భవిష్యత్తులో మీరే చూస్తారు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్ రావడం మాకు గౌరవం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి రావడం.. అందులో ఢిల్లీ పాఠశాలను పరిశీలించడం చాలా గౌరవంగా ఉన్నది. సీఎం కేసీఆర్కు విద్య పట్ల చాలా ఆసక్తి ఉన్నది. పాఠశాల అంతా కలియతిరిగి చూశారు. పిల్లలతో, టీచర్లతో మాట్లాడారు. వారు చెప్తున్నంతసేపు చాలా ఆసక్తిగా విన్నారు. ఒక రాష్ట్రంలో జరిగే మంచిని మరోరాష్ట్రం అభినందించాలి. అట్లాగే ఇక్కడ జరిగే మంచిని ముఖ్యమంత్రి సహృదయంతో అభినందించారు. తెలంగాణలోనూ అనేక నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. అక్కడి ప్రజలు.. ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
– అరవింద్ కేజ్రీవాల్, ముఖ్యమంత్రి ఢిల్లీ
ఆ మాటలు ఎంతో సంతోషాన్నిచ్చాయి
కొన్ని రోజుల క్రితం కొన్ని టీవీల్లో చూశాను (ఢిల్లీ ఎన్నికల సమయంలో). కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో ఒక టీవీ రిపోర్టర్ ఒక పేద మహిళను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆమె చెబుతున్నది ‘మేం ఎలాంటి ఇబ్బంది లేకుండా మా పిల్లలను ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నాం. మా ఖర్చులు కూడా ఎంతో తగ్గుతున్నాయి’అన్నది. ఆ మాటలు విని నాకు చాలా సంతోషం అనిపించింది.
ప్రణయ్రాయ్తో సీఎం భేటీ దేశ ఆర్థిక, రాజకీయ అంశాలపై చర్చ
హైదరాబాద్, మే 21(నమస్తే తెలంగాణ): ప్రముఖ జర్నలిస్ట్, ఆర్థికవేత్త, రచయిత ప్రణయ్రాయ్తో సీఎం కేసీఆర్ శనివారం ఢిల్లీలో భేటీ అయ్యారు. దేశంలోని తాజా రాజకీయ పరిణామాలు, ఆర్థిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకూ క్షీణించడం, ఎప్పుడూ లేనంతగా రూపాయి విలువ పతనం కావడం, రాష్ర్టాలపై కేంద్రం పెడుతున్న ఆర్థిక ఆంక్షలు, రాష్ర్టాల అధికారాలను హరించడంవంటి పలు అంశాలపై చర్చించారు.