కృష్ణా జలాల వివాదం పరిష్కరించటానికి 2004లో కేంద్రం ట్రిబ్యునల్ వేసింది. ఈరోజు వరకు ఉలుకూ పలుకూ లేదు. ఆ జడ్జిగారిని నలుగురు పట్టుకొచ్చి చెయిర్లో కూర్చోపెడ్తరు. 20 ఏండ్లు గడిచినా వాదనలే జరగకపోతే ఇక తీర్పులు ఎప్పుడు రావాలె? కేటాయింపులు ఎప్పుడు జరగాలె? ప్రాజెక్టుల డిజైన్లు ఎప్పుడు కావాలె? వాటికి అనుమతులు, క్లియరెన్స్లు ఎప్పుడు రావాలె? ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు జరగాలె? నీళ్లు ఎన్నడు రావాలె?
8 ఏండ్లలో రాష్ట్ర జీఎస్డీపీని రూ.6 లక్షల కోట్ల నుంచి రూ.11.5 లక్షల కోట్లకు మనం పెంచుకున్నం. తెలంగాణ కష్టపడిన స్థాయిలో కేంద్రం పనిచేసి ఉంటే.. ఈ రోజు రాష్ట్ర జీఎస్డీపీ రూ.14.5 లక్షల కోట్లు ఉంటుండె. కానీ కేంద్రం అసమర్థ, దుర్మార్గపూరిత విధానాల వల్ల ఒక్క తెలంగాణే 3 లక్షల కోట్లు నష్టపోయింది. మరి దేశం ఎంత నష్టపోయినట్టు?
ఇన్నేండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ఈ దేశం ఇట్లా ఎందుకున్నదో ఆలోచించండి. దేశంలో ప్రస్తుతం ఏం జరుగుతున్నదో ఆలోచించండి. ఇండ్లల్లో, గ్రామాల్లో, బస్తీల్లో పెద్దలతో చర్చ పెట్టండి. 10 నిమిషాలు కేటాయించి.. కేసీఆర్ చెప్తున్నదాంట్లో నిజమెంతో ఆలోచించండి. మీ తోటివారికి అవగాహన కల్పించండి. అదే చైతన్యశీలత. దీపంతో దీపం వెలిగించినట్టు చైతన్యవంతమైన సమాజం అప్పుడే తయారవుతుంది.
– సీఎం కేసీఆర్
వరంగల్, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్: చీకట్లు కమ్మిన దేశంలో చైతన్యజ్యోతిని వెలిగించాలని, ఆ వెలుగు వీచిక తెలంగాణ నుంచే ప్రసరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ప్రజలందరూ అందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎక్కడినుంచో ఓ వెలుగుదివ్వె, ఓ చైతన్య జ్యోతి వెలగకపోతే.. ఈ దేశం అంధకారంలోనే ఉండిపోతదని చెప్పారు. మతపిచ్చిగాళ్ల నుంచి దేశాన్ని రక్షించుకోవాలని, లేదంటే తాలిబన్ రాజ్యం తీసుకొస్తారని ఆయన హెచ్చరించారు. సమాజాన్ని చీల్చే కుట్రలను ప్రజలు అడ్డుకోవాలని, ఆ పోరాటం తెలంగాణ గడ్డ నుంచే మొదలుకావాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ రక్షణ కోసం ఈ నెల 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, దీనికి చాలామంది ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు వస్తున్నారని చెప్పారు. యువత, బుద్ధిజీవులు, ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాలను గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
యువకులు, విద్యాధికులు, ఆలోచనాపరులు అందరూ ఆలోచించాలని కోరుతున్న. దేశంలో స్థాపిత విద్యుచ్ఛక్తి 4.10 లక్షల మెగావాట్లు. ఏ ఒక్కరోజు కూడా 2.10 లక్షల మెగావాట్ల విద్యుత్ను ఈ దేశం వాడలేదు. మన పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్, ఒడిశాలో 99వేల మెగావాట్ల హైడ్రో, థర్మల్ పవర్ప్లాంట్లు స్విచ్ వేస్తే వెలగడానికి సిద్ధంగా ఉన్నాయి. అయినా రకరకాల వివాదాలు పెట్టి, వాటిని స్ట్రెస్డ్ అస్సెట్స్ అని చెప్పి.. పార్లమెంట్కు