హైదరాబాద్, మే 31(నమస్తే తెలంగాణ): బ్రాహ్మణ సమాజ సంక్షేమం కోసం దేశంలోనే మొదటిసారిగా నిర్మించిన తెలంగాణ బ్రాహ్మణ సదన్ ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేతుల మీదుగా బుధవారం అత్యంత ఘనంగా జరిగింది. బ్రాహ్మణ సంక్షేమాన్ని కాం క్షిస్తూ వారి కోసం ఒక కేంద్రం ఏర్పాటు కావడం దేశంలో ఇదే ప్రప్రథమం. దీంతో అన్ని రంగాల్లో మాదిరిగానే బ్రాహ్మణ సంక్షేమంలో సైతం తెలంగాణ రాష్ట్రం యావత్తు దేశానికి ఆదర్శంగా నిలిచిం ది. రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ మధ్యాహ్నం సుమారు 12 గంటలకు చేరుకున్నారు. నేరుగా యాగశాలకు చేరుకున్న ముఖ్యమంత్రి తొలుత దేశం నలుమూలల నుంచి వచ్చిన పీఠాధిపతుల వద్దకు వెళ్లి పేరుపేరునా పలకరించి వారి ఆశీర్వచ నం తీసుకున్నారు.
ఈ సందర్భంగా వారు సీఎం కేసీఆర్కు కిరీటం ధరింపజేసి, శాలువా కప్పి సంప్రదాయ పద్ధతిలో శంఖం పూరించి, వేద మంత్రాల తో ఆశీర్వదించారు. అనంతరం ప్రాంగణంలో మ రో పక్కన ఆశీనులైన వేదపండితుల వద్దకు వెళ్లిన సీఎం.. వారి యోగక్షేమాలను తెలుసుకొని వారి దీవెనలు కూడా అందుకున్నారు. ఆ తరువాత ఇత ర రాష్ర్టాల నుంచి ఆహ్వానితులుగా వచ్చిన ఆల్ ఇం డియా బ్రాహ్మణ ఫెడరేషన్ నేతలను కలిసి వారితో ముచ్చటించారు. అనంతరం చండీయాగం, సుదర్శనయాగం, వాస్తుపూజ కార్యక్రమాల్లో పాల్గొన్నా రు. యాగ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న సందర్భంలో వేదమంత్రాల నడుమ కొనసాగిన పూర్ణాహుతిలో సీఎం పాల్గొన్నారు. దీంతో మంగళవారం నుంచి కొనసాగుతున్న పూజా కార్యక్రమా లు ముగిశాయి.
అనంతరం సీఎం బ్రాహ్మణ సదన్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి, మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్రస్వామి, హంపి విరూపాక్ష పీఠాధిపతి, వ్రతధార చినజీయర్స్వామి, రంగంపేట మ దనా నందపీఠం మాధవానందస్వామితోపాటు 29 రాష్ర్టాలకు చెందిన వేద పండితులు, బ్రాహ్మణ ప్రముఖులు, ప్రధాన ఆలయాల అర్చకులు, ద్వా దశ జ్యోతిర్లింగ క్షేత్రాల స్వాములు, పూజారులు, బ్రాహ్మణ సమాజ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హా జరయ్యారు.
హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని వి విధ ప్రాంతాల నుంచి వయోవృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావడం విశేషం. మండుటెండను సైతం లెక్కచేయకుండా బస్సులు, కార్లు, ద్వి చక్ర వాహనాల్లో బ్రాహ్మణ సదన్కు చేరుకున్న బ్రా హ్మణులు, సభా ప్రాంగణం వద్ద ‘దేశ్ కా నేత కేసీఆర్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభా కార్యక్రమానికి హాజరైన వారికి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు, ప్రణీత్ గ్రూప్ ఆధ్వర్యంలో భోజనాలు, మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందించారు. ఎండ వేడిమి అధికంగా ఉండటంతో చాలామంది సాయంత్రం వరకూ అక్కడే ఏసీ ఆడిటోరియంలో సేదదీరారు. బ్రాహ్మణ సమాజ విస్తృత ప్రయోజనాల కోసం మూడు అంతస్థుల్లో నిర్మించిన ఈ భవనంలో ఆడిటోరియం, సమాచార కేంద్రం, మఠాధిపతులు, పీఠాధిపతుల విడిది కోసం తగిన ఏర్పాట్లు ఉన్నాయి. వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చే బ్రాహ్మణులు అక్కడ ఉండే విధంగా గదులను కూడా నిర్మించారు.
