వనపర్తి, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వ్యవసాయ రంగం ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పంటల ఉత్పాదకతలో తెలంగాణ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నదని తెలిపారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పద్మావతి శ్రీనివాస గార్డెన్స్లో వనపర్తి, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలకు సంబంధించిన వానకాలం-2022 సాగుపై సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. లక్షల ఎకరాలకు సాగునీరందించే పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. ఆయిల్పాం తోటల సాగుతో మన ప్రాంతం, మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వానకాలం పంటలు 1.45 కోట్ల ఎకరాల్లో సాగవుతున్నట్టు వెల్లడించారు. 2 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలు పెంచేందుకు వీలుగా మొక్కలను సిద్ధంగా చేశామన్నారు. వానకాలం పంటలు జూలై 15 నాటికి వేసుకోవాలని మంత్రి సూచించారు. వ్యవసాయ రంగంలో రాష్ట్రం ఆదర్శంగా నిలిచి అన్నపూర్ణగా మారుతుందని చెప్పారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందాలన్నారు.
రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రైతుబీమా కింద ఇప్పటివరకు రూ.80 వేల కోట్లు అందించినట్టు తెలిపారు. ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి రైతు వేదికలు నిర్మించినట్టు చెప్పారు. సమీకృత వ్యవసాయ విధానం అలవర్చుకొని వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఉద్యాన అధికారులు పండ్లతోటల సాగుకు అధిక ప్రాధాన్యతనిచ్చి రైతులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఎంపీలు రాములు, మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, కూచకుళ్ల దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, జెడ్పీ చైర్పర్సన్లు లోక్నాథ్రెడ్డి, సరిత, పద్మావతి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, అబ్రహాం, చిట్టెం రామ్మోహన్రెడ్డి, జైపాల్ యాదవ్, వనపర్తి, నాగర్కర్నూల్ కలెక్టర్లు షేక్ యాస్మిన్ బాషా, ఉదయ్కుమార్ పాల్గొన్నారు.