రిపోర్టులు ఇస్తున్నరు. ఈ దుస్థితి ఇట్లనే కొనసాగాల్నా? ఇవాళ తెలంగాణలో తప్ప యావత్ దేశంలో ఏ రాష్ట్రంలోనూ చివరికి ప్రధానమంత్రి సొంతరాష్ట్రం గుజరాత్లోనూ 24 గంటల కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు. మంచినీళ్లు ఇయ్యరు. సాగునీళ్లు ఇయ్యరు. కరెంటియ్యరు. ఉద్యోగాలియ్యరు? మరేమిస్తరు? ఉపన్యాసాలా? అవి కూడా ఎన్ని రోజులు వినాలె. అందుకే అందరినీ ప్రార్థిస్తున్న. ఈ దేశంలో ఆలోచనా సరళి మారాలె. ఎన్నికల్లో పార్టీలు గెలుస్తున్నయ్. నాయకులు గెలుస్తున్నరు? ఎన్నికల్లో అది సరైన పంథా కాదు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు, ప్రజలు. వారి అభిప్రాయాలు గెలవాలి. ఎన్నికల తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తూచా తప్పకుండా నెరవేరాలె. నిజమైన పరిఫూర్ణమైన ప్రజాస్వామ్య ప్రక్రియ రానంతవరకూ ఈ దేశంలో ఇవే ఉపన్యాసాలు, సొల్లు పురాణాలు, కాలక్షేపాలు.. ఇవే ఉంటయ్ తప్ప న్యాయం జరగదు. అందుకే అందరినీ ప్రార్థించేది ఒక్కటే. రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని మనందరం రక్షించుకోవాలంటే.. మేధావులు ఎక్కువగా ఉన్న ఈ నేల నుంచే, పోరాటాల గడ్డ అయిన తెలంగాణ నుంచే విజ్ఞాన వీచికలు భారతదేశమంతటా ప్రసారం కావాలె. అందులో భాగంగానే చాలామంది ముఖ్యమంత్రులు, పెద్దలు 18వ తేదీన ఖమ్మం రాబోతున్నరు. మీరందరూ పెద్ద ఎత్తున తరలిరావాలె. దేశాన్ని రక్షించుకునేందుకు నడుంకట్టాలె. మనం బాగుంటే సరిపోదు. అందరూ బాగుండాలని కోరుకోవాలె. తెలంగాణలో అందరినీ కడుపులో పెట్టుకుని ఎట్ల చూసుకుంటున్నమో, అదే పద్ధతిలో మరింత ముందుకు పోదాం.
తెలంగాణ వచ్చినప్పుడు మన తలసరి ఆదాయం రూ.87 వేలు. ప్రస్తుతం అది రూ.2.75 లక్షలు. జీఎస్డీపీ రూ.5 లక్షల కోట్ల నుంచి ఈరోజు రూ.13 లక్షల కోట్లకు ఎగబాకింది. దేశంలోనే తలసరి విద్యుత్తు వినియోగంలో నంబర్వన్ స్టేట్ తెలంగాణ.
– సీఎం కేసీఆర్
ప్రగతిశీల విధానంతో.. ప్రజలందరూ మావాళ్లే అనుకొని, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డా మా బిడ్డే అనుకొని అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడేదే గొప్ప పార్టీ, గొప్ప ప్రభుత్వం అయితది. కానీ ప్రజలను విడదీసి, చీల్చి, మతచిచ్చు పెట్టి, కులాల కుంపట్లు పెట్టి ద్వేషం రగిలిస్తే.. చివరికి ఎవరిని దహించి వేస్తాయి? జాతి జీవనాడి కలుషితం కాదా? దేశం అశాంతికి లోనైతే, అందరం తాలిబాన్లలాగా తయారైతే పెట్టుబడులు వస్తాయా? ఉద్యోగాలు వస్తాయా? ఉన్న పరిశ్రమలు నిలబడి ఉంటయా? అశాంతి చోటు చేసుకుంటే కర్ఫ్యూలు, లాఠీచార్జ్లు, ఫైరింగ్ లాంటి వాతావరణం ఏర్పడితే ఏమైతది? సమాజం ఎంత భ్రష్టుపట్టి పోతది? ఈ రోజు దేశంలో ఏం జరుగుతున్నదో చూస్తున్నరు. దుష్ట పన్నాగాలు, దుర్మార్గ యత్నాలు ఎన్ని జరుగుతున్నయో గమనిస్తున్నారు. నేను చెప్పే ఈ విషయాలపై ఇండ్లల్లో, గ్రామాల్లో, బస్తీల్లో పెద్దలతో చర్చపెట్టండి. 