CM KCR | హైదరాబాద్, అక్టోబర్ ౧౩ (నమస్తే తెలంగాణ): పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంసృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. శనివారం బతుకమ్మ పండుగ ప్రారంభం (ఎంగిలిపూల బతుకమ్మ) సందర్భంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకొంటూ, తెలంగాణ సంసృతీ సంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తున్నదని చెప్పారు.
ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై, ఉత్సవాల ముగింపు రోజైన సద్దుల బతుకమ్మ దాకా తొమ్మిది రోజులపాటు ఆడబిడ్డలంతా ఆటా పాటలతో కోలాటాలతో కలిసికట్టుగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంసృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వ వ్యాప్తంగా చాటుతుందని తెలిపారు. మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు మహిళా సాధికారతను పెంపొందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచాయని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలందరి బతుకుల్లో వెలుగులు నింపుతూ, మరింతగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని ప్రకృతి మాతను సీఎం కేసీఆర్ ప్రార్థించారు.