CM KCR | పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ నూతన కార్యాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ చాంబర్లోని సీట్లో కలెక్టర్ సంగీతను కూర్చుండబెట్టారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు కలెక్టరేట్ వద్ద జిల్లా పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కేంద్రంలోని పెద్దకల్వల ఎస్సారెస్పీ క్యాంపు స్థలంలో 22 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో భవనాన్ని రూ.48.07 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించింది.
భవనంలో ఆరు బ్లాకులు, 98 గదులున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 40, మొదటి అంతస్తులో 29, రెండో అంతస్తులో 29 గదులు నిర్మించారు. భవన సముదాయంలో 41 శాఖలకు కార్యాలయాలుండగా గ్రౌండ్ ఫోర్లో సంక్షేమం, మత్య్స శాఖ, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు శాఖలకు సంబంధించిన ఛాంబర్లను ఏర్పాటుచేశారు. రూ.7 కోట్లతో పాలనాధికారి, అదనపు పాలనాధికారులకు సంబంధించిన క్యాంపు కార్యాలయాలు పూర్తి పూర్తవగా.. అధికారులు నివాసం ఉంటున్నారు. మరో ఎనిమిది మంది జిల్లాస్థాయి అధికారులు నివాస గృహాలు సైతం సిద్ధమయ్యాయి. కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.