10 నిమిషాలు కేటాయించి.. కేసీఆర్ అన్నది ఎంతవరకు నిజం? ఆలోచించండి. అందరూ అట్ల ఆలోచిస్తే దేశానికి ఎంతోమేలు జరుగుతది. దీపంతో దీపం వెలిగించినట్టు చైతన్యవంతమైన సమాజం తయారైతది. తెలంగాణ వరకు మనం బాగున్నం అనుకుంటే కుదరదు. యువకులు అప్రమత్తతతో ఉండాలి. తెలివిగా ఆలోచించాలి. మేధావులు చర్చకు పెట్టాలి. బాధ్యత గల నేతగా దేశం బాగుపడాలనే ఆకాంక్షతో, చెడిపోకూడదనే ఆవేదనతోనే ఈ మాట చెబుతున్నాను. ఎవరినో వ్యతిరేకించి చెప్పడంలేదు. ఉన్న వాస్తవాలే మీ ముందుట పెడుతున్న. మనం ఎంత బాగుపడినా కేంద్రంలో మంచి ప్రభుత్వం ఉంటేనే మనకు మంచి జరుగుతుంది. ఢిల్లీలో సంపూర్ణ అభివృద్ధికాముక ప్రభుత్వం ఉంటేనే, పక్షపాత వైఖరిలేని ప్రభుత్వం ఉంటేనే అక్కడ పని జరిగే అవకాశం ఉంటది. దేశం బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటది. దేశ అభివృద్ధిలోనే మన అభివృద్ధి ఇమిడి ఉంటది. దేశానికి ఒక వెలుగుబాట చూపెట్టే అద్భుతమైన వెలుగు వీచిక మన తెలంగాణ నుంచే ప్రసరించాలె. అందులో మీరందరూ భాగస్వాములు కావాలి. గతంలో ఏ కార్యక్రమం తీసుకున్న మీరు అద్భుతంగా సహకరించారు. ఇది ఇలాగే కొనసాగాలి.
ఇవాళ తెలంగాణలో తప్ప యావత్ దేశంలో ఏ రాష్ట్రంలోనూ చివరికి ప్రధానమంత్రి సొంతరాష్ట్రం గుజరాత్లోనూ 24 గంటల కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు. మంచినీళ్లు ఇయ్యరు. సాగునీళ్లు ఇయ్యరు. కరెంటియ్యరు. ఉద్యోగాలియ్యరు? మరేమిస్తరు? ఉపన్యాసాలా?
-సీఎం కేసీఆర్
ఈ దేశంలో నీటియుద్ధాలు జరుగుతున్నాయి. కావేరి నది మీద కర్ణాటక, తమిళనాడు.. రావి, బియాస్ నదుల మీద పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఎందుకు కొట్లాడుతున్నయ్. నీళ్లు లేకనా? దేశంలో నీటిలభ్యత లేకనా? ప్రపంచంలో అత్యధికంగా వ్యవసాయ అనుకూల భూమి ఉన్న దేశం భారత్ మాత్రమే. అమెరికా మనకన్నా రెండున్నర రెట్లు అధికంగా ఉంటది. కానీ వ్యవసాయానికి అనుకూలంగా 29 శాతం భూమే ఉన్నది. చైనా భారత్ కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఉన్నా.. వ్యవసాయ అనుకూలభూమి 16 శాతం మాత్రమే. అదే మనదేశం అలాకాదు. 36 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణముంది. అంటే 83 కోట్ల ఎకరాలు. ఇందులో అద్భుతమైన పంట పండే మాగాణం 41 లక్షల ఎకరాలు. సముద్రతీర, సమతల, అతిశీతల ప్రాంతాలుగా మూడు రకాలైన వ్యవసాయ అనూకూల వాతావరణ స్థితులు ఉన్నాయి. అద్భుతమైన సూర్యకాంతి, జలసంపద ఉండే దేశం మనది. 139 కోట్ల మానవసంపద ఉన్నది. దేశంలో ఏడాదికి లక్షా 40 వేల టీఎంసీల వర్షం కురుస్తది. అందులో 70 వేల టీఎంసీలు ఆవిరైపోతే.. 70 వేల టీఎంసీలు కృష్ణా, గోదావరి, నర్మదా, గంగా, యుమున వంటి నదుల్లో ప్రవహిస్తాయి. ఇందులో దేశం వాడుతున్నది కేవలం 20 వేల టీఎంసీలు మాత్రమే. మిగిలిన 50 వేల టీఎంసీలు సముద్రంపాలైపోతున్నది. మరెందుకు నీటియుద్ధాలు జరుగుతున్నాయి? దుర్మార్గమైన కేంద్రప్రభుత్వ విధానాల వల్ల, పనికిమాలిన వాటర్ పాలసీల వల్ల ఈ దుస్థితి ఏర్పడుతున్నది. రాష్ర్టాల జుట్లు ముడేసి, తగువులు పెట్టి కేంద్రం ప్రేక్షకపాత్ర వహించడం వల్లే. ఆనాటి నుంచి ఈ నాటి వరకు కాంగ్రెస్, బీజేపీ ఎవడు పాలించినా ఇదే దుస్థితి.
