కుల, మతాలకు అతీతంగా పేదవారు తమ ఇండ్లలో నిర్వహించుకునే శుభ, అశుభ కార్యక్రమాలకు పురోహితుల సేవలను కోరితే.. పురోహితులు వెళ్లి ఉచితంగా కార్యక్రమాలు జరిపించి రావాలని నేను రమణాచారి గారిని కోరుతున్నాను. ఈ విధంగా విప్రహిత సకల జనహితగా ఆదరింపబడాలని, విఖ్యాతి పొందాలన్నది నా వ్యక్తిగత అభిమతం.
వేదశాస్త్ర పండితులకు ప్రతినెలా ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా మరో 2,796 దేవాలయాలకు ధూప, దీప, నైవేద్యం పథకాన్ని విస్తరింపజేస్తాం. ఈ పథకం కింద దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు అందిస్తున్న మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతున్నాం. వేద పాఠశాలల నిర్వహణ కోసం ఇస్తున్న రూ.2 లక్షలను ఇకనుంచి వార్షిక గ్రాంట్గా ఇస్తాం. ఐఐఎం, ఐఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వర్తింపజేస్తాం. అనువంశిక అర్చకుల సమస్యలను త్వరలో క్యాబినెట్లో చర్చించి పరిషరిస్తాం.
– ముఖ్యమంత్రి కేసీఆర్
CM KCR | హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అర్చకులు, బ్రాహ్మణులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వరాల జల్లు కురిపించారు. ధూప, దీప నైవేద్యం పథకాన్ని మరో 2,796 దేవాలయాలకు విస్తరిస్తామని, ఈ పథకం ద్వారా అందే మొత్తాన్ని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతున్నామని ప్రకటించారు. వేదశాస్త్ర పండితులకు ప్రతి నెలా ఇస్తున్న గౌరవభృతిని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. చండీయాగం పూర్ణాహుతిలో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ రిబ్బన్ కట్చేసి విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వేద పాఠశాలలకు ఏటా రూ.2 లక్షల వార్షిక గ్రాంట్ను మంజూరుచేస్తామని తెలిపారు. ఐఐఎం, ఐఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలుచేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటనపై బ్రాహ్మణులంతా కరతాళధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. సభా వేదిక వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆశీర్వచనాలు అందజేశారు. ఆచంద్రతారార్కం కేసీఆర్ పేరు నిలిచిపోతుందంటూ దీవించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
మానవీయ కోణంలో ఆలోచించి పనిచేస్తాం
‘బ్రహ్మజ్ఞాన వాంస్తు.. బ్రాహ్మణః’ అని మన పెద్దలు చెప్పారు. బ్రహ్మజ్ఞానం పొందిన వారెవరికైనా బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది. వేదవాఙ్మయ విజ్ఞానాన్ని విపులంగా లోకానికి అందించేవారే విప్రులు. సర్వజనహితం, సర్వజన సుఖం బ్రాహ్మణుల లక్ష్యం. పురం యొక్క హితం కోరేవారే పురోహితులు. ‘లోకా స్సమస్తా.. సుఖినో భవంతు’ అన్నది బ్రాహ్మణుల నోట పలికే జీవనాదర్శం. బ్రాహ్మణుల మనసు, మాట, శరీరం, చేసే పని లోకహితం కోసమే. తెలంగాణ ప్రభుత్వ విధానం సర్వజన సమాదరణ. పేదరికం ఎవరి జీవితంలో ఉన్నా వారిని ఆదుకోవాలనే మానవీయ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది.
ఏడాదికి వంద కోట్లు
కులానికి పెద్దలైన బ్రాహ్మణుల్లోనూ చాలామంది పేదలు ఉన్నారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వం తన బాధ్యతగా భావించింది. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును తెలంగాణ ప్రభుత్వం 2017 ఫిబ్రవరి 1న ఏర్పాటు చేసింది. ఏడాదికి రూ.100 కోట్ల నిధులను బ్రాహ్మణ పరిషత్తుకు కేటాయిస్తున్నాం. ఈ నిధులతో వివిధ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు వివేకానంద ఓవర్సీస్ సాలర్షిప్ అందిస్తున్నాం. ఇప్పటివరకు 780 మంది విద్యార్థులను ఈ సాలర్షిప్ ద్వారా ఆదుకున్నాం. పేద బ్రాహ్మణుల జీవనోపాధి నిమిత్తం బ్రాహ్మిణ్ ఎంపవర్మెంట్ సీం ఆఫ్ తెలంగాణ స్టేట్ (బెస్ట్) పథకం అమలవుతున్నది. ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా గరిష్ఠంగా రూ.5 లక్షలు గ్రాంట్గా ప్రభుత్వం అందిస్తున్నది. ఇందుకోసం ఇప్పటివరకు ప్రభుత్వం రూ.150 కోట్లు వెచ్చించింది.
