పేదరికం ఎంతవరకు దేశంలో ఉంటదో.. అప్పటివరకు ఆక్రందనలు, అలజడులు కొనసాగుతూనే ఉంటాయి. పేదరికాన్ని పూర్తిగా నాశనం చేస్తేనే సమాజానికి శాంతి, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం లభిస్తుంది. ఈ వాస్తవాన్ని ఈ సందర్భంలో మనమందరం తెలుసుకోవాలి. ఆ దిశగా ప్రతిజ్ఞబూని కదలాల్సిన అవసరమున్నది.
-సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ప్రశాంతంగా ఉన్న భారత జాతిని చీల్చేందుకు జరుగుతున్న కుట్రలను ఐక్య కంఠంతో ఖండించాలని, ఆ దుష్ట ప్రయత్నాల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. ప్రపంచమే నేర్చుకొనేలా మహోజ్వల భారత నిర్మాణం వైపు అందరం పురోగమించాలని కోరారు. ఇందుకోసం స్వాతంత్య్ర వజ్రోత్సవ స్ఫూర్తితో ముందుకు కదలాలని కోరారు.
దేశ భవిష్యత్తు కోసం పునరంకితం కావాలన్నారు. సోమవారం హెచ్ఐసీసీలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘స్వేచ్ఛా వాయువులు పీల్చాలనే కాంక్షతో.. గొప్ప పేరున్న బారిష్టర్గా ఉండి, చాలా సంపాదించుకోగలిగే అవకాశాలు ఉన్నప్పటికీ.. మహాత్మాగాంధీ దేశ స్వాతంత్య్ర సమరానికి నాయకత్వం వహించడానికి నడుం కట్టారు. దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన గాంధీ.. అదే స్ఫూర్తి తో తన జాతి విముక్తం కోసం పోరాడేందుకు ఇక్కడికి వచ్చారు. చాలా గొప్ప బిడ్డను కన్నది మన భరతమాత.
గాంధీజీ స్వతంత్ర సముపార్జన సారథి మాత్రమే కాదు. యావత్ ప్రపంచానికే అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాంతి దూత, విశ్వ మానవుడు. నేను పార్లమెం ట్ సభ్యుడిగా ఉన్న కాలంలో.. తెలంగాణ కోసం ఉద్యమం జరిగే సందర్భంలో ఆనాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్కు వచ్చారు. ఢిల్లీలో పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆయ న చెప్పిన మాటలకు భారతీయుల గుండెలు పులకించిపోయాయి. వ్యక్తిగా నేను చాలా గర్వపడ్డ. ‘గాంధీ కనుక ఈ ప్రపంచంలో పుట్టి ఉం డకపోతే.. ఒబామా అనే నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడినే కాదు’ అని అన్నారు.
మహాత్మాగాంధీ లాంటి ఒక వ్యక్తి రక్త మాంసాలతో పుట్టి ఈ భూమ్మీద నడయాడతడని అనుకోలేదంటూ.. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి వారు వ్యాఖ్యానించారు. అంతటి మహాత్ముడు గాంధీ. ‘జీసెస్ నాకు జీవిత సందేశాన్నిస్తే.. గాంధీ దాన్ని ఆచరణలో చూపారని మార్టిన్ లూథర్ కింగ్ కొనియాడారు. దక్షిణాఫ్రికాలో రెండున్నర దశాబ్దాలకు పైగా తాను జరిపిన పోరాటానికి స్ఫూర్తి ప్రదాత మహాత్మాగాంధీ అని నెల్సన్ మండేలా అన్నారు. అం దుకే గాంధీ విశ్వమానవుడయ్యారు. ఆ విశ్వమానవుడిని కన్న గడ్డ నా భరతజాతి. అటువంటి జాతికి వారసులం మనమందరం.