మన రాష్ట్రంలోనే కృష్ణా జలాల వివాదం పరిష్కరించటానికి 2004లో ట్రిబ్యునల్ వేసింది. ఈరోజు వరకు ఉలుకూ పలుకూ లేదు. అతీగతీ లేదు. ఆ జడ్జిగారిని నలుగురు పట్టుకొచ్చి చెయిర్లో కూర్చోపెడ్తరు. ఆయన ఎప్పుడు చెప్తడో.. ఎప్పుడు ట్రిబ్యునల్ తీర్పు వస్తదో? 20 ఏండ్లు గడిచినా వాదనలే జరుగకపోతే ఇక తీర్పులు ఎప్పుడు రావాలె? కేటాయింపులు ఎప్పుడు జరగాలె? ప్రాజెక్టుల డిజైన్లు ఎప్పుడు కావాలె? వాటికి అనుమతులు, క్లియరెన్స్లు ఎప్పుడు రావాలె? ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు జరగాలె? నీళ్లు ఎన్నడు రావాలె? ఇదేనా భారతదేశం? 50 వేల టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంపాలవుతుంటే, దేశంలో మంచినీళ్లు ఇచ్చేందుకు కూడా గతి లేదా? 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ప్రజలకు మంచినీళ్లు ఇచ్చే శక్తికూడా మనకు లేదా? ఎందుకిట్ల? ఈ పరిస్థితికి ఎవరు కారణం? చేతకాని దద్దమ్మలు, దుర్మార్గపూరితమైన వాటర్ పాలసీ వల్లే ఈ పరిస్థితి నెలకొన్నది. చెప్తే సిగ్గుపోతది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా సరైన పద్ధతిలో మంచినీళ్లు రావు. కరెంట్ ఉండదు. మిషన్ భగీరథ మన దూప తీర్చింది. కానీ, పక్కరాష్ర్టాల్లో ఏం జరుగుతున్నదో చూడండి. కర్ణాటక ఎట్లున్నదో, తమిళనాడు ఎట్లున్నదో మీకు తెలుసు. మహారాష్ట్రలో ఏం జరుగుతున్నదో తెలుసు. అనేక పట్టణాల్లో పది రోజులకోసారిగానీ నీళ్లు రావు. ఉపన్యాసాలు వింటే టీవీలు బద్దలైపోతయ్. రేకు డబ్బాలో గులకరాళ్లేసినట్టు ఒక్కటే సౌండు. ఇదంతా ఎందుకు జరుగుతున్నది? మన అవసరం మనకు తెలుసు కాబట్టి, మొండి పట్టుదలకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుని కొద్దిగ ముఖం తెలివి చేసుకున్నం. మన రైతుల ముఖం కళకళలాడున్నది. కానీ దేశంలోని చాలా ప్రాంతాల్లో నీళ్ల కోసం ఈ నాటికీ పంచాయితీలు జరుగుతున్నయ్.
తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.5 లక్షల కోట్లుగా ఉండేది. ఇప్పుడు అది రూ. 11.5 లక్షల కోట్లకు చేరింది. మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో పెరగలేదు. తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర రాష్ర్టాలను దాటేసి ముందుకు పోయాం. తలసరి ఆదాయం, జీఎస్డీపీ వృద్ధి, సగటు విద్యుత్తు వినియోగం, తాగునీరు, నల్లాల ద్వారా నీటి వినియోగంలో ఇలా అనేక రంగాల్లో దశాబ్దాల కిత్రం ఏర్పడిన రాష్ర్టాల కన్నా మనం ముందున్నాం. కానీ, మీలో ఒకడిగా.. భారతగడ్డ మీద పుట్టిన బిడ్డగా.. బాధ్యతగల రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్తున్నాను. ప్రజలు వాస్తవాలను తెలుసుకోవాలి. 8 ఏండ్ల క్రితం ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అదే టైమ్లో మనం తెలంగాణలో అధికారంలోకి వచ్చినం. మన జీఎస్డీపీని రూ. 11.5 లక్షల కోట్లకు పెంచుకున్నాం. మనకంటే మెరుగ్గా కాకపోయినా.. తెలంగాణ పనిచేసిన స్థాయిలో కేంద్రం పనిచేసినా రాష్ట్ర జీఎస్డీపీ రూ.14.5 లక్షల కోట్లుండాలె. కానీ కేంద్రప్రభుత్వ అసమర్థ, దుర్మార్గపూరిత విధానాల వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్లు నష్టపోయింది. ఇదే మాటను అసెంబ్లీలో చెప్పిన. ఒక్క తెలంగాణే రూ. 3 లక్షల కోట్లు నష్టపోతే దేశమంతా ఎంత నష్టపోయింది?
