పంజాబ్లో మొత్తం ధాన్యాన్ని …రెండు పంటలు.. వరి, గోధుమను కొంటున్న మోదీ సర్కారు.. తెలంగాణలో మాత్రం ఒక్క పంటనే కొనుగోలు చేస్తున్నది.
నిరుడు పంజాబ్లో 202.82 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన కేంద్రం.. తెలంగాణలో 141.38 లక్షల టన్నులు మాత్రమే కొన్నది.
ఈ ఏడాది వానకాలంలో పంజాబ్లో 186.86 లక్షల టన్నుల ధాన్యాన్ని కొన్న మోదీ ప్రభుత్వం, తెలంగాణలో 70.26 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది.
తాజాగా యాసంగిలో పంజాబ్లో గోధుమలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న మోదీ సర్కారు తెలంగాణలో మాత్రం ధాన్యం (బాయిల్డ్ రైస్) కొనుగోలు చేయబోమని అంటున్నది.
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ‘మన రైతులకు అన్యాయం జరుగుతుంటే ఇంకా ఆగేది దేనికి? యాసంగి ధాన్యం కొనకపోతే వారి పరిస్థితి ఎట్లా? కేంద్రం ధాన్యం కొని తీరాల్సిందే, కొనేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇందుకోసం ఎంతకైనా తెగించి కొట్లాడుదాం’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించినట్టు తెలిసింది. తెలంగాణపై, రాష్ట్ర రైతాంగంపై కేంద్రం వివక్షను ఎండగట్టి తీరాలని, బీజేపీ కుటిలనీతిని బట్టబయలు చేయాలని నిశ్చయించుకొన్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో కేంద్రం మెడలు వంచి తీరాలని సీఎం కేసీఆర్కు మంత్రులు సూచించినట్టు తెలిసింది.
రాష్ట్రంలో యాసంగి ధాన్యం రాక ఏప్రిల్లో మొదలుకానున్నది. కానీ ఇప్పటిదాకా కేంద్రం నుంచి ఉలుకుపలుకు లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ శనివారం పలువురు మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్రం వైఖరిపై తీవ్ర ఆగ్రహం, ఆవేశం, ఆక్రోశాల మధ్య జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్తో పాటు మంత్రులంతా ఉద్వేగానికి లోనైనట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ధాన్యం కొనుగోలులో కేంద్రం ఉత్తరాదికి ఒక నీతి, దక్షిణాదికి మరో నీతి అవలంబిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. కేంద్రం.. తెలంగాణ రైతాంగంపై కక్ష కట్టిందని, కేంద్రం పూర్తిగా అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నదని, తెలంగాణ అంటేనే కండ్లలో నిప్పులు పోసుకుంటుందని ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది.
ఢిల్లీలో బియ్యం పారబోద్దాం
తెలంగాణ రైతుల యాసంగి ధాన్యం కొనుగోలులో కేంద్రం ఇదే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతకైనా తెగించి కొట్లాడాలని సమావేశంలో ముక్తకంఠంతో నిర్ణయించినట్టు తెలిసింది. తెలంగాణ బియ్యాన్ని రైళ్లలో, వెయ్యి లారీల్లో ఢిల్లీకి తరలించి ఇండియా గేట్ ముందు పోయాలనే ఆక్రోశం, ఆగ్రహం వ్యక్తమైనట్టు సమాచారం.
పంజాబ్లో కొంటరు.. తెలంగాణలో ఎందుకు కొనరు
ధాన్యం కొనుగోలు విషయంలో పంజాబ్పై ప్రేమను కురిపిస్తున్న కేంద్రం.. తెలంగాణపై మాత్రం వివక్ష చూపిస్తున్నదని సమీక్షలో అభిప్రాయపడ్డట్టు తెలిసింది. పంజాబ్లో మొత్తం ధాన్యాన్ని (రెండు పంటలు వరి, గోధుమ) కొంటుంటే.. తెలంగాణలో మాత్రం ఒక్క పంటనే కొనుగోలు చేస్తున్నదని అధికారులు చెప్పినట్టు తెలిసింది. అధికారుల లెక్కల ప్రకారం నిరుడు పంజాబ్లో 202.82 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన కేంద్రం.. తెలంగాణలో 141.38 లక్షల టన్నులు మాత్రమే కొన్నది. ఈ ఏడాది వానకాలంలో పంజాబ్లో 186.86 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనగా, తెలంగాణ నుంచి 70.26 లక్షల టన్నులే కొన్నది. తాజాగా యాసంగిలో పంజాబ్లో గోధుమలు కొనడానికి సిద్ధమవుతున్న మోదీ సర్కారు.. తెలంగాణలో బాయిల్డ్ రైస్ కొనబోమని ఇప్పటికే ప్రకటించింది. పంజాబ్లో రెండు పంటల ధాన్యాన్ని కొంటున్న కేంద్రం.. తెలంగాణలో రెండు పంటలను ఎందుకు కొనదు అని ప్రశ్నించినట్టు సమాచారం. ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్, వన్ నేషన్-వన్ కంట్రీ అని చెప్పడమే తప్ప ధాన్యం కొనుగోలు విషయంలో ఈ విధానాన్ని అమలుచేయట్లేదని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం.
ఇది తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్య
ఈ యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా రైతులు 35.84 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, దాదాపు 90 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నదని, ఈ ధాన్యాన్ని కొనకపోతే ఎలా? అని సీఎం, మంత్రులు ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం. ధాన్యం కొనుగోలు ఎన్నికలకు, రాజకీయాలకు సంబంధించిన సమస్య కాదని, ఇది తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్య అని సమావేశంలో సీఎం కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలిసింది. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న వ్యవసాయ రంగ మనుగడకు సంబంధించిన సమస్య అని, బడుగు, బలహీనవర్గాలకు చెందిన కూలీలు, రైతులకు సంబంధించిన సమస్య అని, లక్షలాది మంది ఉపాధికి సంబంధించిన సమస్య అని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఎంతోమంది జీవనోపాధికి సంబంధించిన సమస్యపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించడాన్ని సీఎం తీవ్రంగా ఆక్షేపించినట్టు సమాచారం. ఇలాంటి సమయంలో వారి హక్కులు, జీవితాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉన్నదని చెప్పినట్టు తెలిసింది. వీళ్లందరికి న్యాయం చేసేందుకు, తెలంగాణ వ్యవసాయరంగాన్ని కాపాడేందుకు ఎంతకైనా తెగించాలని, ఎందాకైనా కొట్లాడాలని సమావేశంలో ముక్తకంఠంతో నిర్ణయించినట్టు సమాచారం.
ఎదుగుతున్న రాష్ట్రంపై కత్తిగట్టారు
ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్న తెలంగాణ ప్రాంతం.. స్వరాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఓ దరికి చేరుతున్నది. సాగునీటి గోస తీరి, వ్యవసాయం బాగుపడుతున్నది. ఇలాంటి దశలో ఆదుకోవాల్సిన కేంద్రం.. రాష్ర్టాన్ని అణచివేయాలని చూస్తున్నదని సీఎం కేసీఆర్, మంత్రులు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. కొత్త రాష్ర్టాన్ని, కొత్త ఆయకట్టు రైతులను ప్రోత్సహించాల్సింది పోయి కక్ష సాధిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.