గాంధీని నిందిస్తే సహించొద్దు
ఈ మధ్య కాలంలో విశ్వమానవుడైన మహాత్ముడిని కించపరిచే వ్యాఖ్యలు వింటుండటం దురదృష్టం. నేను ప్రాథమిక పాఠశాలలో అడుగుపెట్టినప్పటి నుంచి నేటి వరకు వందలు, వేల సందర్భాల్లో ‘స్వతంత్ర భారత్కీ జై.. మహాత్మాగాంధీకీ జై’ అని నినాదం చేసిన. కోటానుకోట్ల మంది ప్రజలు గాంధీ పటాన్ని నెత్తిన పెట్టుకొని ఊరేగిన దేశం ఇది. జాతిపితగా మనమే బిరుదాంకితుడిని చేసుకొన్న గొప్ప మానవతావాది. వారిని కించపరిచే ఘటనలు వాంఛనీయం కాదు. ప్రపంచంలో ఏ జాతి కూడా తన చరిత్రను తానే మలినం చేసుకోదు. అటువంటి వెకిలి, మకిలి ప్రయత్నాలు ఎక్కడ వచ్చినా మనమంతా ఏకోన్ముఖంగా ఖండించాలి. మన మహాత్ముడి కీర్తిని మరింత విశ్వవ్యాప్తం చేయాలి. మంచి ఎప్పుడూ మంచే అవుతుంది. శాశ్వతంగా ఉంటుంది. దాని విలువ ఏనాడూ తగ్గదు.
మహాత్ముడు ఏనాడైనా మహాత్ముడే. చిల్లర మల్లర ప్రయత్నాలు ఏనాటికీ నెరవేరవు. మహాత్ముడి దేశంగానే భారతదేశం ఉంటుందని నమ్మే వాళ్లలో నేనూ ఒకణ్ణి. నల్లగొండ జిల్లాలో చౌటుప్పల్ దగ్గర ఎవరో ఓ రెడ్డిగారు అధికారిగా ఉంటూ మహాత్మాగాంధీకి గుడి కట్టించిన సందర్భాన్ని మనం చూశాం. నేను గాంధీ అని తలెత్తుకొని చెప్పేవాళ్లు కోటానుకోట్లమంది ఉన్నారు. బయటిదేశాలకు వెళ్లినప్పుడు ‘ఐయామ్ ఫ్రం ఇండియా’ అని అంటే.., ‘ఆర్ యూ ఫ్రం గాంధీస్ కంట్రీ, ది గ్రేట్మ్యాన్స్ కంట్రీ’ అని ప్రశంసిస్తుంటే గర్వ పడుతాం.
అటువంటి మహాత్ముడికి ఏ పరిస్థితుల్లో కూడా కళంకం రాకుండా చూడాలి. ఎన్నో ప్రయాసలు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కష్టాలకు ఓర్చి ఈనాడు మనం అనుభవిస్తున్న భారతదేశం మనకు అందించబడింది. ఒక కూర్పు వెనుక ఎంత ప్రయాస ఉంటదో, ఎన్ని త్యాగాలు ఉంటాయో, ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో గాంధీ సినిమాలో కూడా చూపించారు. ఆ సినిమాలో బ్రిటిష్ ముష్కరులు.. అందరినీ సమాధి చేసే పరిస్థితి ఉం టది. మీరు ‘ఝుండ్కే ఝుండ్ ఏక్ తరహ్ మత్ జావో’ అని చెపుతారు. ఝుండ్ అంటే గ్రూప్.. అంతా ఒక్కదిక్కు పోకండి.. ‘నలుదిక్కులా పొమ్మన్నా కూడా మేం భయపడం.. సమస్యే లేద’ని గుండుకు ఎదురుగా గుండెను పెట్టి పోరాడిన జలియాన్వాలాబాగ్ ఉదంతం మనం చూశాం.
‘చంపండిరా ఇంకా ఎంతమందిని చంపుతరో.. ఎంతమందిమైనా చస్తాం కానీ మా స్వేచ్ఛా వాయువులు పీల్చే దాకా ఈ జెండా దించ’బోమని వందేమాతరమంటూ నినదిస్తూ వేల మంది బిడ్డలు నేలకొరిగారు. భగత్సింగ్ లాంటి త్యాగధనులు స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిండ్లు . ఈ దేశ స్వేచ్ఛ కోసం, మా భవిష్యత్తు కోసం.. ఈ రోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకొంటూ రాజ్యాంగం నీడలో.. చట్టాల పరిధిలో.. మ మ్ములను మేము పరిపాలించుకొనే స్థితిని తీసుకువచ్చిన ఆ నాటి స్వాతంత్య్ర యోధులందరికీ భారతీయుల తరఫున, తెలంగాణ తరఫున హృదయపూర్వక నివాళులు, జోహార్లు.
