CM KCR | హుస్సేన్ సాగర్ తీరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం అమరజ్యోతిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిశీలించారు. అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వారికి గుర్తుగా స్మారక స్తూపాన్ని నిర్మిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడి పదేళ్లు కాబోతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ 2 నుంచి 22 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. జూన్ 22న ‘అమరుల సంస్మరణ’ కార్యక్రమం జరుగనున్నది. తెలంగాణవ్యాప్తంగా పల్లెపల్లెనా, పట్టణాలు, నగరాల్లో, విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటించనున్నారు.
అమరుల సంస్మరణ తీర్మానాలు చేయనున్నారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తారు. అదే రోజు ట్యాంక్ బండ్పై కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ అదే రోజున ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ స్తూపాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న నిర్మాణం పనులను పరిశీలిస్తూ కలియతిరిగారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అండ్బీ అధికారులకు సీఎం ఆదేశించారు.
ఇప్పటికే పనులన్నీ పూర్తయి చివరిదశ సుందరీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్లకు సీఎం పలు సూచనలు చేశారు. అమరుల స్మారకానికి ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. విగ్రహానికి రెండు వైపులా అత్యద్భుతమైన ఫౌంటేన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆర్అండ్బీ ఇంజినీర్ శశిధర్ను సీఎం ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నన్ని రోజులు అమరుల స్మారకం వద్దకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. అక్కడ నుంచి బీఆర్కే భవన్ వద్ద నిర్మించిన వంతెనల నిర్మాణాన్ని సీఎం పరిశీలించారు.