హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పేద విద్యార్థుల విద్యాదాత సీఎం కేసీఆర్ అని, గురుకులాల ఏర్పాటుతో పేదలకు నాణ్యమైన విద్యను చేరువ చేసిన ఘనత సీఎం కేసీఆర్ సొంతమని ఎమ్మెల్యే గాదరి కిశోర్ పేర్కొన్నారు. ఆసెంబ్లీలో విద్యారంగంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో కిశోర్ మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో విద్యారంగం విశేష అభివృద్ధి సాధించిందని, ముఖ్యంగా గురుకులాల ఏర్పాటు ఒక విప్లవాత్మకమైన చర్యగా అభివర్ణించారు. గురుకులాల ఏర్పాటుకు ముందు జరిగిన ఘటనను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాము 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ను కలిసి కోరినట్టు తెలిపారు.
దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్..‘ఇప్పటికే దేశంలో అంబేద్కర్ విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం పెడితే అందులో ఒకటిగా ఉంటుంది. అంబేద్కర్ స్థాయికి ఇది సరిపోదు. 125 అడుగుల విగ్రహం ఏర్పాటుతోపాటు ఆయన ఆశయాన్ని నెరవేర్చేలా ఏదైనా కార్యక్రమం చేద్దాం’ అని చెప్పినట్టు గుర్తుచేశారు. ఆ తర్వాతి రోజే 125 గురుకులాలను ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని, తద్వారా అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చుతూ పేద పిల్లలకు నాణ్యమైన విద్యను చేరువ చేసే గొప్ప కార్యక్రమానికి నాంది పాలికారని కొనియాడారు. అప్పుడు ప్రారంభమైన గురుకులాల ఏర్పాటు ప్రస్తుతం 1,002 కొత్త గురుకులాలతో సాగుతున్నదని చెప్పారు.