మనకు పంటల తెలంగాణ కావాల్నా..? మంటల తెలంగాణ కావాల్నా? తేల్చుకోవాలని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని కొంగరకలాన్లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం కొంగర్ కలాన్లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. పంటలు పండే తెలంగాణ మనకు కావాలని అన్నారు. మంటలు మండే రాష్ట్రమైతే మన భవిష్యత్ దెబ్బతింటదని హెచ్చరించారు. దేశంలో నిరంకుశ పోకడ చూస్తున్నామన్నారు. ఇలానే చూస్తూ ఉందామా? లేక పిడికిలెత్తి పోరాడుదామా? అని ప్రశ్నించారు.
కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఒక్క మంచిపని కూడా చేయలేదని విమర్శించారు. దళితులకు, గిరిజనులకు, మహిళలకు, బలహీనవర్గాలకోసం కేంద్రంలోని మోదీ సర్కారు ఏమైనా చేసిందా? అని ప్రశ్నించారు. బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో దేశంలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను సీఎం అయినప్పుడే మోదీ ప్రధాని అయ్యారని, కానీ తెలంగాణ లెక్క దేశంలో ఎక్కడా 24 గంటల కరెంటు, మంచినీళ్లు ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో 24 గంటల కరెంట్, ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తుంటే.. దేశ రాజధాని ఢిల్లీలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారని సీఎం ప్రశ్నించారు. ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? అని అడిగారు. కేంద్రంలో ఉండే ప్రధాని కుట్రలు పన్ని తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడులో మూడింట రెండో వంతు మెజార్టీతో గెలిచిన స్టాలిన్ సర్కారుతోపాటు పశ్చిమబెంగాల్లోని మమతాబెనర్జీ, ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కారును కూలదోసేందుకు మోదీ అప్రజాస్వామికంగా యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఇది ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. దీన్ని ఇట్లే భరిస్తే తాను చెప్పినట్టు మతపిచ్చి మంటలే వస్తాయని సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు.