హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరం మూడు మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులతో ఆరోగ్య నగరంగా అవతరించబోతోంది. నగరంలోని మూడు ప్రాంతాల్లో నూతనంగా నిర్మించనున్న టిమ్స్ ఆసుపత్రులకు నేడు పునాది రాళ్లు పడనున్నాయి. రాష్ట్రంలో వైద్యానికి పెద్ద పీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరో నవశకానికి నాంది పలుకుతున్నారు. మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు సీఎం కేసీఆర్ నేడు భూమి పూజ చేయనున్నారు. ఉదయం 11:30 గంటలకు గడ్డి అన్నారంలో, అనంతరం సనత్నగర్ చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణంలో ఆస్పత్రికి భూమి పూజ చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అల్వాల్ ఆస్పత్రికి భూమి పూజ చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.
సూపర్స్పెషాలిటీ హాస్పిటల్స్ ర్మాణ పనుల కోసం తెలంగాణ సర్కార్ రూ.2679 కోట్లు కేటాయిస్తూ గురువారం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎల్బీనగర్లో నిర్మించతలపెట్టిన సూపర్స్పెషాలిటీ హాస్పిటల్కు రూ.900 కోట్లు, సనత్నగర్లో నిర్మించే దవాఖానకు రూ.882కోట్లు, అల్వాల్ దవాఖానకు రూ.897 కోట్లు కేటాయించారు.
గ్రేటర్ చుట్టూ నిర్మించనున్న నాలుగు సూపర్ స్పెషాల్టీ దవాఖానల వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ప్రజలకు కూడా వైద్యసేవలు మరింత చేరువకానున్నాయి. ముఖ్యంగా అల్వాల్–ఓఆర్ఆర్ మధ్య నిర్మించనున్న సూపర్ స్పెషాల్టీ దవాఖాన వల్ల సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లాల ప్రజలు ట్రాఫిక్ సమస్య లేకుండా సులువుగా చేరుకోవచ్చు. అంతేకాకుండా వైద్యసేవలు సకాలంలో పొందే వీలుంటుంది. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో నిర్మించనున్న సూపర్ స్పెషాల్టీ దవాఖాన వల్ల నల్లగొండ, వరంగల్, యాదాద్రి–భువనగిరి తదితర జిల్లాల ప్రజలకు, గచ్చిబౌలిలోని టిమ్స్ వల్ల రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రజలకు వైద్యసేవలు చేరువ కావడంతో పాటు సులభంగా దవాఖానలకు చేరుకునే వీలుంటుంది. ఆ జిల్లాల నుంచి వచ్చే రోగులు నగరంలోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి దవాఖానలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రేటర్ సరిహద్దులో ఉన్న నూతన సూపర్స్పెషాలిటీ దవాఖానల ద్వారా సేవలు పొందే వీలుంటుంది.