హైదరాబాద్ : ఏ రంగంలో చూసినా ఈ దేశం తిరోగమనంలోనే ఉందని, దీనికి బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని తిరిగి ఇంటికి పంపాల్సిందే.. ప్రగతిశీల విధానంలో పని చేసే ప్రభుత్వం రావాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా 20 వేల మంది పిల్లలను స్వదేశానికి తీసుకురావడానికి కూడా ఇబ్బందులు పడ్డారు. తద్వారా విద్యార్థులు అనేక బాధలు అనుభవించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మానసిక వ్యధ అనుభవించారు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన మెడికల్ విద్యార్థులను తామే చదివిస్తామని ప్రకటించాం. ఆ తర్వాత బెంగాల్ కూడా ప్రకటించింది. కేంద్రం నుంచి మాత్రం ఉలుకు లేదు.. పలుకు లేదు. కశ్మీర్ ఫైల్స్, విద్వేషాలు సృష్టించడం, సమాజాన్ని విడదీయమే బీజేపీ పని అని కేసీఆర్ ధ్వజమెత్తారు.
దేశంలో అభివృద్ధి లేదు. జీడీపీ పెంచేదిలేదు. ఆర్థిక వృద్ధిని పెంచలేదు. భయంకరమైన ఇండెక్స్ ఉన్నాయి. యూత్ నిరుద్యోగ ఇండెక్స్లో లాస్ట్ ర్యాంకులో ఉన్నాం. 20.84 ర్యాంకులో ఉన్నాం. సిరియా కంటే అధ్వాన్నంగా ఉన్నాం. అభివృద్ధి, ఉపాధి కల్పన రంగాల్లో తిరోగమనంలో ఉందని కేసీఆర్ తెలిపారు.
ఈ పార్టీ తీసుకొచ్చే దుర్మార్గ విధానాలను తిప్పికొట్టాలి. ప్రజలను చైతన్యవంతం చేయాలి. కేంద్ర వ్యతిరేక ఉద్యమాలను కూడా నిర్వహిస్తాం. కేంద్రం చెప్పిన ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు ఇవ్వలేదు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఖాళీలను భర్తీ చేయాలని ధర్నా చేస్తాం. ధాన్యం వద్దే ఆగిపోము. రిజర్వేషన్ల వ్యవహారంపై కేంద్రాన్ని నిలదీస్తాం. రిజర్వేషన్ల విషయంలో 50 శాతం కంటే ఎక్కువ ఉండొద్దని రాజ్యాంగంలో లేదు. ప్రత్యేక పరిస్థితులు సంభవిస్తే 50 శాతం అధిగమించొచ్చని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దీనిపై శాసనసభ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించింది. ఈ తీర్మానంపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎస్సీ వర్గీకరణపై కూడా తీర్మానం చేసి పంపించాం. దాని మీద కూడా అతిగతి లేదు. బీసీల కులగణను పట్టించుకోవడం లేదు. విద్వేషాలు సృష్టించి, ఉద్వేగాలకు లోను చేసి వాటిని రాజకీయంగా ఉపయోగించుకునే దుర్మార్గం నెలకొని ఉంది. దీని వల్ల దేశ అభివృద్ధి కుంటు పడుతుంది. దేశంలో అనేక భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతాయి. ప్రగతిశీల విధానంలో పని చేసే ప్రభుత్వం రావాలి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.