హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): ఒక రోగి పూర్తి కోలుకొని, ఆరోగ్యవంతుడిగా తిరిగి వెళ్లాలంటే అతడికి చికిత్స చేసే వైద్యుడు ఎంత ముఖ్యమో.. ఆప్యాయంగా పలుకరిస్తూ, సమయానికి మందులు ఇస్తూ, ఇతర వైద్యసేవలు అందించే నర్సులు కూడా అంతే ముఖ్యం. అందుకే సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగాన్ని పటిష్ఠం చేయడంలో భాగంగా నర్సింగ్ వ్యవస్థను బలోపేతం చేసేలా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదివారం నూతన సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన వెంటనే.. టీచింగ్ దవాఖానల్లో 1827 నర్సుల పోస్టుల భర్తీ ఫైలుపై సంతకం చేశారు.
2014 నుంచి ఇప్పటి వరకు నర్సింగ్ పోస్టు ల భర్తీ 10 వేలు దాటాయి. 2017లో 3,311 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో అర్హత సాధించిన 2,418 మందికి పోస్టింగ్లు ఇచ్చారు. నిరుడు డిసెంబర్లో 5,204 నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. తాజాగా 1827 నర్సింగ్ పోస్టుల భర్తీకి మంత్రి హరీశ్రావు పచ్చజెండా ఊపారు. దీంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత నర్సింగ్ పోస్టుల రిక్రూట్మెంట్ 10,342కు చేరుకున్నది.
నర్సింగ్ నియామకాల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ ఇస్తున్నారు. వారికి 20 మార్కులు కేటాయించారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన ప్రతి ఆరు నెలల సర్వీస్కు 2.5 పాయింట్లు, ఇతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి ప్రతి ఆరు నెలలకు 2 పాయింట్లు ఇస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మేల్ నర్సులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం ఉండేది కాదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వారి ఆవేదనను అర్థం చేసుకొని మొదటి రిక్రూట్మెంట్లోనే దాదాపు 200 మంది మేల్ నర్సులకు అవకాశం కల్పించారు. నర్సింగ్ చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ భారీగా ైస్టెపెండ్ పెంచారు. ఇది దేశంలోనే అత్యధిక స్టెపెండ్ కావటం విశేషం.
తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలోని 6 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో 380 సీట్లు మాత్రమే ఉండేవి. 9 ఏండ్లలో ప్రభుత్వం 14 కాలేజీలు మంజూరు చేసింది. ఒక్కో కాలేజీలో 100 సీట్ల చొప్పున అందుబాటులోకి వస్తున్నాయి. జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఇప్పటికే వందల మంది స్టాఫ్ నర్సులకు హెడ్ నర్సులుగా ప్రమోషన్ ఇచ్చారు. హెడ్ నర్సులకు గ్రేడ్ టూ ప్రమోషన్, గ్రేడ్ టూ నర్సులకు గ్రేడ్ వన్ నర్సులుగా ప్రమోషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. నర్సింగ్ సెక్షన్లో డీఈ, ఏడీ పోస్టులను మంజూరు చేసింది. దేశంలోనే తొలిసారిగా ‘మిడ్ వైఫరీ వ్యవస్థ’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.