CM KCR | కేసీఆర్ అనర్గళ ప్రసంగం.. ప్రతిగా జనం కేరింతలు, జయధ్వానాలు.. ఆదివారం నిర్మల్ బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రతి మాటకు ప్రజలు ఉత్సాహంతో ప్రతిస్పందించారు. ఈలలు వేశారు. చప్పట్లు కొట్టారు. జననేతను తమ ఫోన్లతో ఫొటో తీసుకునేందుకు ప్రయత్నించారు. ఓ వైపు వర్షం పడుతున్నా.. కుర్చీలను తలపై అడ్డుగా పెట్టుకుని మరీ సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఆద్యంతం శ్రద్ధగా విన్నారు. ధరణి ఉండాల్నా? తీసేయ్యాలా? అని ఆయన ప్రశ్నించనప్పుడు.. ‘వద్దు! వద్ద’ంటూ ముక్తకంఠంతో నినదించారు. తండాలను పంచాయతీలు మార్చామని చెప్తుంటే.. చేతులెత్తి మద్దతు పలికారు. ‘రాష్ట్రం ఇలాగే ఉండాలంటే మీ ఆశీస్సులు కావాలి’ అని కేసీఆర్ వినమ్రంగా కోరినప్పుడు.. ఆమోదసూచకంగా నిర్మల్ ప్రజలు చేసిన కరతాళ ధ్వనులతో మైదానం మార్మోగింది.
ధరణిని కాదు, కాంగ్రెసోళ్లనే బంగాళాఖాతంలో విసిరేయాలి
ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో విసిరేద్దాం అంటున్నారు. కానీ ఈ కాంగ్రెస్ దుర్మార్గుల పరిపాలన మనం చూడలేదా? నాడు వీఆర్వోల దోపిడీ, పహాణీలు మార్చేయడం, భూమి రికార్డులు మార్చేయడం పరిపాటిగా ఉండేవి. నేడు భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే 15 నిమిషాల్లో అయిపోతది. పట్టా కావాలంటే 10 నిమిషాల్లో అయిపోతున్నది. ధరణిని తీసేస్తే మళ్లీ ఎన్ని రోజులు తిరగాలె? ఎన్ని దరఖాస్తులు పెట్టాలె? మళ్లీ పైరవీకారుల వ్యవస్థను తేవాలనుకొంటున్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో విసిరేయండి.
మన పక్కనే ఉన్న మహారాష్ర్టకి మీరు కూడా పోతుంటారు. మహారాష్ట్ర రైతులు తెలంగాణలో అర ఎకరం భూమి కొని బోరు వేసి మహారాష్ట్రలో నీళ్లు పారించు కొంటున్నారు. మహారాష్ట్ర అంత పెద్దదైనా వారిని తలదన్నే స్థాయిలో మనం ఉన్నం. ఇయ్యాల మహారాష్ట్రకు పోతే కేసీఆర్ మాకు రావాలి. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు.
– ముఖ్యమంత్రి కేసీఆర్
నిజామాబాద్/ మంచిర్యాల, జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధులు), ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ: ప్రజల భూములకు భద్రత కల్పించి, అధికారుల వేధింపులకు తావు లేకుండా చేసిన ధరణి పోర్టల్ను తీసేస్తే మళ్లీ దళారీ వ్యవస్థ చేతిలో నానా కష్టాలు పడటం తప్పదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హెచ్చరించారు. ధరణి పోర్టల్ను కాంగ్రెస్ నాయకులు బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే బంగాళాఖాతంలోకి విసిరి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 60 ఏండ్లు దేశాన్ని ఏలి మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయిన దుర్మార్గులకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఇప్పుడు న్న తెలంగాణ ఇలాగే సుభిక్షంగా ఉండాలంటే మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆదివారం నిర్మల్ జిల్లా లో పర్యటించారు.
నిర్మల్ సమీకృత కలెక్టరేట్ భవనాన్ని, జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశా రు. అనంతరం నిర్మల్లోని క్రషర్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో మళ్లీ వీఆర్వో, పట్వారీ వ్యవస్థను తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. నాటి దోపిడీ పాలననే కాంగ్రెస్ దుర్మార్గులు కోరుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో రెవెన్యూ శాఖలో భయంకరమైన దోపి డీ జరిగేదని, ఎవరి భూములు ఎవరి చేతుల్లో ఉండేవో తెలియకపోయేదని.. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఆ దోపిడీకి అడ్డుకట్ట పడిందని తెలిపారు. తెలంగాణ మాడల్ దేశవ్యాప్తంగా మారుమోగుతున్నదని అన్నారు. మహారాష్ట్రలో కూడా ప్రజలు ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని నినదిస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే రైతుబంధును, దళిత బంధును కూడా రద్దుచేస్తారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే రక్ష అని, పార్టీని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ‘సమైక్య రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో భయంకరమైన దోపిడీ జరిగేది. ఎవరి భూమి ఎవరి చేతుల్లో ఉంటదో తెలిసేది కాదు. నిన్న ఉన్న భూమి తెల్లారేకల్లా పహాణీలు మారి పోయేవి. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో విసిరేద్దాం అంటున్నారు. కానీ ఈ కాంగ్రెస్ దుర్మార్గుల పరిపాలన మనం చూడలేదా? నాడు వీఆర్వోల దోపిడీ, పహాణీలు మార్చేయడం, భూమి రికార్డులు మార్చేయడం పరిపాటిగా ఉండేవి. నేడు భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే 15 నిమిషాల్లో అయిపోతది. పట్టా కావాలంటే 10 నిమిషాల్లో అయిపోతున్నది.
ధరణి తీసేస్తే మళ్లా ఎన్ని రోజులు తిరగాలె? ఎన్ని దరఖాస్తులు పెట్టాలె? మళ్లీ పైరవీకారుల వ్యవస్థను తేవాలనుకొంటున్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో విసిరేయండి’ అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల గురించి తెలుసుకొని మహారాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. ‘హైదరాబాద్లో ప్రభుత్వం బ్యాంకులో రైతుబంధు డబ్బులు వేస్తే.. గ్రామంలో మీ ఫోన్లలో టింగ్టింగ్మంటూ మెసేజ్లు వస్తున్నయ్. రైతు చనిపోతే రైతు బీమా వస్తున్నది. ఎవరూ దరఖాస్తు పెట్టకుండానే.. ఏ ఆఫీసుకు పోయే అవసరం లేకుండానే 8 రోజుల్లోనే రూ.5 లక్షల చెక్కు రైతు ఇంటికి చేరుతున్నది. ప్రభుత్వమే వడ్లు కొంటున్నది. ఎవరి ఊర్లో వాళ్లే ధాన్యం అమ్ముకొనేవిధంగా 7 వేల కేంద్రాలను ఏర్పాటు చేసినం. కొన్న వడ్లకు డబ్బులు బ్యాంక్లో వేస్తే డైరెక్ట్గా మీ ఖాతాల్లోకి వస్తున్నాయి. నేను ఈ మధ్య మహారాష్ట్రకు పోయిన. రైతుబంధు, రైతుబీమా, ధాన్యం డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే వేస్తున్నామని తెలుసుకొని అక్కడివాళ్లు ఆశ్చర్యపోయారు. ఇది ఎట్లా సాధ్యమవుతున్నది సర్ అని అడిగారు’ అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైతును రాజును చేసేందుకు, సాగును పండుగ చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామని సీఎం కేసీఆర్ తెలిపారు. రూ.12 వేల కోట్లు ఖర్చు చేసి వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని పేర్కొన్నారు. ‘గతంలో విద్యుత్తు ఎప్పుడు పోయేదో.. ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు. ఇప్పుడు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నం. రైతు దగ్గరకు వచ్చి ఎన్ని హార్స్ పవర్ల మోటర్లు పెట్టుకున్నావ్.. ఎన్ని మోటర్లు పెట్టుకున్నావ్ అని అడిగే కోనాయన కొడుకే లేడు. రైతుల మొఖాల్లో చిరునవ్వు చూడాలని సంవత్సరానికి రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. మళ్లీ ఈ (కాంగ్రెస్) దుర్మార్గులు వస్తే ఈ కరెంటు పోతది. రైతుబంధుకు, దళితబంధుకు రాంరాం అనే పరిస్థితి వస్తది. మరి రైతుబంధుకు రాంరాం అనేటోడు రావాల్నా? మనమే కొనసాగాల్నా?’ అని ప్రజలను ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్లకుపైగా దేశాన్ని, రాష్ర్టాన్ని పరిపాలించి ప్రజలకు కనీసం మంచి నీళ్లు కూడా ఇయ్యలేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంట్లో నల్లా ఫిట్చేసి బ్రహ్మాండంగా గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకొంటున్నామని తెలిపారు. ‘ఎస్సారెస్పీ ఎండిపోకుండా పునరుజ్జీవ పథకాన్ని పెట్టుకున్నాం. కోట్ల టన్నుల వడ్లు పండించుకొంటున్నాం. ఈ రాష్ట్రం ఇట్లనే ఉండాలంటే కచ్చితంగా మీ అందరి ఆశీస్సులు, మద్దతు బీఆర్ఎస్ పార్టీకి ఉండాలి. మన చెరువులు ఒకప్పుడు ఎండిపోయి గందరగోళంగా ఉండేవి. ఇప్పుడు నిండు కుండల్లా మార్చుకొన్నాం. ఎస్సారెస్పీ ద్వారా వచ్చే స్కీమ్ 27, 28 ప్యాకేజీ పూర్తి చేయబోతున్నాం. ఎస్సారెస్పీ ద్వారా నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ప్రతి మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకుందాం. ధాన్యాన్ని ప్రాసెస్ చేసి ఎక్కువ డబ్బులు వచ్చేట్టు మార్కెట్లోకి పంపేవిధంగా కొత్త ప్రణాళికలు ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నది. ప్రతి మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి అక్కడి యువతకు ఉద్యోగాలు దొరికేలా చేస్తాం’ అని సీఎం ప్రకటించారు. ఈ నెల 8న అన్ని గ్రామాల్లో చెరువుల పండుగ కోలాహలంగా, చెరువు కట్టలమీద దద్దరిల్లేలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
నిర్మల్ జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున, నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున, 19 మండల కేంద్రాలకు రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తాం. బాసర సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిస్తాం. కొద్ది రోజుల్లోనే ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేస్తా. జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీని మంజూరు చేస్తాం. ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలిపిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాశాఖకు అభినందనలు.
-సీఎం కేసీఆర్
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పొరుగునే ఉన్న మహారాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో మాదిరి అభివృద్ధి తమకు కూడా కావాలని కోరుకొంటున్నారని చెప్పారు. ‘మన పక్కనే ఉన్న మహారాష్ర్టకి మీరు కూడా పోతుంటారు. మహారాష్ట్ర రైతులు తెలంగాణలో అర ఎకరం భూమి కొని బోరు వేసి మహారాష్ట్రలో నీళ్లు పారించుకొంటున్నారు. మహారాష్ట్ర అంత పెద్దదైనా వారికి తలదన్నే స్థాయిలో మనం ఉన్నం. ఇయ్యాల మహారాష్ట్రకు పోతే కేసీఆర్ మాకు రావాలి. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు’ అని తెలిపారు. రాష్ట్రంలో నేడు రెసిడెన్షియల్ స్కూళ్లలో మన పిల్లలు కార్పొరేట్ స్థాయి విద్య పొందుతున్నారని తెలిపారు. ‘కల్యాణ లక్ష్మి, షాదీముబారక్తో పాటు విదేశీ విద్య నిధి కింద రూ.20 లక్షలు ఇస్తున్నాం. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్నాం. మనం ఎవరికీ బయపడే వాళ్లం కాదు. అందరినీ సమానంగా చూసుకొంటూ, కలిసి ముందుకు పోతున్నాం. రాబోయే రోజుల్లో ఇలాగే సాగుదాం. గోండు గూడేలు, లంబాడీ తండాల ప్రజలు గ్రామ పంచాయతీలు కావాలని 60 ఏండ్లు కొట్లాడారు. వారి కోరిక మేరకు తండాలు, గూడేలన్నింటినీ గ్రామపంచాయతీలుగా మార్చాం. నేడు గిరిజన తండాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి. రాబోయే రోజుల్లో సొంత జాగా ఉన్నవారికి గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు కట్టుకొనేందుకు రూ.3 లక్షలు ఇస్తాం. నియోజకవర్గానికి 3 వేలు చొప్పున ఇండ్లు మంజూరు చేయబోతున్నాం. యాదవ సోదరులకు రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టబోతున్నాం’ అని వివరించారు.
నిర్మల్ జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున, 19 మండల కేంద్రాలకు రూ.20 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాశాఖను అభినందించారు. బాసర సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించబోతున్నామని తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఆలయ నిర్మాణానికి తానే పునాది రాయి వేస్తానని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ఒక్కటే మెడికల్ కాలేజీ ఉండేదని, ఇప్పుడు కొత్తగా మూడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసినట్టు గుర్తుచేశారు. కార్యక్రమంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు పాల్గొన్నారు.
మంచిర్యాల, జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ జిల్లా పర్యటన ప్రజల్లో ఉత్సాహం నింపింది. కేసీఆర్ నిర్మల్లోకి ప్రవేశించగానే జిల్లాను వర్షపు చినుకులు పలకరించాయి. ఏరువాక పౌర్ణమి రోజున వర్షం పడితే మంచిదని రైతులు విశ్వసిస్తారు. అలాంటి రోజున సీఎం కేసీఆర్ రావడం, అదే సమయంలో వర్షం కురియడంతో సభకు వచ్చిన రైతులు హర్షం వ్యక్తంచేశారు. వర్షంతో సభ ఏమైపోతుందోనని అధికారులు, జిల్లా పార్టీ నాయకులు భయపడ్డారు. కానీ, వర్షం పడుతున్నా లెక్కచేయకుండా ప్రజలు ఎదురుచూశారు. సీఎం కేసీఆర్ సభ వేదిక మీదకు వచ్చిన వెంటనే జై కేసీఆర్.. జై బీఆర్ఎస్ నినాదాలతో ఒక్కసారిగా ప్రాంగణం మారుమోగిపోయింది. నిర్మల్ జిల్లాకు వరాలు ప్రకటిస్తున్నంత సేపు కరతాల ధ్వనులు వినిపించాయి. సీఎం మాట్లాడుతున్నంతసేపు సభకు వచ్చిన వారు ఉత్సాహంగా కనిపించారు. సభకు వచ్చినవారిలో ఎక్కువగా మహిళలు, రైతులు, వృద్ధు లు ఉండటం గమనార్హం.
సీఎం కేసీఆర్ నిర్మల్ పర్యటన ఆదివారం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సాయంత్రం 4 గంటలకు సోన్ మార్గాన సీఎం కేసీఆర్ జిల్లాలోకి ప్రవేశించారు. గోదావరిపై ఉన్న సోన్ వంతెన వద్ద ఆగి కొన్ని నాణేలు వదిలి గోదావరి తల్లికి నమస్కారం చేశారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఇంటికి సీఎం వెళ్లారు. ఆయనకు మంత్రి సతీమణి విజయలక్ష్మి, కోడలు దివ్యారెడ్డి మంగళహారతులతో స్వాగతం పలికారు. మంత్రి నివాసం నుంచి కొండాపూర్లోని బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకొని ప్రారంభించారు. అనంతరం కొత్త కలెక్టరేట్ సమీకృత కార్యాలయానికి సీఎం కేసీఆర్ చేరుకొని పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్తోపాటు మెడికల్ కళాశాల, డబుల్ బెడ్రూం ఇండ్లు, మైనార్టీ గురుకుల పాఠశాలల శిలాఫలకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.