హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పశుసంవర్థక శాఖకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారని ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అన్ని జిల్లాల పశువైద్యాధికారులు, పశుసంవర్థక అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నద్దే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీతో రూ.6500 కోట్ల సంపద సృష్టించబడిందని వెల్లడించారు. 2వ విడత గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 6 వేల కోట్లు విడుదల చేసిందని తెలిపారు.
పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని గొర్రెల యూనిట్ ధరను 1.25 లక్షల రూపాయల నుంచి 1.75 లక్షలకు పెంచినట్లు మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో పశుగ్రాసానికి కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో గొర్రెల మార్కెట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. దశల వారీగా పశు వైద్యశాలల అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల అమలులో పశుసంవర్థక శాఖ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది కృషి ఎనలేనిదని మంత్రి తలసాని కొనియాడారు.