నల్లగొండ : మౌనంగా ఉంటే.. ఆ మౌనమే శాపమైతది. ప్రేక్షకుల్లా చూసి మనది కాదు అనుకూనే సందర్భం కాదు. ప్రతి
విద్యావంతుడు తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం. దయచేసి మునుగోడులో విద్యాధికులు, కవులు, కళాకారులు, రచయితలు, అన్నదమ్ముళ్లు, అక్కాచెళ్లెల్లు ఊరికి వెళ్లిన తర్వాత చర్చ చేయాలి. ఓటు వేసేటప్పుడు దేనికో ఆశపడి, ఎవడో చెప్పిండని మాయమాటకు లొంగి ఓట్లు వేస్తే మంచి జరుగదు. మనం పండ్లు తినాలంటే ముండ్ల చెట్లు పెడితే రావు. చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలే. ఓటు వేసే టప్పుడు జాగ్రత్తగా వేయాలి. గాడిదలకు గడ్డేసి.. ఆవులను పిండితే పాలు రావు. గడ్డి వేసేటప్పుడే గాడిదికి వేస్తున్నామా? ఆవుకు వేస్తున్నమా? అని ఆలోచన చేయాలి. మునుగోడులో యుద్ధం చేయాలి అని సీఎం కేసీఆర్ సూచించారు. చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మునుగోడులో చేనేత కార్మికులు ఉన్నారు. దేశంలో ఏప్రధాని కూడా చేయని దుర్మార్గం మోదీ చేసిండు. ఇబ్బందుల్లో ఉన్న చేనేతపై 5 శాతం జీఎస్టీ వేసి శిక్షిస్తున్నారు. ఏ విధంగా చేనేత బిడ్డలు బీజేపీకి ఓటు వేయాలి. ఆలోచించాలి. నాకే ఓటు వేయ్ అని అడగడం ధర్మమేనా? ఇవాళ వామపక్షాలు, టీఆర్ఎస్ కలిసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు పోరాటం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైనది. ఆ ఓటు బలంతోనే పోటు పొడుస్తానని చెప్పిన తర్వాత కూడా బీజేపీకే ఓటు వేయాల్నా? ఆలోచించాలి. పోస్టుకార్డు ఉద్యమంపై నిర్ణయం తీసుకోవాలంటే చేనేత బిడ్డలు బీజేపీకి ఓటు వేయొద్దు. నీ చేతిలో ఉన్న ఓటును బాగు, భవిష్యత్, దేశం కోసం వినియోగించమని చెబుతున్నాను.
దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. కానీ ఈ దేశం 2 లక్షల మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. ఏంది ఈ దుర్మార్గం. మన రాష్ట్రంలో తప్పా ఎక్కడా కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదు. కార్పొరేట్ల జేబులు నింపేందుకు బీజేపీ యత్నిస్తోంది. ప్రయివేటీకరణ అనే పాలసీని బీజేపీ అవలంభిస్తోంది. ఇది ఎంత వరకు కరెక్ట్. విద్యుత్ సంస్కరణల పేరిట విద్యుత్ మీటర్లు పెడుతామని చెబుతున్నారు. మీటర్లకు ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీటర్లను పెట్టుకుని కొంపలను పొగొట్టుకుందామా? ఈ విషయంపై ఆలోచించాలి. ఎన్నికల్లో చేసే దుర్మార్గపు ప్రలోభాలకు ఆశ పడితే గోస పడుతామని కేసీఆర్ పేర్కొన్నారు.