సదనాన్ని నిర్మించిన తొలి ప్రభుత్వంహైదరాబాద్ నగరంలో విప్రహిత బ్రాహ్మ ణ సంక్షేమ సదనాన్ని 9 ఎకరాల్లో రూ.12 కోట్ల వ్యయంతో అద్భుతంగా నిర్మించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇంత ఖర్చుతో సనాతన సంస్కృతి కేంద్రంగా బ్రాహ్మణ సదనాన్ని నిర్మించిన మొట్టమొదటి ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. విప్రహిత పేరుతో వెలసిన ఈ బ్రాహ్మణ సదనం ఆధ్యాత్మిక, వైదిక, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శక కేంద్రంగా నిలుస్తుంది. రాష్ట్రానికి విచ్చేసే పీఠాధిపతులు, ధర్మాచార్యుల విడిది కేంద్రంగా ఈ సదనం సేవలందించనున్నది.
పేద బ్రాహ్మణ కల్యాణాలకు ఉచితంగా ఇచ్చే వేదికగా ఈ భవనంలో ఏర్పాటు చేసిన కల్యా ణ మండపం ఉపయోగపడుతుంది. కుల, మతాలకు అతీతంగా పేదవారు తమ ఇండ్లలో నిర్వహించుకునే శుభ, అశుభ కార్యక్రమాలకు పురోహితుల సేవలను కోరితే.. పురోహిత బ్రాహ్మణులు వెళ్లి ఉచితంగా కార్యక్రమాలు జరిపించి రావాలని నేను రమణాచారి గారిని కోరుతున్నాను. ఈ విధంగా విప్రహిత సకల జనహితగా ఆదరింపబడాలని, విఖ్యాతి పొందాలన్నది నా వ్యక్తిగత అభిమతం.
వేదశాస్త్ర విజ్ఞాన భాండాగారంగా విలసిల్లాలి
వివిధ క్రతువులు, ఆలయ నిర్మాణాలు, ఆగమశాస్త్ర నియమాలు, దేవతా ప్రతిష్ఠలు, వివిధ వ్రతాల విధివిధానాలకు సంబంధించిన ఒక సమగ్రమైన గ్రంథాలయం ఈ సదనంలో ఏ ర్పాటు చేయాలని పెద్దలు రమణాచారి గారిని కోరుతున్నా. ఆయా వైదిక కార్యక్రమాలకు సం బంధించిన అరుదైన పుస్తకాలు, డిజిటల్ వీడియోలు ఈ లైబ్రరీలో లభిస్తాయి. వేద శాస్త్ర విజ్ఞాన భాండాగారంగా, ఆధ్యాత్మిక చైతన్య కేంద్రంగా, నిత్యం భారత, భాగవత, రామాయాణాది కావ్య ప్రవచనాలకు వేదికగా, కళలకు కొలువుగా బ్రాహ్మణ సదనం విలసిల్లాలి.
సూ ర్యాపేటలో డాక్టర్ ఏ రామయ్య ఇచ్చిన ఎకరా స్థలంలో బ్రాహ్మణ పరిషత్తు భవనాన్ని ప్రభు త్వం నిర్మించింది. దీనిని త్వరలోనే ప్రారంభించుకుందాం. ఖమ్మం, మధిర, బీచుపల్లి ప్రాంతా ల్లో కూడా బ్రాహ్మణ భవనాలను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నది. తన సంజీవని వ్యాఖ్య తో మహాకవి కాళిదాసు సాహిత్య ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా మహోపాధ్యాయుడు కోలాచల మల్లినాథ సూరి పేరున ఆ మహనీయుని స్వస్థలమైన మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వ విద్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తున్నదని మీ అందరి హర్షామోదాల మధ్య తెలియజేస్తున్నాను.
వేద పండితులకు గౌరవభృతి 5 వేలు
బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించుకున్న నేటి శుభ సందర్భంలో బ్రాహ్మణుల సంక్షే మం కోసం ప్రభుత్వం తీసుకున్న మరిన్ని నిర్ణయాలను మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్తు ద్వారా వేదశాస్త్ర పండితులకు ప్రతినెలా ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నాం. ఈ భృతిని పొం దే అర్హత వయసును 75 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు తగ్గిస్తున్నామని సవినయంగా తెలియజేస్తున్నాను. ప్రస్తుతం రాష్ట్రంలోని 3,645 దేవాలయాలకు ధూప, దీప నైవేద్య పథకం వర్తిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా మరో 2,796 దేవాలయాలకు కూడా ధూప, దీప నైవేద్యం పథకాన్ని విస్తరింపజేస్తాం. దీంతో రాష్ట్రంలో 6,441 దేవాలయాలకు ధూప, దీప, నైవేద్యం కింద నిర్వహణ వ్యయం అందుతుంది.
ఈ సందర్భంగా మరో శుభవార్తను కూడా మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు ధూప, దీప, నైవేద్యం పథకం కింద దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు రూ.6 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తున్నది. ఈ మొత్తా న్ని 10 వేలకు పెంచుతున్నాం. ఈ నిర్ణయం మీ అందరినీ ఎంతో సంతోష పెడుతుందని భావిస్తున్నాను. వేద పాఠశాలల నిర్వహణ కోసం ఇస్తున్న రూ.2 లక్షలను ఇకనుంచి వార్షిక గ్రాం ట్గా ఇస్తాం. ఐఐఎం, ఐఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు కూడా ఫీజు రీ యింబర్స్మెంట్ పథకాన్ని వ ర్తింపజేసే నిర్ణయం తీసుకున్నాం. అనువంశిక అర్చకుల సమస్యలను త్వరలో క్యాబినెట్లో చర్చించి పరిషరిస్తామని హామీ ఇస్తున్నాను.
ధర్మస్య విజయోస్తు..
సనాతన ధర్మ పరిరక్షణ నిలయంగా, వేద పురాణాల ఇతిహాస విజ్ఞాన సర్వస్వంగా, వైదిక క్రతువుల కరదీపికగా, పేద బ్రాహ్మణుల ఆత్మ బంధువుగా, లోకకల్యాణకారిగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్తు ఆధ్వర్యంలో ఈ విప్రహిత వెలుగొందాలని ఆ దేవ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరు నిత్యం పలికే లోకహిత కరమైన శాంతి మంత్రంతో ధర్మస్య విజయోస్తు.. ఆధర్మస్య నాశోస్తు.. ప్రాణీషు సద్భావనాస్తు.. విశ్వస్య కల్యాణమస్తు.. ఓం శాంతి శాంతి శాంతిః ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్కుమార్, అరికపూడి గాంధీ, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రదీప్, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అధ్యక్షుడు కేవీ రమణాచారి, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, జస్టిస్ భాస్కర్రావు, మాజీ సీఎస్ ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ, డీజీపీ అనురాగ్శర్మ, అరవిందరావు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, దేవీప్రసాద్రావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీవిదుశేఖర భాస్కర స్వామీజీ (శృంగేరిపీఠం), శంకర విజయేంద్ర సరస్వతి (కంచికోఠిపీఠం) స్వామీజీలు వీడియో సందేశం ద్వారా ఆశీర్వచనాలందించారు.
బ్రాహ్మణ సంక్షేమానికి తెలంగాణ పెద్దపీట: సీఎస్ శాంతికుమారి
విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం అపూర్వమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు. సర్వహిత సంక్షేమమే ధ్యేయం గా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని చెప్పారు. నిరుపేద బ్రాహ్మణుల సంక్షేమానికి ముఖ్యమంత్రి విశేష కృషి చేస్తున్నారని వివరించారు. బ్రాహ్మణ సంక్షేమానికి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ఉదహరించారు. ప్రభుత్వం ఇప్పటివరకు రూ.250 కోట్ల నిధులతో ఏడు వేల కుటుంబాలకు లబ్ధి చేకూర్చిందని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని చెప్పారు.
ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు: కేవీ రమణాచారివిప్రహిత బ్రాహ్మణ సదన్ ప్రారంభోత్సవంపై బ్రాహ్మణ సంక్షే మ పరిషత్తు చైర్మన్ రమణాచారి హర్షం వ్యక్తం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించడంపై ఆనందం వ్యక్తం చేయడంతోపాటు బ్రాహ్మణులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, చేస్తున్న కృషిని కొనియాడారు.
కేసీఆర్ పనులు విజయవంతం కావాలి: భారతీస్వామి
తెలంగాణలో బ్రాహ్మణ సంక్షేమానికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని శృంగేరి శారదాపీఠం జగద్గురు విధుశేఖర భారతీస్వామి కొనియాడారు. విప్రహిత భవన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన స్పందించారు. రూ.20 కోట్లతో విశాల ప్రాంగణంలో బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ చేపట్టే ప్రతి పని విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వచనాలు అందచేశారు.