ఎనిమిదేండ్ల క్రితం తెలంగాణలో ప్రజల బతుకులెట్ల ఉండేవి. ఈ రోజున ఎట్ల బతుకుతున్నరు. అప్పట్లో తెలంగాణలో పల్లెలెలా ఉండేవి. ఇప్పుడెట్ల ఉన్నయ్. అన్నింటిలో ఎనిమిదేండ్ల క్రితం తెలంగాణతో పోలిస్తే.. అసలు పొంతనే లేదు. తెలంగాణ వచ్చినప్పుడు మన తలసరి ఆదాయం రూ.87 వేలు. ప్రస్తుతం అది రూ.2.75 లక్షలు. జీఎస్డీపీ రూ.5 లక్షల కోట్ల నుంచి ఈరోజు రూ.13 లక్షల కోట్లకు ఎగబాకింది. దేశంలోనే తలసరి విద్యుత్తు వినియోగంలో నంబర్వన్ స్టేట్ తెలంగాణ. కొత్తగూడెంలోనే కాదు రాష్ట్రంలోని 33 జిల్లాకేంద్రాల్లో సమీకృత పరిపాలన కేంద్రాలు, 33 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకుంటు న్నం. అద్భుతమైన కార్యకలాపాలు నిర్వహించుకుంటూ ముందుకెళుతున్నాం. అందులో భాగంగానే కొత్తగూడెంలోనూ మెడికల్ కాలేజీ వచ్చింది. మీ పల్లెల్లో, తండాల్లో, మున్సిపాలిటీల్లో ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయో మీకే తెలుసు. ప్రజలు అడగకుండా, డిమాండ్లు లేకుండా, ఎవరూ ధర్నా చేయకుండానే అనేక కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టినం. అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నం. కుల, మత, వర్గాలతో సంబంధం లేకుండా అన్నివర్గాల సంక్షేమాన్ని, సర్వజన హితాన్ని కాంక్షిం చి కార్యక్రమాలు తీసుకొచ్చినం. భద్రాద్రి జిల్లాలో గోదావరి అవతల ఉన్న ఒక మారుమూల గ్రామంలో త్రీఫేజ్ పవర్ లేదు. అక్కడ కూడా కావాలని ఓ మిత్రుడు అడిగిండు. ఎం త ఖర్చయినా పర్వాలేదని, వెంటనే పనులు ప్రారంభించాలని మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్ను ఆదేశించాను. ఇలా.. మారుమూల పల్లెల్లోనూ త్రీఫేజ్ కరెంటు ఇస్తున్నం.
ప్రజలను విడదీసి, చీల్చి, మతచిచ్చు పెట్టి, కులాల కుంపట్లు పెట్టి ద్వేషం రగిలిస్తే.. చివరికి ఎవరిని దహించి వేస్తాయి? జాతి జీవనాడి కలుషితం కాదా? దేశం అశాంతికి లోనైతే, అందరం తాలిబాన్లలాగా తయారైతే పెట్టుబడులు వస్తాయా? ఉద్యోగాలు వస్తాయా? ఉన్న పరిశ్రమలు నిలబడి ఉంటయా? అశాంతి చోటు చేసుకుంటే కర్ఫ్యూలు, లాఠీచార్జ్లు, ఫైరింగ్ లాంటి వాతావరణం ఏర్పడితే ఏమైతది? సమాజం ఎంత భ్రష్టుపట్టి పోతది?
– సీఎం కేసీఆర్
తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలను.. ఒక్కొక్కటిగా అన్నీ సాధించుకుంటున్నాం. అందులో భాగంగానే సీతారామ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టుకున్నాం. పనులు వేగంగా జరుగుతున్నయి. సీతారామ పూర్తయితే.. నాగార్జునసాగర్ ఆయకట్టుతోపాటు కృష్ణా ప్రాంతంలో కరువు వచ్చి నీళ్లు రాకపోయినా ఇబ్బందేం ఉండదు. ఉమ్మ డి ఖమ్మంజిల్లా యావత్తు సస్యశ్యామలంగా మారుతుంది. అదేవిధంగా భద్రాద్రి దేవాలయానికి సమీపంలోనే సీతమ్మ ఆనకట్ట నిర్మిస్తున్నాం. అది 35 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో సముద్రాన్ని తలపించేలా ఉంటుంది. మంచినీళ్ల కోసం మిషన్ భగీరథ తీసుకొచ్చి ప్రతి గ్రామానికి, తండాకు, కోయగూడేనికి సురక్షిత నీరు అందించే చర్యలు చేపట్టినం. ఇదంతా మీ కండ్లముందు కనిపిస్తూనే ఉన్నది. కల్యాణ లక్ష్మితో ఎంతోమంది పేద పిల్లల ఇండ్లలో వెలుగులు నింపాం. వృద్ధాప్య పింఛన్తో ఆసరాగా నిలుస్తున్నాం. అర్హులందరికీ రేషన్బియ్యం ఇస్తూ ఆకలి తీరుస్తున్నాం. పుట్టిన పసిపాప నుంచి కాటికి కాలుచాచిన వారి వరకు ఏదో ఒక రకమైన ప్రభుత్వ సహాయం అందిస్తూనే ఉన్నాం. సీఎంఆర్ఎఫ్ కింద ఎమ్మెల్యే ద్వారా అనేకమందిని ఆదుకుంటున్నాం. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో జరిగిన ముఖ్యమంత్రి సభల్లో పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, పసునూరి దయాకర్, ప్రభుత్వ విప్లు బాల సుమన్, రేగా కాంతారావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి, తక్కళ్లపల్లి రవీందర్రావు, బండా ప్రకాశ్, తాతా మధు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు బానోతు శంకర్నాయక్, డీఎస్ రెడ్యానాయక్, బానోత్ హరిప్రియ, టీ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్రెడ్డి, రాములు నాయక్, జడ్పీ చైర్పర్సన్లు అంగోత్ బిందు, గండ్ర జ్యోతి, కోరం కనకయ్య, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, కలెక్టర్లు శశాంక్, అనుదీప్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యే నెమరుగొమ్ముల సుధాకర్రావు, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గతంలో ఎంతోమంది సీఎంలు మానుకోటకు వచ్చినా పైసా పనిచేయలేదు. 20 ఏండ్ల కింద ఒక సీఎం మానుకోటకు వచ్చి ఎస్సారెస్పీ కాలువలో నీళ్లు విడుదల చేశారు. ఆ ఒక్కరోజు మాత్రం కాలువలో నీళ్లు కనిపించాయి. మరుసటి రోజు నుంచి చూద్దామంటే చుక్కనీరు లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, మిడ్మానేరు, ఎస్సారెస్పీ కాలువల ద్వారా చెరువులు నింపుతున్నాం. మండుటెండలో సైతం చెరువులు మత్తళ్లు పోస్తున్నాయంటే అది కేవలం సీఎం కేసీఆర్ కృషితోనే సాధ్యమైంది. నేను 40 ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా. మానుకోట వస్తే సాగునీరు, తాగునీరు ఉండేది కాదు. తండాల్లో మహిళలు, పిల్లలు కిలోమీటర్ల మేర నడిచి తాగునీరు తెచ్చుకునేటోళ్లు. ఇప్పుడు ఏడాదికి రెండు పంటలు పుష్కలంగా సాగవుతున్నాయి. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఎన్నికల మానిఫెస్టోలో పెట్టని పథకాలను కూడా అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. అడగకుండానే సీఎం కేసీఆర్ అన్ని ఇచ్చిండు. ఇప్పుడు జిల్లాకు రూ.550 కోట్లు కేటాయించి మెడికల్ కళాశాల నిర్మించారు. 100 పడకల దవాఖానను 350 పడకల దవాఖానగా మార్చి డాక్టర్లను నియమించడంతో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతున్నది.
– ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్శాఖ మంత్రి
సీఎం కేసీఆర్ గిరిజన రిజర్వేషన్లను ఆరు నుంచి 10 శాతానికి పెంచి గిరిజనుల పాలిట దేవుడయ్యారు. రిజర్వేషన్ పెంపు వల్ల ఎంతోమంది గిరిజన యువతకు ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. డివిజన్ కేంద్రంగా ఉన్న మానుకోట జిల్లాగా మారింది. 75 ఏండ్లలో జరగని అభివృద్ధి ఎనిమిది ఏండ్లలో సాధ్యమైంది. ఒకప్పుడు కలెక్టర్ను కలవాలంటే సామాన్యులు సద్దులు కట్టుకొని పోవాల్సి వచ్చేది. ప్రస్తుతం చిన్న జిల్లాలు ఏర్పాటు కావడం, కలెక్టరేట్లు నిర్మించుకోవడంతో కలెక్టర్లు అందుబాటులో ఉండి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తున్నారు. జిల్లాకు కలెక్టరేట్తోపాటు రూ.550 కోట్లతో మెడికల్ కళాశాల ఇచ్చారు. దీనిద్వారా 150 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చి చదువుకుంటున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మానుకోట అభివృద్ధి చెందలేదు. ప్రస్తుతం మన కండ్ల ముందు అభివృద్ధి కనిపిస్తున్నది. కొత్తగా 218 తండాలను జీపీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. గిరిజనుల కల సీఎం కేసీఆర్ ద్వారా నెరవేరుతున్నది. ఇప్పటికే జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఇంకా కొంత చేయాల్సింది ఉన్నది. రానున్న రోజుల్లో జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు మా వంతు కృషి చేస్తాం.
– సత్యవతి రాథోడ్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి
తెలంగాణ జాతిపిత కేసీఆర్ రాష్ర్టాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. గొప్ప సంస్కరణలతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమైంది. అభివృద్ధిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముందు వరుసలో ఉన్నది. జిల్లాలో అభివృద్ధి జరిగిందంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే అయ్యింది. ఈ ప్రాంతంలో పోడు భూముల సమస్య ఉన్నప్పటికీ కేంద్రం స్పందించకపోయినా సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని దానిని పరిష్కరించారు. ఏజెన్సీలో వైద్యం అందని ద్రాక్షగా ఉన్న తరుణంలో మన్యానికి మెడికల్ కాలేజీని మంజూరు చేసి తరగతులను కూడా ప్రారంభింపజేశారు. సీఎం కేసీఆర్ కృషి వల్లనే స్వచ్ఛ సర్వేక్షణ్లో భద్రాద్రి జిల్లా దేశంలో ఉన్నత స్థానాన్ని సాధించింది. కొత్తగూడెంలోని విశాలమైన ప్రాంగణంలో కలెక్టరేట్ సముదాయం ఏర్పాటు చేయడం గర్వకారణం. గోదావరి జలాలు వృథాగా పోతుంటే సీతారామ ప్రాజెక్టును నిర్మించి లక్షల ఎకరాలను సాగులోకి తెస్తున్న సీఎం కేసీఆర్ ఆలోచన ఎంతో గొప్పది. దీంతోపాటు సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టును కూడా త్వరలోనే పూర్తి చేసుకుంటాం.
-పువ్వాడ అజయ్కుమార్, రవాణాశాఖ మంత్రి
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎంతో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించుకోవడం సంతోషంగా ఉన్నది. కొత్త కలెక్టరేట్ నుంచి ఎన్నో మంచి ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించాలి. ఇది ప్రజలకు గొప్ప దేవాలయంగా వెలుగొందాలి. కొత్తగూడెం జిల్లా అయ్యింది. కొత్త కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, బీటీపీఎస్తోపాటు ఎన్నో వచ్చాయి. భవిష్యత్తులో మరెన్నో వస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందులో సింగరేణికి తొలి పునాదిరాయి పడింది. ఆ తర్వాత కొత్తగూడెం నుంచి విస్తరించి అద్భుతమైన ఆదాయ వనరుగా, ఉద్యోగాలకు కేంద్రంగా మారింది. సింగరేణిని సిరుల కల్పవల్లిగా, తెలంగాణ కొంగుబంగారంగా మార్చిన గడ్డ కొత్తగూడెం. ఈ జిల్లాలో చైతన్యశీలత, క్రియాశీలత, ప్రగతిశీల ఆలోచనా విధానం ఎక్కువ. కమ్యూనిస్టు విప్లవ భావాలతో అనేక రకాల ఉద్యమాల్లో పాల్గొంటూ అద్భుతమైన ప్రగతిశీల కార్యక్రమాలు చేపట్టిన జిల్లా. తెలంగాణ ఉద్యమ సందర్భంలో అక్రమంగా నన్ను అరెస్టు చేసి ఖమ్మం జిల్లా జైల్లో పెడితే.. కమ్యూనిస్టులే పెద్దఎత్తున పోరాటం చేసి, నన్ను కడుపున పెట్టుకుని కాపాడారు. అందరికీ ప్రత్యేకంగా పేరుపేరునా ధన్యవాదాలు. కాదేమో, రాదేమో, అసంభవమేమో, ఎప్పటికీ సాధ్యం కాదనే మాటలను తుత్తునియలు చేస్తూ ప్రజలందరి ఆశీర్వాద బలంతో, ఐక్యపోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నం.
