CM KCR | కరీంనగర్ : ఈ దేశంలో, రాష్ట్రంలో హిందూ మతం పేరిటి పంచాయితీలు పెడుతున్న బీజేపీపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో కరీంనగర్ ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని గంగుల కమలాకర్కు మద్దతుగా ప్రసంగించారు.
బీజేపీకి మతపిచ్చి తప్ప ఇంకోటి రాదు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశానికి 157 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు. ఒక్క కాలేజీ కూడా తెలంగాణకు నోచుకోలేదు. 100 ఉత్తరారాలు రాశాను. ఈ దేశాన్ని సాదే రాష్ట్రంలో మేం ఒకళ్లం. పన్నులు కడుతున్నాం. ఎందుకివ్వలేదు అని ప్రశ్నించాను. కనీసం ఒక్కటి ఇవ్వలేదు. మర్యాదకైనా ఒక్కటి ఇవ్వలేదు. ఆయన ఇవ్వలేదని నారాజ్ కాలేదు. మనం సన్నాసి కాదు కాదా..? ఆయన ముఖం మీ కొట్టినట్టు మెడికల్ కాలేజీలు మంజూరు చేసుకున్నాం. కాంగ్రెస్ హయాంలో పాత కరీంనగర్లో ఒక్క మెడికల్ కాలేజీ లేకుండా, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఇది మీ కండ్ల ముందున్న సత్యం. 50 ఏండ్ల కాంగ్రెస్ జమానాలో ఒక్క మెడికల్ కాలేజీ రాలేదు. మోదీ ఇవ్వలేదు. ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టుకుంటున్నాం. ప్రతి ఏడాది 10 వేల మంది డాక్టర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యానికి తెలంగాణ చేరిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఇంకోటి అయితే దారుణం.. పార్లమెంట్లో పాస్ చేసిన చట్టం ఉంది. జిల్లాకో నవోదయ పాఠశాల పెట్టాలని చట్టంలో ఉంటే, దాన్ని మోదీ ఉల్లంఘించారు. వందల సార్లు అడిగినా కూడా నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు. మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలి. దయచేసి ఆలోచించాలి. కరీంనగర్ ప్రజలు ఇది వరకే గోల్ మాల్ అయి ఓట్లేశారు. ఐదేండ్ల నుంచి బాధ పడుతున్నారు. వినోద్ ఎంపీగా ఉన్నప్పుడు ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉంది..? వాళ్ల సంస్కారం, మాటలు, పద్దతి ఏంది..? ఎంపీ వినోద్ ఉన్నప్పుడు కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్ సిటీలో పెట్టించారు. ఇప్పుడు స్మార్ట్ లేదు.. నా బోట్ లేదు.. వట్టిదే బొబ్బ.. మసీదులు తవ్వుదామా.. గుళ్లు తవ్వుదామా.. మసీదులు తవ్వేతోడు సిపాయా ఈ దేశంలో. మసీదులు తవ్వడం సంస్కారం ఉన్నోడు చేసే పనేనా..? అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.
హిందూ మతం పేరుతో కొట్లాటలు, పంచాయితీ.. ఇదా దేశానికి కావాల్సింది. దేశానికి ఏం కావాలా..? పేదరికంతో దళితులు, గిరిజనులు, బీసీల్లోని కొన్ని కులాలు బాధపడుతున్నారు. వారికి కావాలి పని. మతం, పంచాయితీ, కొట్లాట, తాకులాటలు పెట్టడం రాజకీయం అంటారా..? అన్ని వర్గాల ప్రజలు కులం, మతం అనే తేడా లేకుండా కలిసి బతకాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషి మనోడు. అందుకే ప్రగతిశీల పద్ధతుల్లో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతున్నది ఎవరు..? ఈ రాష్ట్ర విచ్చిత్తికి ప్రజానీకాన్ని డివైడ్ చేసి స్వార్థ రాజకీయం కోసం పాకులాడుతున్నది ఎవరో గమనించాలి. కరీంనగర్లో ఈ సారి కర్రు కాల్చి వాత పెట్టాలని అప్పీల్ చేస్తున్నాం. ఇంత చైతన్యం ఉన్న ప్రాంతం.. ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కరీంనగర్ ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పాలి. లేదంటే పిచ్చోళ్లు మాకే ఓట్లేస్తరు అని అనుకుంటారు, అలసత్వం వస్తది అని కేసీఆర్ అన్నారు.