ధర్మనిష్ఠుడు కేసీఆర్ : కంచి పీఠాధిపతి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మనిష్ఠ, ధార్మిక చింతన గల నేత అని కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి కొనియాడారు. విప్రహిత భవన ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ధర్మాన్ని ఆచరిస్తున్న తెలంగాణకు దేశంలోనే ప్రత్యేకస్థానమున్నదని వెల్లడించారు. ధర్మ సంస్కృతి పునురుద్ధరణకు కేసీఆర్ పాటుపడుతున్నారని కొనియాడారు.
ధర్మ రక్షకుడు కేసీఆర్
హిందూ ధర్మాన్ని, సంస్కృతీ, సంప్రదాయాలను పరిరక్షిస్తూ భవిష్యత్తు తరాలకు అందించడంలో బ్రాహ్మణులది కీలకపాత్ర. అటువంటి బ్రాహ్మణుల సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడటం అంటే హిందూ ధర్మాన్ని పరిరక్షించడమే. గోపన్పల్లిలో తొమ్మిది ఎకరాలు కేటాయించి రూ.12 కోట్లతో విప్రహిత బ్రాహ్మణ సదన్ నిర్మించడం ఒక్క సీఎం కేసీఆర్కే చెల్లింది. దేశంలోనే మరే నేతా ఇంతవరకు ఇటువంటి కార్యానికి పూనుకోలేదు. సర్వమతాలను సమదృష్టితో చూస్తున్న కేసీఆర్.. తనకు మరెవరూ సాటిరారని నిరూపించుకున్నారు. ఆయనకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.
– స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, విశాఖ శారదాపీఠం
ఇతర రాష్ర్టాలకు కేసీఆర్ ఆదర్శం
తెలంగాణ నిర్మితమైన భారీ బ్రాహ్మణ సదనంలాంటిది దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. పేద బ్రాహ్మణులకు విదేశీ విద్యాపథకం, పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా ఎదిగేందుకు ఉద్దేశించిన బెస్ట్ స్కీమ్ వంటి అనేక పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయి. దేశంలోనే తొలి బ్రాహ్మణ సదన్ నిర్మించిన ఘనత కేసీఆర్కే దక్కింది. బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించి బ్రాహ్మణుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధిని చాటుకుంటున్నారు. కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలుచేసి ఇతర రాష్ర్టాల సీఎంలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
– ప్రదీప్జ్యోతి, అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు
సమాజంలో నిరాదరణకు గురవుతున్న బ్రాహ్మణుల కోసం ఇంత భారీఎత్తున విప్రహిత బ్రాహ్మణ సదనం ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు పీఠాధిపతుల చేతుల మీదుగా ప్రారంభించుకోవడం ఎంతో గొప్ప విషయం. ప్రపంచంలో మరెక్కడా బ్రాహ్మణుల కోసం సదనం నిర్మించిన దాఖలాలు లేవు. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. బ్రాహ్మణుడిని కాపాడుకుంటే ధర్మం దానంతట అదే పరిరక్షింపబడుతుంది. బ్రాహ్మణుల సంక్షేమానికి పాటుపడటం ద్వారా ఈ మహత్కార్యాన్ని కేసీఆర్ చేసి చూపిస్తున్నారు. బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేయడం ఒక్క తెలంగాణలోనే ఉన్నది. స్వతహాగా అందరి సంక్షేమాన్ని కాంక్షించే కేసీఆర్ ధర్మ పరిరక్షణకూ పూనుకున్నారు.
– మృత్యుంజయశర్మ, సీఎం కేసీఆర్ గురువు
కేసీఆర్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు
బ్రాహ్మణ సదన్ నిర్మాణం ద్వారా సీఎం కేసీఆర్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. దేశంలో ఎక్కడా ఇటువంటి బ్రాహ్మణ సంక్షేమ పథకాలు లేవు. బ్రాహ్మణుల సంక్షేమానికి కృషిచేయడం ద్వారా ధర్మాన్ని, తద్వారా దేశాన్ని కాపాడే మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలకు చెందిన పండితులు, పురోహితుల ఆశీర్వచనం కేసీఆర్కు లభించింది. అన్ని వర్గాలను కలుపుకొని పోవాలన్న ఆయన తపన, దార్శనికత ఇతరులకు ఆదర్శనీయం.
– ప్రశాంత్ గాయ్ధనీ, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ట్రస్టీ, ఆలయ ప్రధాన పూజారి