Telangana | (శంభాజీనగర్ నుంచి నమస్తే తెలంగాణ బృందం): పాలకుల వైఫల్యం వల్లనే మహారాష్ట్రలో రైతులు సమస్యలను ఎదుర్కొంటూ.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, నాయకులు అన్నదాతలను వారి మానాన వారిని గాలికి వదిలేస్తున్నారని రైతు ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతు సమస్యలకు సరైన పరిష్కారం చూపగలిగిన ఏకైక నాయకుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇటీవల బీఆర్ఎస్లో చేరిన శంకరన్న మహారాష్ట్ర రాజకీయాలు, అక్కడి రైతుల్లో పార్టీకి పెరుగుతున్న ఆదరణపై ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.
మహారాష్ట్ర రైతుల సమస్యలు ఏమిటి? ఎందుకు ఇంతటి సంక్షోభం నెలకొన్నది?
మహారాష్ట్ర రైతుల సమస్యలు అన్నీ ఇన్నీ కావు. పాలకుల పాప ఫలితమే వ్యవసాయ సంక్షోభం. పూర్ణ, గోదావరి వంటి అనేక నదులున్నా 75 ఏండ్లలో మహారాష్ట్రలో కేవలం 14శాతం భూములకు మాత్రమే సాగునీటి వసతి ఉంది. మిగతాదంతా వర్షాధారమే. కరెంటు ఉండదు. పంటకు కనీస ధర దక్కదు. ప్రతిసారీ ఇదే దుస్థితి. ఆశలు చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
రైతుల ఆత్మహత్య నివారణకు ప్రభుత్వం చేస్తున్న కృషి..?
ఇక్కడి ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకున్నా రోజుకు ఆరుగురు రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? మహారాష్ట్రలో అన్ని పార్టీలకు సంక్షోభ కారణాలు తెలుసు. కానీ నివారణ చర్యలు మాత్రం చేపట్టేందుకు ముందుకురారు. ఒక్కమాటలో చెప్పాలంటే రైతులను వారి మానాన వారిని గాలికి వదిలేశారు.
బీఆర్ఎస్లో మీ చేరిక ఎలా జరిగింది..?
తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేండ్లలోనే అద్భుతమైన ప్రగతిని సాధించింది. నాందేడ్ సభను టీవీలో లైవ్ చూశా. కేసీఆర్ చెప్పిన విషయాలను విన్నా. ఆత్మహత్యలను నివారించాం అని నిండు విశ్వాసంతో ప్రకటించడం నన్ను ఆలోచింపజేసింది. ఇది ఎలా సాధ్యమైంది అనే ఆసక్తి పెరిగింది. తెలుసుకోవాలనే కుతూహలంతో స్వయంగా తెలంగాణ వచ్చా. గ్రామాల్లో తిరిగి రైతులతో మాట్లాడా. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు తదితర వాటి గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయాను. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం. అన్ని ఆవిష్కరణలు చేసిన మహానాయకుడిని కలవాలని వెళ్లా. కేసీఆర్ దాదాపు ఎనిమిది గంటలపాటు నాతో మాట్లాడారు. దేశ రైతాంగ సమస్యలకు పరిష్కారాలను సూచించారు. ఎంతో నమ్మకం కలిగింది. నేను కేసీఆర్ లాంటి నాయకుడిని చూడలేదు. కేసీఆర్ గొప్ప విజనరీ లీడర్. తెలంగాణ మాడల్, కేసీఆర్ విధానం చాలా విభిన్నం. ఔరంగాబాద్ సభకు లక్ష మందికిపైగా రానున్నారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ ఎలా ఉంది?
దేశ రాజధాని ఢిల్లీలో రైతులు కనీవినీ ఎరగని విధంగా 13 నెలలు ఏకబిగిన ఉద్యమం సాగించారు. అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు సమస్యల పట్ల దాటవేత ధోరణిని అవలంబిస్తున్నది. దీంతో నాతో సహా దేశంలోని రైతు నాయకులందరూ నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. అలాంటి తరుణంలో కేసీఆర్ ముందుకు వచ్చారు. ఇప్పుడు దేశరైతాంగానికి ఉన్న ఏకైక ఆశాకిరణం ఆయనే. ఇప్పుడు ప్రతి మరాఠా రైతు నోట ఒకటే నినాదం అబ్ కీ బార్ కిసాన్ సర్కార్. తెలంగాణలో భూములు పచ్చగా ఉంటే.. ఇక్కడ నెర్రెలిడ్సిన దృశ్యాలు కండ్లముందు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఉచిత కరెంటు, సాగునీరు సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎందుకు కావని రైతులు గొంతెత్తి అడుగుతున్నారు. అందుకే గులాబీ జెండాను గుండెకు హత్తుకుంటున్నారు. బీఆర్ఎస్కు, కేసీఆర్ సాబ్కు స్వాగతం పలుకుతున్నారు. నాందేడ్ సభ అనంతరం బీఆర్ఎస్ విస్తరణ వేగవంతమైంది. ఇక్కడి రాజకీయ వర్గాల్లో వణుకు పుట్టింది. రాబోయే రోజుల్లో ఇక్కడ కచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.