నల్లగొండ : విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి బంగారిగడ్డ బహిరంగ సభలో లేకపోవడాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. జగదీశ్ రెడ్డితో తనకు అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
మంత్రి జగదీశ్ రెడ్డి లేకుండా గత 20 ఏండ్లలో ఏ సభలో కూడా మాట్లాడలేదని సీఎం గుర్తు చేశారు. 2001 నుంచి ఆయన ఉద్యమంలో ఉన్నోడు. నేను ఇక్కడకు వచ్చే ముందు బాధతో వచ్చాను. ఏం తప్పు చేసిండు జగదీశ్ రెడ్డి. ఎందుకు పంపించారు ఇక్కడ్నుంచి ఆయనను. ఎందుకు నిషేధించారు. ఆయన గుండాగిరి చేసిండా? ఎవరినైనా కొట్టిండా? దౌర్జన్యం చేసినమా? అసలు టీఆర్ఎస్ పార్టీకి ఆ చరిత్ర ఉందా? వామపక్షాలకు ఆ చరిత్ర ఉందా? ఏం దౌర్జన్యం చేశామని? ప్రశాంత వాతావరణంలో మా ప్రచారం మేం చేసుకుంటున్నాం. ఈ రోజు ఆ బాధ ఉంది అని కేసీఆర్ పేర్కొన్నారు.