హైదరాబాద్: డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణలో సమూలంగా నిర్మూలించాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణపై స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ను ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోం మంత్రి, ఎక్సైజ్ మంత్రి, సీఎస్, డీజీపీ, డీజీలు, అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీ అధికారులు, రాష్ట్ర ఎక్సైజ్ పోలీస్ శాఖకు చెందిన ఎస్పీలు, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణ నుంచి తరిమేయాలన్నారు. డ్రగ్స్ సమాజానికి పట్టిన చీడ. పోలీసు అధికారులు వినూత్నరీతిలో బాధ్యత కలిగిన మానవులుగా ఆలోచనలు చేయాలి. సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరు సహకారం తీసుకొని డ్రగ్స్ను అరికట్టాలి. అందుకే అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ను ఏర్పాటు చేసుకోవాలి. 1000 మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాలి. అద్భుత పనిఈరు కనబరిచే సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. డ్రగ్స్ కట్టడిలో ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దు. తెలంగాణలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయి. అనతికాలంలోనే రాష్ట్రం అత్యద్భుతంగా అభివృద్ధి పతాన దూసుకుపోతోంది.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
నార్కోటిక్ డ్రగ్స్ వాడకం అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనమని, సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిది. ప్రజలను డ్రగ్స్ కు వ్యతిరేకంగా చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని సీఎం అన్నారు.
1000 మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు. ఇప్పటికే పలు అసాంఘిక శక్తులను వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గ్రే హౌండ్స్ తదితర వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయని, అదే మాదిరి, నార్కోటిక్ డ్రగ్స్ ను నియంత్రించే విభాగం కూడా శక్తి వంతంగా తేజోవంతంగా పని చేయాలన్నారు. అద్భుత పనితీరు కనపరిచే పోలీస్ అధికారులకు అవార్డులు రివార్డులు ఆక్సెలరేషన్ ప్రమోషన్స్ తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించాలన్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందనీ సీఎం స్పష్టం చేశారు.
డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని, ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలని పోలీసు అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, వి. శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కవితా నాయక్, బాల్క సుమన్, రెడ్యానాయక్, రవీంద్ర కుమార్ నాయక్, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, సుంకే రవిశంకర్, కృష్ణ మోహన్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, సాయన్న, రేఖా నాయక్, అబ్రహం, హన్మంతు షిండే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, సీఎంఓ అధికారులు నర్సింగ రావు, భూపాల్ రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, కమిషనర్లు, డీసీలు, పోలీస్ శాఖకు చెందిన రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, ఎస్పీలు, కమిషనర్లు, డీసీలు తదితరులు పాల్గొన్నారు.