ప్రతీపశక్తులను ఎదుర్కోవాలి
కొన్ని ప్రతీప శక్తులు ఎప్పుడూ ఉంటాయి. వాటిని చూసి మనం చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారదోలిన గడ్డ ఇది. మనలోపల ఏదైనా బ్లాక్షీప్ వస్తే దాన్ని తీసి పారేసే శక్తి ఈ దేశానికి ఉన్నదని బలంగా నమ్మే వాళ్లలో నేను ఒకడిని. ఇక్కడ చెలరేగుతున్న, చెలరేగకొట్టడానికి, కూర్పును చెదరగొట్టడానికి, ప్రశాంత, సస్యశ్యామల భారతదేశంలో జాతిని చీల్చడానికి జరుగుతున్న కుట్రలను ఐక్య కంఠంతో ఖండించాలని ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నా. ఈ జాతిని, దేశాన్ని కచ్చితంగా కాపాడుకోవాలె. స్వాతంత్య్ర స్ఫూర్తిని, జరుగుతున్న అభివృద్ధిని మరింత ద్విగుణీకృతం చేసేలా ముందుకు పోవాలె. అవసరమైతే.. తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో వెళ్లి పనిచేయడానికి మనందరం కూడా సంసిద్ధులం కావాలి. తెలంగాణ ఏనాడూ వెనుకాడలేదు.
అనేక సందర్భాల్లో ఇక్కడినుంచి అనేకమంది బిడ్డలు పనిచేశారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. మనవాళ్లకు చాలామందికి తెలియదు, ఉప్పు సత్యాగ్రహంలో మన తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతోపాటు వేల మంది తెలంగాణ యువకులు పాల్గొన్నారు. ఇవేవీ ఇప్పటివాళ్లకు తెలియవు. మనమంతా అద్భుతమైన, ఉజ్వలమైన భారత నిర్మాణంవైపు పురోగమించాలి. ప్రపంచమంతా నేర్చుకొనేలా ముందుకు సాగాలి. అందుకు మీ అందరి కృషి దోహదపడాలి. ఈ స్వతంత్ర వజ్రోత్సవ దీప్తితో అడుగులు కదలాలి.
నాటి మహనీయుల త్యాగాలే.. నేటి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు
క్విట్ ఇండియా మహోద్యమాన్ని స్మరించుకున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): నాటి మహనీయుల త్యాగాల ఫలితమే.. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ఆగస్టు 9న క్విట్ ఇండియా డే సందర్భంగా నాటి త్యాగధనులను స్మరించుకొని, మహనీయులకు ఆయన నివాళులర్పించారు. భరతమాత దాస్య శృంఖలాలను తెంచి, బ్రిటీష్ వలస పాలనను పారదోలాలని మహా సంకల్పంతో భారత స్వాతంత్య్ర సమరంలో భాగంగా ‘డు ఆర్ డై’ అనే నినాదంతో మహాత్మాగాంధీ క్విట్ ఇండియా మహోద్యమాన్ని ప్రారంభించారని తెలిపారు.
మనం నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎంతటి విలువైనవో.. నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నా రు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నాటి అమరుల త్యాగాలను 15 రో జులపాటు వివిధ కార్యక్రమాల ద్వారా నివాళులర్పిస్తూ స్మరించుకోవాలని తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
‘మహాత్మాగాంధీ లాంటి ఒక వ్యక్తి రక్త మాంసాలతో పుట్టి ఈ భూమ్మీద నడయాడతడని అనుకోలేదు. అంతటి మహాత్ముడు మహాత్మాగాంధీ’
-ఆల్బర్ట్ ఐన్స్టీన్
జీసస్ నాకు జీవిత సందేశాన్ని ఇస్తే.. మహాత్మాగాంధీ దాన్ని ఆచరణలో చూపెట్టారు అంతటి మహనీయుడు.
-మార్టిన్ లూథర్కింగ్
‘నా పోరాటానికి.. నాకు ప్రముఖమైన స్ఫూర్తిప్రదాత మహాత్మాగాంధీ’
-నెల్సన్ మండేలా
మహాత్మాగాంధీ విశ్వమానవుడు. ఆ విశ్వమానవుడిని కన్నగడ్డ నా భరతజాతి.
– సీఎం కేసీఆర్
గాంధీ కనుక ఈ ప్రపంచంలో పుట్టి ఉండకపోతే ఒబామా అనే నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడినే కాదు.
– బరాక్ ఒబామా