మండుటెండలో చెప్పులు లేకుండా సీఎం కేసీఆర్ నడక
చండీయాగం, వాస్తుపూజలో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ మండుటెండలో చెప్పులు లేకుండానే పీఠాధిపతులు, వేద పండితులతో కలిసి నడుస్తూ సభా వేదికపైకి వచ్చారు. సీఎం వేదికపైకి చేరుకున్న అనంతరం వేద పండితులు ఆయనకు వేదాశ్వీరచనం పలికారు. అనంతరం సీఎం వేదపండితులను శాలువాతో సత్కరించి వారి ఆశీస్సులు అందుకున్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. బ్రాహ్మణ సమాజానికి వరాల జల్లు కురిపించారు.
బ్రాహ్మణసదన్లో ప్రణీత్ డెవలపర్స్ అన్నదానం
బ్రాహ్మణ సదన్ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన వేద పండితులు, అతిథులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులకు ప్రణీత్ డెవలపర్స్, అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి వచ్చిన వారందరికీ మినరల్ వాటర్ బాటిళ్లను సరఫరా చేశారు. ఉదయం అల్పాహారం కూడా అందించారు. యాగంలో పాల్గొన్న పండితుల కోసం ప్రత్యేకంగా మడి, ఆచారాలతో భోజనాలు తయారు చేయించారు. భోజన ఏర్పాట్లు చేసిన ప్రణీత్ డెవలపర్స్ చైర్మన్ నరేంద్ర కామరాజును బ్రాహ్మణ సంక్షేమ పరిషత్, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 1,500 మంది వరకూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేడు రాష్ట్రవ్యాప్తంగా అభిషేకాలు, హోమాలు: వాసుదేవశర్మ
ధూప, దీప, నైవేద్యం పథకాన్ని మరిన్ని ఆలయాలకు విస్తరించడంతోపాటు అర్చకులకు ఇచ్చే వేతనాలను రూ.పది వేలకు పెంచుతూ సీఎం ప్రకటించిన నేపథ్యంలో గురువారం కేసీఆర్ పేర రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ధూప, దీప, నైవేద్యం అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ తెలిపారు.
ఇతర రాష్ర్టాలకు ఆదర్శనీయుడు కేసీఆర్: గంగు ఉపేంద్రశర్మ
ధూప, దీప, నైవేద్యం పథకం అర్చకుల వేతనాల పెంపు పట్ల తెలంగాణ అర్చక సమాఖ్య గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ హర్షం వ్యక్తంచేశారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ఏర్పాటు చేయడమే కాకుండా బ్రాహ్మణుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలుచేస్తున్న సీఎం కేసీఆర్ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఎల్లవేళలా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఉపేంద్రశర్మ ఆకాంక్షించారు.
ధూప, దీప, నైవేద్యం పెంపు హర్షణీయం: కోలేటి దామోదర్
హిందూధర్మాన్ని పాటిస్తూ అన్ని మతాలను సమానంగా చూస్తున్న ఘనత దేశంలో ఒక కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. పేదరికంలో ఉన్నవారిని ఆదుకోవాలనే మానవీయ సంకల్పం కలిగిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. వేద పండితులకు గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచడం, ధూప, దీప, నైవేద్యం పథకం కింద ఇచ్చే మొత్తాన్ని రూ. పది వేలకు పెంచడం పట్ల హర్షం వ్యక్తంచేశారు.