CM KCR | కర్నాటక ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్పై డీకే శివకుమార్పై తెలంగాణ ముఖ్యమంత్రి కుల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన డీకే శివకుమార్ కర్నాటకలో రైతులకు ఐదుగంటల కరెంటు ఇస్తున్నామని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కోదాడ సభలో సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఎప్పుడూ కూడా రావణకాష్టంగా ఉండేది. ఉద్యమాలతో అట్టుడుకుతుండేది. బతుకపోవడు.. వలసపోవుడు.. ఆరిపోవుడు.. ఏసి పంటలు ఎండిపోవుడు.. రైతుల ఆత్మహత్యలతో దారుణమైన పరిస్థితులు ఉండేవి.
గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా కర్ఫ్యూ కూడా రాష్ట్రంలో రాలేదు. భగవంతుడి దయతో ఎన్నడూ కరువు లేదు. ఈ సంవత్సరమే సాగర్ నిండలేదు కానీ.. గత పదేళ్ల నుంచి కరువు లేదు.. కర్ఫ్యూ లేదు. బ్రహ్మాండమైన తెలంగాణ ముందుకు వెళ్తున్నది. కరెంటుతో ఆధారపడ్డ రైతులకు 24గంటల కరెంటు ఇస్తున్నాం. కాంగ్రెస్ నేతలు కరెంటు వేస్ట్ చేస్తున్నరని మాట్లాడుతున్నరు. మీరు చెప్పాలి 24 గంటల కరెంటు కావాలా? వద్దా..? ఎక్కడకు పోయినా 24 గంటలు కావాలి అంటున్నారు. ఇంకొకటి సిగ్గుపోయే మాట.. కర్నాటక రాష్ట్రం నుంచి పెద్ద లీడర్ వచ్చిండు.
ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆయన వచ్చి మన పరిగి పోయిండు. ఆయన ఉపన్యాసం ఇస్తున్నడు. ఏమంటున్నండంటే.. కర్నాటక రాష్ట్రంలో బ్రహ్మాండంగా రైతులకు 5 గంటల కరెంటు ఇస్తున్నమని చెబుతున్నడు. చెప్పడానికి ఇజ్జత్.. సిగ్గుండాలా.. ఎక్కడైతే 24గంటల కరెంటు రాష్ట్రంలోకి వచ్చి మా రాష్ట్రంలో 5గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పడం ఇంతకన్నా దిగజారుడు ఉంటదా? ఏం మాట్లాడుతున్నవో ఒళ్లు తెలిసే మాట్లాడుతున్నవా? మొన్న కర్నాటకలో ప్రజలు నమ్మి ఓటు వేస్తే వారికి ఐదుగంటల కరెంటు దిక్కు చేశారు. వారంతా ఇవాళ ధర్నాలు చేస్తున్నారు. తెలంగాణలో కూడా నమ్మి ఓటు వేస్తే కాంగ్రెస్ కరెంటును కాటగలుపుతుంది’ అంటూ ప్రజలను హెచ్చరించారు సీఎం కేసీఆర్.