ముషీరాబాద్, ఏప్రిల్ 2: సీఎం కేసీఆర్ నిజమైన అంబేద్కర్వాది అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనా విధానాలను అమలుచేసి చూపిస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడమేకాకుండా దళితుల అభ్యున్నతికి కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్లోని విద్యానగర్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి దళిత కుటుంబానికి రూ.పది లక్షల చొప్పున దళిత బంధు ఇస్తున్నారని, పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతోపాటు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని చెప్పారు. అట్టడుగు వర్గాల కోసం కృషి చేసిన అంబేద్కర్, జగ్జీవన్రామ్, మహాత్మా జ్యోతిబాఫూలేవంటి మహనీయుల జయంతి ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణ ఉద్యమంలో 25 ఏండ్లుగా కీలక పాత్ర పోషిస్తున్న ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్యను జయంతి ఉత్సవాల వర్కింగ్ చైర్మన్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. ఈ నెల 14న నిర్వహించబోయే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఉత్సవాల్లో ఇదే కమిటీని భాగస్వామ్యం చేయాలని కోరారు. ఆయన వెంట బేడ బుడగ జంగాల జేఏసీ చైర్మన్ హనుమంతు, ఎమ్మార్పీఎస్ నాయకులు సువర్ణబాబు, చినబాబు, బంగారు శ్రీను, మంచాల యాదగిరి, చాప కృష్ణ, ఎల్లన్న, బొల్లం జ్యోతి, తిరుమలేశ్ తదితరులు ఉన్నారు.