హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఐదేండ్లుగా చేసిన మేధోమథనానికి దర్పణంగా రూపొందించిన ‘జెనిసిస్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)’ పుస్తకాన్ని గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఆవిషరించారు. సీఎం పీఆర్వో వనం జ్వాలానరసింహారావు రచించిన ఈ పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ప్రచురించారు.
ఈ సందర్భంగా రచయితను, ప్రచురణకర్తలను సీఎం కేసీఆర్ అభినందించారు.సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రస్తావన, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి 2023 ఫిబ్రవరి 5న నాందేడ్లో జరిగిన బీఆర్ఎస్ సభ వరకు 35 వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. బీఆర్ఎస్ ఆవిర్భావ, ఆరోహణా క్రమాన్ని మాత్రమే కాకుండా వర్తమాన జాతీయ రాజకీయాల గురించి పరిశోధనా దృక్పథంతో అధ్యయనం చేసే వారికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందని రచయిత వనం జ్వాలా నరసింహారావు పేర్కొన్నారు.