TS Minister Satyavati Rathode | అకాల వర్షంతో పంట నష్టం పోయిన రైతులను ఆదుకున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. దేశంలోనే విద్యుత్ కోతల్లేని రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తోపాటు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నీలం సుహాసినీ దుర్గేశ్, వైస్ చైర్మన్గా రవి గౌడ్, పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీ సభ్యులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో సైతం తెలంగాణ తరహా సంక్షేమ పథకాల్లేవని సత్యవతి రాథోడ్ అన్నారు. రైతు బంధు పథకంతో పంట పెట్టుబడి నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు అండగా ఉంటున్న సీఎం కేసీఆర్కు రైతులు వెన్నంటి ఉండాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని చెప్పారు. రైతుల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ కృషి చేస్తుంటే, బీజేపీ సర్కార్ అన్నదాతల నడ్డి విరిచేలా వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెబుతున్నదన్నారు.
తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. ఒకప్పుడు ఎద్దేవా చేసిన నోర్లే.. తెలంగాణ అభివృద్ధిని చూసి ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నాయన్నారు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్తోనే దేశానికి మేలు జరుగుతుందని ఇతర రాష్ట్రాల ప్రజలు బలంగా నమ్ముతున్నారని, బీఆర్ఎస్ పార్టీకి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని అన్నారు.
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేంద్రం నిధులియ్యడం లేదని మంత్రి సత్యవతి రాథోడ్ మండి పడ్డారు. రైతు సంక్షేమం, విద్యావైద్యం ప్రధాన ఏజెండాగా తెలంగాణ సర్కార్ పని చేస్తున్నదన్నారు.
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. అవాకులు చెవాకులు మాట్లాడే ప్రతిపక్ష పార్టీలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై చిన్న కారణం చూపి పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం మోదీ దుర్మార్గపు చర్యలకు నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పీటీసీ రావుల శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ చంద్రమోహన్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, సర్పంచ్ శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నజీర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేతలు యాకుబ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.