హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 డిగ్రీ కాలేజీలను మంజూరు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు పలువురు బీసీ సంఘాల నేతలు, విద్యార్థి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ విద్యా ప్రదాత అంటూ కొనియాడారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతం విద్యలో పూర్తి వివక్షకు గురైందని, స్వరాష్ట్రంలో సీఎం టీఆర్ఎస్ పెద్దపీట వేస్తున్నదని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా పెద్ద సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు చేస్తూ బీసీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ బంగారు బాటలు వేస్తున్నారు. ఇప్పటికే 261 గురుకులాలు ఉండగా, కొత్తగా 33 గురుకుల పాఠశాలలు, 15 డిగ్రీ కాలేజీలు మంజూరు చేయడం సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్కు ధన్యవాదాలు.
– అక్కె వీరస్వామి గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు, సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం
విద్యతోనే సమాజ వికాసం. ఆ సిద్ధాంతాన్ని సీఎం కేసీఆర్ ఆచరణలో చూపిస్తున్నారు. ఇప్పటికే గురుకులాల ద్వారా ఆరు లక్షలకు పైగా అణగారిన వర్గాల విద్యార్థులకు ఉచిత విద్య అందుతున్నది. కొత్తగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 డిగ్రీ కాలేజీల ఏర్పాటుతో మరో 11,520 మందికి అదనంగా లబ్ధి చేకూరనున్నది.
– దూదిమెట్ల బాలరాజు, చైర్మన్, గొర్రెల, మేకల డెవలప్మెంట్ కార్పొరేషన్
ఉమ్మడి రాష్ట్రంలో విద్యాపరంగా తెలంగాణ వివక్షకు గురైంది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యకు పెద్దపీట వేస్తున్నారు. ఒక్కో విద్యార్థిపై ఏటా 1.25 లక్షలను ఖర్చు చేస్తున్న ఏకైక సర్కార్ టీఆర్ఎస్సే. గురుకులాల్లో రిజర్వేషన్ ద్వారా దివ్యాంగులకు ఎంతో లబ్ధి చేకూరుతున్నది. కొత్తగా మరిన్ని గురుకులాలను ఏర్పాటు చేసిన సీఎంకు కృతజ్ఞతలు.
– డాక్టర్ కే వాసుదేవరెడ్డి, చైర్మన్, దివ్యాంగుల ఆర్థిక సహకార కార్పొరేషన్
విద్యాభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. బీసీ గురుకులాల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నది. అదేవిధంగా డిగ్రీ కాలేజీల్లో అధునాతన కంప్యూటర్ కోర్సులను ప్రవేశపెట్టడడం హర్షనీయం. కొత్త గురుకులాలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
– కిశోర్గౌడ్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు