CM KCR | అందరం ఒక్కటన్నారు.. మన అస్తిత్వాన్ని గుర్తించలేదు. సరికదా.. చిరఖ్యాతిని మూటగట్టుకున్న మన మహనీయుల జ్ఞాపకాలను చెరిపివేసే ప్రయత్నమూ చేశారు.
తెలంగాణ ఉద్యమంతో మట్టిపొరల్లో దాగిన మహోజ్వల చరిత మాణిక్యమై మెరిసింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత.. మన వైతాళికుల ప్రాభవం దేదీప్యమానంగా వెలిగింది.
అవును.. మనకు తెలియని మన చరిత్రను కండ్ల ముందు ఉంచింది తెలంగాణ ఉద్యమం. మన వీరుల త్యాగాలు, పోరాటాలను సమైక్య పాలకులు తొక్కిపెడితే ఒక్కొక్కటిగా వెలికి తీసి ప్రతి ఒక్కరూ చేతులెత్తి మొక్కేలా చేసింది. ఉద్యమంలో పాశుపతాస్ర్తాలైన యోధులకు స్వరాష్ట్రం సగర్వంగా సలాం చేసింది. పాలకుడికి సాహిత్యాభినివేశం.. పోరాటతత్వం.. మంచిని గుర్తించే చిత్తం ఉంటే ఎలా ఉంటుందో కేసీఆర్ పాలనలో నిరూపించారు.
చరిత్రలో శతాబ్దాలుగా, ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాలుగా మరుగునపడిన మహనీయులను వెలికి తీసి వారి త్యాగాలకు సగౌరవ కీర్తిని కట్టబెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. భావి తరాలకు స్ఫూర్తినిచ్చారు. తెలంగాణ అస్తిత్వ పతాకలైన ముద్దుబిడ్డల జయంతులు, వర్ధంతులు అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. వారి కీర్తి శాశ్వతంగా నిలిచిపోయేలా విశ్వవిద్యాలయాలకు పేర్లు పెట్టడమే కాకుండా, వారి పేర్ల మీద పురస్కారాలు అందిస్తుండటంతో యావత్ తెలంగాణ ఆ మహానుభావులను ఎల్లప్పుడూ తలుచుకుంటున్నది.
‘తెలంగాణలో కవులు లేరు’ అని సమైక్యాంధ్ర అహంకారాన్ని సురవరం ప్రతాపరెడ్డి ‘ఇదిగో తెలంగాణ అక్షర గవాక్షం’ అని 370 మంది కవులతో ‘గోల్కొండ కవులు’ సంచికను తెచ్చారు. మొగలాయి సింహాసనాన్ని సవాలు చేసి.. గోల్కొండ కోటపై బహుజన ధ్వజాన్ని రెపరెపలాడించిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ ముద్దుబిడ్డ. జల్.. జంగల్.. జమీన్.. అని అడవి బిడ్డల గొంతుకై నిలిచిన గోండు వీరుడు కుమ్రం భీం. తెలంగాణ రైతాంగ పోరాటంలో బెబ్బులిలా స్వైరవిహారం చేసి అసువులు బాసిన తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య. ఇలా ఎందరెందరో.. విప్లవ నాయకులు మలిదశ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు.
సర్వాయి పాపన్నగౌడ్. కుమ్రంభీం, నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్, పైడి జయరాజ్, దొడ్డికొమురయ్య, చాకలి ఐలమ్మ వంటి ఎందరో మహానుభావులను కుట్రపూరితంగా భూమిపొరల్లో గతపాలకులు తొక్కిపెట్టారు. ఉద్యమంలో సందర్భం వచ్చినప్పుడల్లా మన పోరాట వారసత్వాన్ని పేర్కొంటూ కేసీఆర్ వారి స్మృతులను గుర్తు చేసేవారు. స్వరాష్ట్రంలో వారికి సమున్నత స్థానం కల్పిస్తామని చెప్పేవారు. అన్నట్టుగానే తెలంగాణ ఆవిర్భావం తర్వాత చరిత్ర మరచిన మహనీయుల స్మృతులను మహోన్నత శిఖరాలపై ప్రతిష్ఠించారు. అందులో భాగంగానే సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నది. ఊరూరా తెలంగాణ వీర శివాజీ అని ఇవ్వాళ సర్వాయి పాపన్న విగ్రహాలు వెలుస్తున్నాయి. కుమ్రం భీం నడయాడిన జోడేఘాట్లో రూ.50 కోట్లతో మ్యూజియాన్ని నిర్మించింది. ఒకప్పుడు నిషేధిత ప్రాంతంగా ఉన్న జోడేఘాట్ నేడు పర్యాటక క్షేత్రమై విరాజిల్లుతున్నది. అంతేకాదు, రాజధాని నడిబొడ్డున ఆదివాసీ కుమ్రం భీం భవన్ నిర్మించి ఆ వీరుడికి ఘన నివాళి అర్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
తమ జీవితాంతం తెలంగాణనే శ్వాసించి.. ధ్యానించిన ఈ తరం యోధులను కేసీఆర్ గుండెలకు హత్తుకొని భవిష్యత్ తరాలకు వారధిగా నిలిపారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ పేరుతో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కొత్త జిల్లా భూపాలపల్లికి ప్రొఫెసర్ జయశంకర్-భూపాలపల్లిగా నామకరణం చేశారు. జయశంకర్ సార్ పార్థివదేహానికి తెలంగాణ సమాజం నివాళులు అర్పించిన ఏకశిలా పార్కుకు ఆ మహనీయుడి పేరే పెట్టారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జయశంకర్ సారు పేరును పెట్టారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఉద్యాన విశ్వవిద్యాలయానికి ఆయన పేరును పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గొంతుగా నిలిచిన సదాలక్ష్మి, ఈశ్వరీబాయి జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. సమైక్యపాలకుల నీటి కుట్రలను ఎండగట్టిన ‘నీళ్ల మనిషి’ ఆర్.విద్యాసాగర్రావు కీర్తి శాశ్వతంగా నిలిచిపోవాలని డిండి ప్రాజెక్టుకు ఆయన పేరును ఖరారు చేశారు. మల్కపేట రిజర్వాయర్కు కమ్యూనిస్టు యోధుడు చెన్నమనేని రాజేశ్వర రావు పేరును పెట్టారు. ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన కార్మిక నేత, నాయిని నర్సింహారెడ్డి జ్ఞాపకార్థం హైదరాబాద్ ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన ఉక్కువంతెనకు ఆయన పేరు పెట్టింది. మలి దశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి త్యాగాన్ని నిత్యం స్మరించుకునేలా హైదరాబాద్ ఎల్బీ నగర్ కూడలిని శ్రీకాంతాచారి చౌరస్తాగా కేసీఆర్ ప్రభుత్వం నామకరణం చేసింది. ఇలా మన త్యాగధనులను భావితరాలు గుర్తుంచుకునేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం ముదావహం
‘తెలంగాణ విడిపోతే దేశానికి ఆపత్తా.. రూపాయికి పైసలు నూరుకాకపోతాయా?’ అని నినదించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఈ గడ్డకు నిత్యస్మరణీయులు. అలాగే ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’.. ‘అన్నార్థులు, అనాథలుండని ఆ నవయుగమదెంతదూరం’ అని పల్లవించిన దాశరథి కృష్ణమాచార్య ప్రాతఃస్మరణీయులు. ఈ ప్రజాకవులంటే సీఎం కేసీఆర్కు వల్లమాలిన ప్రేమ. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచీ ప్రజాకవి కాళోజీ, దాశరథి జయంతి, వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. వారి పేరిట ఏటా పురస్కారాలను అందజేస్తూ కవి పండితులను గౌరవిస్తున్నది. కాళోజీ పార్థివదేహాన్ని దానంగా అందజేసిన చోట నిత్యస్మరణ కొనసాగాలని కాకతీయ మెడికల్ కాలేజీని విశ్వవిద్యాలయంగా మార్చి దానికి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా స్వయంగా కేసీఆరే నామకరణం చేశారు. హనుమకొండలో రూ. 50 కోట్లతో కాళోజీ కళాకేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ మహనీయుడి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది ప్రభుత్వం. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డితో కేసీఆర్కు ప్రత్యేక అనుబంధం ఉన్నది. సినారె కాలం చేసినప్పుడు ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారం నిర్వహించింది. ముఖ్యమంత్రి స్వయంగా ఆ కవి వైతాళికుడి పాడెను మోసి కవులపై తనకున్న భక్తిని చాటుకున్నారు. గోల్కొండ పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నది. సంస్కృత భాషాకోవిదుడు మల్లినాథ సూరి పేరిట మెదక్ జిల్లా కొల్చారంలో మల్లినాథ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నది.
నడి సంద్రంలో మునుగుతున్న భారత ఆర్థిక నావకు సంస్కరణల తెరచాప కట్టి ఒడ్డుకు తెచ్చిన మేధావి మన పీవీ నర్సింహారావు. ముఖ్యమంత్రి, పలు దఫాలుగా కేంద్రమంత్రి, ప్రధానమంత్రిగా పనిచేసి దేశ, విదేశాల్లో భారతకీర్తి ప్రతిష్ఠలను పెంచిన పీవీని కాంగ్రెస్ నిర్దాక్షిణ్యంగా విస్మరించింది. ఇప్పటిదాకా ప్రధానమంత్రులుగా పనిచేసి మరణించిన వారందరికీ ఢిల్లీలో సమాధులు (ఘాట్లు) నిర్మించింది. కానీ, కేంద్రంలో యూపీఏ-1 ప్రభుత్వం ఉన్నా పీవీ భౌతిక దేహాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించుకోవాల్సిన దుస్థితిని కాంగ్రెస్ కల్పించింది. అరకొర ఏర్పాట్ల కారణంగా ఆ రాజనీతిజ్ఞుడి పార్థివదేహం పూర్తిగా కాలకపోవడం.. తెలంగాణ బిడ్డకు కాంగ్రెస్ ఇచ్చిన గౌరవం ఏపాటిదో తేటతెల్లం చేస్తున్నది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ‘పీవీ మన ఠీవీ’ అని సీఎం కేసీఆర్ సగర్వంగా ప్రకటించారు. పీవీ శతజయంతి ఉత్సవాన్ని ఏడాదంతా సగర్వంగా నిర్వహించారు. పీవీకి నిలువెత్తు విగ్రహం పెట్టి ఆయన కీర్తి కిరీటంలో కలికితురాయి తొడిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
☞ బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ పేరిట హైదరాబాద్లో బంజారాభవన్ నిర్మించింది.
☞ తన భూమి కోసం నిజాం రాజును ఎదిరించిన చాకలి ఐలమ్మ వర్ధంతిని అధికారికంగా చేస్తున్నది.
☞ సాయుధపోరాట వీరుడు దొడ్డి కొమురయ్య పేరుమీద మెమోరియల్ భవన్ నిర్మించ తలపెట్టింది.
☞ బాలీవుడ్లో హీరోగా మెరిసిన తెలంగాణ కథానాయకుడు పైడి జయరాజ్ స్మృత్యర్థం రవీంద్రభారతిలోని మినీ ఆడిటోరియానికి ఆయన పేరు పెట్టింది.
… నూర శ్రీనివాస్