బెల్లంపల్లి: కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ విమర్శల వర్షం గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు ప్రజల సంక్షేమాన్ని, రైతుల క్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బుధవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపైన, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపైన, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ బాస్ రాహుల్గాంధీపైన సీఎం కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు చేశారు.
‘కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పదంటే.. పీసీసీ అధ్యక్షుడు టికెట్లు అమ్ముకుంటున్నడని ఆ పార్టీ నేతలే లొల్లిపెడుతున్నరు. గాంధీభవన్ దగ్గర గేట్లకు తాళాలు వేసి ఆందోళన చేస్తున్నరు. ఇయ్యాల టికెట్లు అమ్ముకునేటోనికి రాష్ట్రాన్ని అప్పజెప్తె రేపు రాస్ట్రాన్ని అమ్మడా..? పార్టీ టికెట్లు అమ్మేటోళ్లు ఎంత గొప్పోళ్లు అన్నట్టు..? ఇసుంటి గొప్పోళ్లు మనకు కావాల్నా..? ప్రజల కోసం పనిచేసే బీఆర్ఎస్ పార్టీ కావాల్నా..? దయచేసి ఆలోచించాలి. మీ దీవెన ఉంటే తెలంగాణను ఈ దేశంలో నంబర్ వన్ స్టేట్గా తీర్చిదిద్దుతం’ అని సీఎం అన్నారు.
‘కాంగ్రెస్ పార్టీ నేతలు ధరణిని బంగాళాఖాతంలో ఎయ్యాలె అంటున్నరు. రైతుబంధు దుబారా అని మాట్లాడుతున్నరు. నిజంగానే ధరణిని బంగాళాఖాతంలో ఎయ్యాల్నా..? రైతుబంధు దుబారనేనా..? మీరు బాగా ఆలోచించాలి. ధరణిని తీసేయవద్దంటే, రైతుబంధు ఎప్పటిలాగే కొనసాగాలంటే ఇక్కడ దుర్గం చిన్నయ్యను గెలిపియ్యాలె. దుర్గం చిన్నయ్య లాంటోళ్లు గెలిస్తెనే రేపు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తది. అప్పుడే రైతుబంధు ఎప్పటిలాగే కొనసాగుతది. మేం 24 గంటల కరెంటు ఇస్తుంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు చాలు అంటున్నడు. కేసీఆర్ వేస్టుగ ఇస్తున్నడని హేళన చేస్తున్నడు. నిజంగానే మూడు గంటల కరెంటు సరిపోతదా..? సరిపోదు గదా..? మరి 24 గంటల కరెంటు కొనసాగాలంటె ఏంజెయ్యాలె..? దుర్గం చిన్నయ్యను గెలిపించాలె. లేదంటే కరెంటు కాట గలుస్తది. రైతుబంధుకు రాంరాం. మనం గుద్దేకాడ గుద్దకపోతే ఏమైతది..? తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లె మనం చల్లె. అందుకే ఆలోచించి ఓటేయాలి. మోసపోతె గోసపడ్తుం’ అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
‘కాంగ్రెస్ పార్టీ ఏనాడు రైతుల క్షేమం గురించి పట్టించుకోలే. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు ఇస్తున్నం. రైతబీమా సదుపాయం కల్పిస్తున్నం. కొత్తకుండలో ఈదొచ్చినట్లు తెలంగాణ వచ్చినప్పుడు ఏముండె..? మంచి నీళ్లు లేవు, సాగు నీళ్లు లేవు, పేదవాళ్లు చచ్చిపోవుడు, రైతులు చచ్చిపోవుడు, చేనేత కార్మికులు చచ్చిపోవుడు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉండె. ఒక్కొక్కటి సగబెట్టుకుంటూ అవినీతి రహిత పాలన చేస్తుంటే ఇప్పుడు తెలంగాణను ఇంత దూరం తీసుకొచ్చినం. ఇదే అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపియ్యాలె. దయచేసి మీరు ఆలోచన చేయాలని నేను కోరుతున్నా’ అన్నారు.
‘ఇప్పుడే చిన్నయ్య చెప్పిండు. బెల్లంపల్లిలో ప్రభుత్వ, సింగరేణిలో జాగాలు కలిపి దాదాపు 10 వేల మందికి ఇళ్ల పట్టాలు వచ్చినయన్నడు. ఇంకా కొంత మంది ఉన్నరు సార్ అని చెప్పిండు. వాళ్లందరికి గూడా పట్టాలు ఇప్పిచ్చే బాధ్యత నాది అని నేను హామీ ఇస్తున్నా. ఎవరున్నా మీ ఎమ్మెల్యేగారికి దరఖాస్తు పెట్టుండ్రి. తప్పకుండా వాళ్లందరికీ ఇస్తం. రైతుల క్షేమం కాంక్షించి మేం ధరణ తెస్తే భూముల క్రయవిక్రయాల్లో అవినీతి తప్పింది. మీ అనుమతి లేకుండా మీ భూమి మరో వ్యక్తి పేరు మీదకు మారకుంట చేసినం. ముఖ్యమంత్రికి కూడా మీ భూమిని మార్చే అధికారం లేదు. ధరణిని తీసి బంగాళాఖాతంల వేస్తమనే రాజ్యం కావాల్నా మనకు..? ధరణిని తీసేస్తమంటున్న పార్టీని ఏంజేద్దాం..? ధరణిని కాదు, ఆ పార్టీనే బంగాళాఖాతంల వేద్దాం’ అని పిలుపునిచ్చారు.