హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): సమస్త జీవరాసుల పట్ల ప్రేమ, కరుణ, అహింస, శాంతి, సహనంతో ప్రకృతితో మమేకమై జీవించాలనే మహాబోధి గౌతమబుద్ధుని జ్ఞానమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరమని, గౌతముని బోధనలను ఆచరించడం ద్వారా మానవ జీవితానికి పరిపూర్ణత సిద్ధిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. గౌతమబుద్ధుని జయంతి, బుద్ధపూర్ణిమను పురసరించుకుని ప్రజలందరికీ సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు. బుద్ధుని బోధనలు, కార్యాచరణను స్మరించుకున్నారు. 2,500 ఏండ్ల క్రితమే శాంతియుత సహజీవన సూత్రాలు, కార్యాచరణను విశ్వమానవాళికి అందించిన బుద్ధుడు సంచరించిన నేల మీద జీవిస్తుండటం ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయమని పేర్కొన్నారు. వర్ణ, లింగ, జాతి తదితర వివక్ష, విద్వేషాలకు వ్యతిరేకంగా, మహోన్నతమైన దార్శనికత, తాత్విక జ్ఞానంతో బుద్ధ భగవానుడు బోధించి ఆచరించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సూత్రాలు అజరామరమైనవని అన్నారు. మానవ సమాజం కొనసాగినంత కాలం బుద్ధుని బోధనలకు ప్రాసంగికత ఉంటుందని తెలిపారు.
బౌద్ధం పరిఢవిల్లిన తెలంగాణలో..
తెలంగాణ గడ్డ మీద బౌద్ధం పరిఢవిల్లడం మనందరికీ గర్వకారణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సామాజిక జీవన సంస్కృతిలోని మూలాలు బౌద్ధంలో ఇమిడి ఉన్నాయని వివరించారు. తెలంగాణలో బౌద్ధం గొప్పగా విస్తరించిందనడానికి కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వేల ఏండ్ల క్రితం వెలసిన బౌద్ధ్దారామాలు నేటికీ సజీవ సాక్ష్యాలుగా నిలిచాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నాగార్జునసాగర్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన ‘బుద్ధవనం’ ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నదని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా విలసిల్లిన నాటి బౌద్ధారామాలను పునరుజ్జీవింపచేస్తూ తెలంగాణ కేంద్రం గా బుద్ధుని బోధనలను ప్రపంచానికి అందించాలనే దృఢ సంకల్పంతో కార్యాచరణ కొనసాగుతున్నదని చెప్పారు. సమస్త రంగాల్లో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా పాలన కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. కుల, వర్ణ, వర్గ, మతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, పేదలు మొత్తంగా సకల జనుల సంక్షేమం అభివృద్ధి దిశగా పథకాలను అమలు చేస్తూ గౌతమబుద్ధుని ఆశయాలకు కార్యరూపమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఘన నివాళులర్పిస్తున్నదని అన్నారు.