హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): గొత్తికోయల చేతిలో దారుణంగా హత్యకు గురైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ అటవీశాఖ క్షేత్రాధికారి చలమల శ్రీనివాసరావు సతీమణి నాగలక్ష్మికి ప్రభుత్వం డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం కల్పించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేతుల మీదుగా ఆమెకు సోమవారం నియామక ఉత్తర్వులు అందజేశారు. 2022 నవంబర్లో హత్యకు గురైన శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాల అండగా నిలిచింది. రూ.50 లక్షల ఎక్సగ్రేషియాతోపాటు ఖమ్మం జిల్లా కేంద్రంలో 500 గజాల స్థలం ఇచ్చింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునందించడం అటవీశాఖ చరిత్రలోనే మొదటిసారి. అంతేకాకుండా హరితోత్సవం సందర్భంగా అటవీ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం అటవీశాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి ఎంతో మనోధైర్యాన్ని కలిగించింది. పెద్దదికును కోల్పోయిన ఆ కుటుంబానికి తానే తండ్రి లాగా, కుటుంబ పెద్దగా నిలిచి వారికి ఇంటి స్థలం, ఆర్థిక సహాయంతోపాటు ఫారెస్ట్ సర్వీస్ రూల్స్ని సడలించి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్-తెలంగాణ చాప్టర్, అటవీశాఖ జూనియర్ ఫారెస్ట్ అధికారుల సంఘం, అటవీశాఖ క్షేత్రాధికారుల సంఘం, రాష్ట్ర అటవీశాఖ అధికారుల సంఘం, భారత అటవీశాఖ అధికారుల సంఘం నేతలు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. పెద్దదిక్కును కోల్పోయిన తమకు కుటుంబ పెద్దగా, తండ్రిగా సీఎం కేసీఆర్ అండగా నిలిచారని రేంజర్ శ్రీనివాసరావు భార్య నాగలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ఇంటి స్థలం, ఆర్థిక సహాయం అందజేశారని, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించారంటూ ధన్యవాదాలు తెలియజేశారు.