కేసీఆర్ కిట్ వెనుక పెద్ద ఫిలాసఫీ ఉన్నది. మానవీయకోణంతో తీసుకున్న అతిపెద్ద కార్యక్రమం అది. కొందరు గర్భిణులు విధిలేని పరిస్థితుల్లో కూలి పనులకు పోతరు. అది తల్లికి, కడుపులోని శిశువుకు ఇద్దరికీ మంచిది కాదు. అటువంటి పరిస్థితి ఉండకూడదనే రూ.13 వేలు ఇస్తున్నం. తెలంగాణలో గొప్ప జనరేషన్ రావాలనే సంకల్పంతో దీన్ని తీసుకొచ్చినం. అందుకే.. వేరే పనులకు వెళ్లకుండా వారు కోల్పోయే వేతనాన్ని భర్తీ చేసే గొప్ప కార్యక్రమమే కేసీఆర్ కిట్. దేశంలోని అనేక రాష్ర్టాల్లో పర్యటించి, పరిశీలించి.. ఎంతో కసరత్తు చేసిన తర్వాత ఈ పథకాన్ని ప్రవేశపెట్టాం. ప్రజలెవరూ అడగకపోయినా అనేక కొత్త పథకాలు తీసుకొచ్చాం. దేశంలోని అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాం. అన్ని రంగాల్లో దేశంలో ముందు వరుసలో దూసుకెళ్తున్నాం. కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం. ఖమ్మం జిల్లాలో ప్రతి ఇంచుకు నీళ్లిస్తాం. ఒకప్పుడు కరువుతో ఇబ్బంది పడిన మండలాలను సస్యశ్యామలం చేస్తాం. జూలూరుపాడు, ఇల్లెందు వంటి ఏరియాలతోపాటు ఎత్తైన ప్రాంతాలకు సైతం సమృద్ధిగా నీళ్లు అందిస్తాం. గోదావరి మన పక్కనే ఉంది. ఆ నీళ్లను వినియోగించుకునే హక్కు మనకున్నది.
మహబూబాబాద్ గడ్డ గొప్ప ప్రాంతమని, ఇక్కడ దివంగత నాయకుడు నూకల రామచంద్రారెడ్డి లాంటి వారు పుట్టారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నూకల రామచంద్రారెడ్డి తెలంగాణ కోసం తపించారని, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అప్పట్లోనే ఫోరం ఏర్పాటు చేశారని చెప్పారు. ఆ మహనీయుడిని భావితరాలు స్మరించుకోవాలని అన్నారు. ‘దేశానికి ప్రధానమంత్రిగా పని చేసిన పీవీ నరసింహారావుకు గురువు నూకల రామచంద్రారెడ్డి. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నికార్సైన ప్రజానేతగా వ్యవహరించారు. పీవీ నరసింహారావుకు మంత్రి పదవి ఇయ్యాలని పట్టుబట్టిండు. ఇయ్యకపోతే తనకూ వద్దని మంత్రి పదవి తీసుకోలేదు. పీవీ గొప్ప నాయకుడు అవుతాడని ఆ రోజే చెప్పిండు. తర్వాత ఇద్దరికి ఇస్తేనే మంత్రి పదవి తీసుకున్నడు. తర్వాతిరోజుల్లో పీవీ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఎంతో సేవ చేశారు. సమైక్య రాష్ట్రంలో మన నేతలకు గుర్తింపు దక్కలేదు. నూకల రామచంద్రారెడ్డికి మనం ఘనంగా నివాళులర్పిద్దాం. ఏదైనా సంస్థకు ఆయన పేరు పెట్టుదాం. మహబూబాబాద్లో, వరంగల్లో ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకుందాం’ అని సీఎం కేసీఆర్ అన్నారు.